ETV Bharat / jagte-raho

కూతురి ప్రేమ.. తండ్రి కోపం.. ఆ యువకుడి ప్రాణం తీసింది!

author img

By

Published : Sep 25, 2020, 9:14 PM IST

Honor killing in Hyderabad
హైదరాబాద్​లో మరో పరువు హత్య

కూతురు పుట్టిందని తెలియగానే.. ప్రపంచాన్ని గెలిచినంత సంతోషించాడా తండ్రి. కన్నబిడ్డను కన్నతల్లి కంటే ఎక్కువగా భావించాడు. ప్రపంచంలోని ప్రేమనంత కూతురిపై కురిపించిన ఆ తండ్రికి.. కూతురు ప్రేమ రుచించలేదు. తనను కాదని ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆగ్రహించాడు. తన కుమార్తెకు ప్రాణానికి ప్రాణమైన ఆమె భర్తను బంధువులతో కలిసి పథకం వేసి అత్యంత క్రూరంగా హత్య చేయించాడు.

మిర్యాలగూడ ప్రణయ్ హత్య మరవకముందే.. ఆ తరహాలోనే రాజధానిలో మరో పరువు హత్య చోటుచేసుకుంది. హైదరాబాద్ చందానగర్​కు చెందిన హేమంత్ తన ఇంటికి ఎదురుగా ఉండే అవంతి ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అవంతి తండ్రి లక్ష్మారెడ్డి మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న హేమంత్ తండ్రి మురళి స్థిరాస్తి వ్యాపారం చేయగా.. తల్లి రాణి బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నారు. అవంతి-హేమంత్​ల పెళ్లి విషయం తెలిసిన లక్ష్మారెడ్డి, మేనమామ యుగంధర్ రెడ్డి ఆమెను హెచ్చరించారు. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మే వరకు అవంతిని ఇంట్లోనే నిర్బంధించారు. ఆమె దగ్గరి నుంచి చరవాణిని కూడా లాక్కున్నారు. తన కూతురి జోలికి రావద్దని హేమంత్​ను కూడా బెదిరించారు.

మా వాళ్ల నుంచి హాని ఉంది

జూన్ 10న ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అవంతి.. బీహెచ్​ఈఎల్​లోని దేవాలయంలో హేమంత్​ను ప్రేమవివాహం చేసుకుంది. అదే రోజు.. తమ కూతురు కనిపించడం లేదని లక్ష్మారెడ్డి.. చందానగర్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ప్రేమ వివాహం చేసుకున్న హేమంత్ అవంతి దంపతులు సైబరాబాద్ సీపీ సజ్జనార్​ను కలిసి, తమ తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని సీపీ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సజ్జనార్ సమస్యను పరిష్కరించాలని చందానగర్​ సీఐని ఆదేశించారు.

బెదిరింపులు తాళలేక.. ఇల్లు మార్చారు

చందానగర్​ సీఐ రవీందర్.. హేమంత్-అవంతిల తల్లిదండ్రులను పిలిచి రాజీ కుదిర్చారు. తండ్రి తన పేరు మీద రాసిన ఆస్తులను అవంతి తిరిగి తన తండ్రి పేరు మీదకు మార్చింది. అయినా.. హేమంత్​ను అవంతి తల్లిదండ్రులు, సమీప బంధువులు బెదిరించారు. వీరి బెదిరింపులు తట్టుకోలేక హేమంత్ దంపతులు చందానగర్ నుంచి తమ నివాసాన్ని గచ్చిబౌలిలోని టీఎన్జీవోస్ కాలనీకి మార్చారు.

నాన్న పిలిచాడని చెప్పి..

వారెక్కడుంటున్నారో తెలుసుకున్న అవంతి మేనమామ, ఇతర కుటుంబ సభ్యులు.. గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు గచ్చిబౌలికి వెళ్లారు. తన తండ్రి లక్ష్మారెడ్డి పిలుస్తున్నారని చెప్పి అవంతి-హేమంత్​లను కారులోకి ఎక్కించుకుని తీసుకువెళ్లారు. చందానగర్​ వైపు వెళ్లకుండా బాహ్యవలయ రహదారిపై తీసుకెళ్తుండగా.. అనుమానం వచ్చి వారు కారులో నుంచి దిగారు. గోపన్​పల్లి దండా వద్ద హేమంత్-అవంతిలతో మేనమామ యుగంధర్ రెడ్డి, ఇతర బంధువులు వాగ్వాదానికి దిగారు. చివరికి అవంతి కుటుంబ సభ్యులు హేమంత్​ను బలవంతంగా మరో కారులో అపహరించికుపోయారు. అవంతి అక్కణ్నుంచి తప్పించుకుని హేమంత్ తల్లిదండ్రులకు, పోలీసులకూ సమాచారం అందించింది.

ఆచూకీ దొరకలేదు

అనంతరం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్​లో అవంతి.. హేమంత్ అపహరణపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోపన్​పల్లి పరిసర ప్రాంతాల్లో గాలించారు. బాహ్యవలయ రహదారి టోల్​గేట్ వద్ద సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. పటాన్​చెరు వైపు వెళ్లినట్లు గుర్తించారు. రాత్రంతా చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఎక్కడా ఆచూకీ దొరకకపోవడం వల్ల చివరకు అవంతి మేనమామ యుగంధర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

మేమే హత్య చేశాం

హేమంత్​ను సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కిష్టయ్యగూడెం వైపు తీసుకెళ్లి హత్య చేసినట్లు యుగంధర్ రెడ్డి ఒప్పుకున్నాడు. తెల్లవారుజామున ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి.. శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శవపరీక్ష పూర్తైన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంగ్లాండ్​లో ఉన్న హేమంత్​ సోదరుడు శనివారం ఉదయం హైదరాబాద్​కు చేరుకోనున్నారు. అతను వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. హేమంత్ హత్య కేసులో పోలీసులు 13 మందిని అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.