ఖమ్మం జిల్లా వైరాలోని సంతబజార్కు చెందిన రంగు జగన్నాథచారి(75), వెంకట్రావమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కాగా అందరి వివాహాలయ్యాయి. గురువారం ఉదయం పాలప్యాకెట్ ఇచ్చేందుకు మనవడు వెళ్లగా.. ఇద్దరూ మృతి చెంది ఉన్నారు. చిన్నకుమార్తె అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోస్టుమార్టం చేసే ప్రయత్నంలో..
దంపతులిద్దరూ వయోభారంలో ఉండటం, కుటుంబ సభ్యులు దూరంగా ఉండటం వల్ల కొద్ది రోజులుగా మనస్తాపంతో ఉన్నట్లు స్థానికులు, కొంతమంది బంధువులు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవలే జగన్నాథచారి కిందపడి కాలికి గాయం కావడం వల్ల ఇద్దరూ కుంగిపోయారు. కుటుంబంలో అంతర్గత సమస్యలున్నట్లు క్లూస్ టీం గుర్తించింది.
పోస్టుమార్టం నిమిత్తం మధిర నుంచి వైద్యుడు సుధాకర్ను పోలీసులు వైరాకు పిలిపించారు. జగన్నాథచారి తల, చేతులపై గాయాలు ఉండటం.. వెంకట్రావమ్మ నాలుక కొద్దిగా పక్కకుపోవడం, చిన్న గాయాలు ఉండటం వల్ల అనుమానాలున్నాయని వైద్యుడు ధ్రువీకరించారు. ఇక్కడ పోస్టుమార్టం చేయలేమని మృతదేహాలను మధిరకు తరలించాలని స్పష్టం చేశారు.
ఏసీపీ సత్యనారాయణ, సీఐ వసంత్, ఎస్సై సురేశ్ సంఘటన స్థలంలో మృతదేహాల వద్దకు చేరుకుని సమగ్ర విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి: చెరువు వద్ద యువకుడితో సర్పంచ్ భర్త వాగ్వాదం.. పరస్పర దాడి