ETV Bharat / jagte-raho

కాసేపు ఆడుకొని వస్తానమ్మా అని.. కానరాని లోకాలకు వెళ్లిన దీక్షిత్

author img

By

Published : Oct 23, 2020, 8:36 AM IST

అరేయ్.. సాగర్​ అన్నతో బయటకు వెళ్తున్నానురా అని స్నేహితులతో చెప్పిన ఆ గొంతు మూగబోయింది. అమ్మా కాసేపు ఆడుకుంటానమ్మా అన్న ఆ బిడ్డ కనుమరుగైపోయాడు. చాక్లెట్​ ఇస్తాను రమ్మని పిలిచినతని మనస్సులో ఉన్న విషాన్ని గమనించని ఆ తొమ్మిదేళ్ల బాలుడు.. తెలిసినవాడే కదా అని అతనితో వెళ్లిపోయాడు. ఎంతకీ ఇంటికి తీసుకెళ్లకపోవడంతో అనుమానమొచ్చి ఏమైందన్నా.. ఇంటికెప్పుడు వెళదాం అని అడిగాడు. అదే అతని చివరి పలుకయింది. కష్టపడకుండగా డబ్బు సంపాదించాలనే ఆ కిరాతకుడి దురాశకు తొమ్మిదేళ్ల బాలుడి భవిష్యత్​ ఆవిరైపోయింది. కిడ్నాప్​ చేసిన బాలుడి తల్లిదండ్రుల వద్ద భారీ మొత్తంలో డబ్బు నొక్కేద్దామనుకున్న ప్లాన్​ బెడిసికొట్టడంతో ఆ బాలుడి గొంతు నులిమి, పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కన్నబిడ్డ కోసం నానాతంటాలు పడి లక్షల్లో డబ్బు పోగుచేసిన ఆ కన్నవారికి కడుపుకోత మిగిల్చాడు.

deekshith reddy is killed in mahabubabad district
మహబూబాబాద్​లో దీక్షిత్ రెడ్డి హత్య

మహబూబాబాద్ జిల్లాలో బాలుడి కిడ్నాప్ ఉదంతం విషాదాంతమయింది. కృష్ణకాలనీకి చెందిన వసంత-రంజిత్​ రెడ్డిల పెద్ద కుమారుడు దీక్షిత్ రెడ్డి(9)ని అపహరించిన రెండు గంటల్లోనే కిడ్నాప్ చేసిన నిందితుడు కిరాతకంగా హత్య చేశాడు. తన కుమారుడు తెలివైన వాడని.. కిడ్నాపర్ నుంచి ఎలాగైనా తప్పించుకుని వస్తాడని ఆశ పడిన ఆ కన్నతల్లికి కన్నీరే మిగిలింది.

దానమయ్య గుట్టకు తీసుకెళ్లి..

ఆదివారం సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో స్నేహితులతో ఆడుకుంటున్న దీక్షిత్​ను చాక్లెట్ ఇస్తానని నమ్మబలికి మందసాగర్ అనే వ్యక్తి తీసుకెళ్లాడు. తెలిసినవాడే కావడం వల్ల దీక్షిత్ స్నేహితులతో చెప్పి అతనితో వెళ్లిపోయాడు. దీక్షిత్‌ను కిడ్నాప్‌ చేసిన సాగర్‌.. మహబూబాబాద్‌ నుంచి ప్రధాన రహదారి మీదుగా కేసముద్రం మండలం అన్నారం గ్రామ పరిధిలో ఉండే దానమయ్య గుట్ట వద్దకు తీసుకెళ్లాడు. ఇది బాలుడిని కిడ్నాప్‌ చేసిన ప్రాంతం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. బైక్‌పై వెళుతున్న సమయంలో పట్టణ శివారులోని సీసీ కెమెరాలో దీక్షిత్‌ను బైక్‌పై తీసుకువెళుతున్న దృశ్యం నిక్షిప్తమైంది. దీక్షిత్‌ను దానమయ్య గుట్టపైకి సుమారు 100 మీటర్ల ఎత్తులోని పొదల్లోకి తీసుకెళ్లాడు. అక్కడే 2గంటల సేపు ఉంచాడు.

గొంతు నులిమి.. పెట్రోల్ పోసి..

ఇంటికి వెళదామని అనడంతో బాలుడితో మత్తు మాత్ర మింగించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. బాలుడు ఇంటికి వెళితే తన బండారం బయటపడుతుందని భావించి అపస్మారక స్థితికి చేరుకున్నాక సుమారు 8 గంటల ప్రాంతంలో దీక్షిత్‌ను గొంతునులిమి చంపినట్లు తెలిసింది. అనంతరం హంతకుడు శనిగపురంలోని ఇంటికి వెళ్లి మళ్లీ రాత్రి 9.15 గంటల ప్రాంతంలో తొలిసారి బాలుడి తల్లి వసంతకు కాల్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేశాడు. మృతదేహాన్ని ఎవరైనా చూస్తే ఆధారాలు దొరుకుతాయేమో అని భావించి రాత్రి 10.30 గంటల ప్రాంతంలో గుట్టపైకి వచ్చాడు. వెళ్లేటప్పుడు సీసాలో పెట్రోలు తీసుకెళ్లి మృతదేహాన్ని కాల్చివేశాడు. ఆ సమయంలో బాలుడి చేతులు కట్టేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతదేహం గుర్తు పట్టడానికి వీల్లేకుండా ఉంది.

ఇంటర్నెట్ కాల్

రంజిత్‌రెడ్డి తన కుమారుడు కిడ్నాప్‌ అయిన విషయాన్ని అగంతకుడి నుంచి ఆదివారం రాత్రి 9.15 గంటలకు వచ్చిన ఇంటర్నెట్‌ ఫోన్‌కాల్‌ ద్వారా తెలుసుకున్నారు. వెంటనే ఎస్పీ కోటిరెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది పట్టణమంతా విస్తృతంగా గాలింపు చేపట్టారు. అనుమానితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించి.. పలువురిని విచారించారు. బాలుడి తల్లిదండ్రులకు కిడ్నాపర్‌ ఆదివారం రాత్రి మొదలుకొని సోమవారం మధ్యాహ్నం, మంగళ, బుధవారాల్లో మొత్తం ఏడు సార్లు ఇంటర్నెట్‌ కాల్‌ చేశాడు.

చంపింది అతనే

సొమ్ము సిద్ధం చేసుకుని బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మూడుకొట్ల ప్రాంతంలోని కిడ్నాపర్‌ చెప్పిన ప్రదేశానికి వెళ్లిన రంజిత్‌ రాత్రి 9 గంటల వరకు నిరీక్షించారు. కొంతసేపటికి సాగర్‌ ఫోన్‌ చేసి తాళ్లపూసపల్లి రహదారి వైపు రావాలనడంతో అక్కడికి వెళ్లారు. గురువారం వేకువజాము వరకూ కిడ్నాపర్‌ జాడ లేదు. ఈలోగానే పోలీసులు అతని ఆచూకీ కనుగొని.. అదుపులోకి తీసుకోవడంతో బాలుడిని క్రూరంగా చంపేసింది మెకానిక్‌ సాగరే అని నిర్ధారణ అయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.