ETV Bharat / international

గుటెరస్ శాంతి యత్నం.. త్వరలో పుతిన్, జెలెన్​స్కీతో భేటీ

author img

By

Published : Apr 23, 2022, 2:04 PM IST

UN chief to visit Ukraine
UN chief to visit Ukraine Russia

UN chief Russia Ukraine visit: ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్.. రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటించనున్నారు. ఏప్రిల్ 26న రష్యాకు వెళ్లనున్న గుటెరస్.. ఏప్రిల్ 28న ఉక్రెయిన్​లో పర్యటించనున్నారు. ఇరుదేశాల అధినేతలతో వేర్వేరుగా సమావేశం కానున్నారు.

UN chief Russia Ukraine visit: రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న వేళ.. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ శాంతి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వచ్చే వారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్​స్కీతో వేర్వేరుగా సమావేశం కానున్నారు. ఏప్రిల్ 26న గుటెరస్ మాస్కోకు వెళ్లనున్నారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్​తో విందులో పాల్గొననున్నారు. అనంతరం, పుతిన్​ను కలవనున్నారు. రష్యా పర్యటన అనంతరం ఉక్రెయిన్​కు వెళ్తారు గుటెరస్. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబాతో సమావేశమవుతారు. ఏప్రిల్ 28న జెలెన్​స్కీతో భేటీ అవుతారని ఐరాస ప్రతినిధి తెలిపారు. ఉక్రెయిన్ ప్రజలకు మానవతా సాయం అందిస్తున్న వివిధ ఐరాస విభాగాల అధికారులతోనూ గుటెరస్ సమావేశం నిర్వహించనున్నారు. యుద్ధం ప్రారంభమై రెండు నెలలు గడిచిన నేపథ్యంలో ఈ పర్యటన జరగనుండటం గమనార్హం.

Guterres meet with Putin Zelenskyy: పర్యటన విషయమై ఇదివరకే పుతిన్, జెలెన్​స్కీలకు గుటెరస్ లేఖలు రాశారు. ఉక్రెయిన్​లో శాంతి కోసం చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. కాల్పుల విరమణ కోసం వివిధ పక్షాలు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంపై విచారం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన ప్రజలను తరలించేందుకు వీలుగా యుద్ధానికి విరామం ఇవ్వాలని సూచించారు. 'ఉక్రెయిన్​లో 1.2కోట్ల మందికి మానవతా సాయం అవసరం ఉంది. ఇందులో మూడోవంతు ప్రజలు డొనెట్స్క్, లుహాన్స్క్, మేరియుపోల్, ఖేర్సన్ వంటి నగరాల్లోనే ఉన్నారు. మానవతా సాయం కోరుకునే వారి సంఖ్య కోటి 57 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. ఉక్రెయిన్​లో ప్రస్తుతం ఉన్న ప్రజల్లో ఈ సంఖ్య 40శాతానికి సమానం. ఇలాంటి చావు బతుకుల మధ్య ఉన్న ప్రజల కోసం రష్యా, ఉక్రెయిన్​లు తుపాకులు వదిలాలని పిలుపునిస్తున్నా' అని ఆందోళన వ్యక్తం చేశారు గుటెరస్.

మరోవైపు, ఉక్రెయిన్​లోని మేరియుపొల్​లో రష్యా సేనలు మారణహోమం సృష్టిస్తున్నాయి. వేల సంఖ్యలో ఉక్రెయిన్​ పౌరులను హతమార్చి.. ఆ నేరాలను దాచిపెట్టేందుకు మృతదేహాలను పాతిపెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మేరియుపొల్​ సమీపంలో తాజాగా వెలుగు చూసిన సామూహిక సమాధులు ఆ వాదనలకు బలం చేకూర్చుతున్నాయి. ఈ కథనం కోసం లింక్​పై క్లిక్ చేయండి.

ఇదీ చదవండి: 'భారత్​కు విలువ ఇస్తాం.. ఆ విషయంలో మాత్రం ప్రోత్సహించలేం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.