ETV Bharat / international

శ్రీలంకలో సోషల్ మీడియా బంద్.. ప్రధాని తనయుడి 'వీపీఎన్'​ సెటైర్!

author img

By

Published : Apr 3, 2022, 1:45 PM IST

Sri Lanka social media ban: దేశంలో చెలరేగిన నిరసనలను అదుపు చేసేందుకు ఎమర్జెన్సీ విధించిన శ్రీలంక ప్రభుత్వం.. తాజాగా సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు ప్రవేశపెట్టింది. శనివారం అర్ధరాత్రి తర్వాత నుంచి సామాజిక మాధ్యమాలు నిలిచిపోయాయి. కర్ఫ్యూ అమలులో ఉన్న నేపథ్యంలో కొలంబోలో.. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అయితే, సామాజిక మాధ్యమాలపై విధించిన ఆంక్షలను పునఃపరిశీలించాలని శ్రీలంక ప్రధాని తనయుడు కోరారు.

Sri Lanka imposes nationwide social media blackout
Sri Lanka imposes nationwide social media blackout

Sri Lanka social media ban: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. దీంతో వాట్సాప్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ సహా ఇతర సామాజిక మాధ్యమాలు శనివారం-ఆదివారం మధ్యరాత్రి నుంచి నిలిచిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలరేగుతున్న ఆందోళనలను అణచివేయడానికే పాలకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది.

Sri Lanka crisis: సంక్షోభ నివారణలో ప్రభుత్వం విఫలమైందంటూ వివిధ ప్రజాసంఘాలు శనివారం పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చాయి. వీటి నియంత్రణకు ఉపక్రమించిన అక్కడి ప్రభుత్వం 36 గంటల అత్యవసర పరిస్థితి విధించింది. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఆ వెంటనే సామాజిక మాధ్యమాలపై కూడా నిషేధం విధించడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కర్ఫ్యూ సైతం అమలు అవుతున్న నేపథ్యంలో కొలంబోలో.. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితమయ్యారు.

Sri Lanka protests: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో కొన్నిరోజులుగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. గురువారం అర్ధరాత్రి అధ్యక్షుడి ఇంటిని వారు ముట్టడించారు. ఆదివారం దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలను అణచివేయడానికి రాజపక్స హుటాహుటిన అత్యవసర పరిస్థితి సహా ఇతర కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సంక్షోభం తమ నిర్ణయాల ఫలితం కాదని.. కరోనా మహమ్మారి మూలంగానే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయని తమ చర్యలను సమర్థించుకున్నారు.

Namal Rajapaksa tweet: అయితే, సామాజిక మాధ్యమాలపై తాజాగా విధించిన ఆంక్షలను శ్రీలంక ప్రధానమంత్రి మహీంద రాజపక్స తనయుడు, యువజన, క్రీడా శాఖ మంత్రి నమల్ రాజపక్స తోసిపుచ్చారు. సామాజిక మాధ్యమాలను నిలిపివేయడాన్ని తాను సమర్థించలేనని చెప్పారు. వీపీఎన్ సాంకేతికత ద్వారా సామాజిక మాధ్యమాలను ఇప్పటికీ ఓపెన్ చేయవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు బ్యాన్ విధించిన తర్వాత వీపీఎన్ ఉపయోగించి ట్వీట్ చేశారు. ఈ నిర్ణయాన్ని పునపరిశీలించాలని, అధికారులు మరింత ప్రగతిశీలంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పుకొచ్చారు.

Sri Lanka imposes nationwide social media blackout
నమల్ రాజపక్స ట్వీట్

భారత్ సాయం: సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి శ్రీలంకకు భారత్ 2.5 బిలియన్ డాలర్ల సాయం అందించింది. లక్షా 50 వేల టన్నుల ఇంధనాన్ని నాలుగు కంటైనర్లలో పంపినట్లు శ్రీలంకకు భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే తెలిపారు. మరో ఐదు కంటైనర్లు మే నెలలో పంపనున్నట్లు వెల్లడించారు. ఇంధనం కోసం శ్రీలంకకు 500 మిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చిన భారత్.. ఆహారం, ఔషధాలు, అత్యవసర వస్తువుల కోసం మరో బిలియన్ డాలర్లు అందించాలని గత నెలలోనే నిర్ణయించుకుందని వివరించారు. ఇందులో భాగంగా బియ్యంతో కూడిన కంటైనర్ శ్రీలంకకు త్వరలోనే చేరుకుంటుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. అసలేమైంది?.. ఎవరు బాధ్యులు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.