ETV Bharat / international

తారస్థాయికి శ్రీలంక సంక్షోభం.. వీధి దీపాలకూ పవర్​ కట్​

author img

By

Published : Apr 1, 2022, 4:33 AM IST

Updated : Apr 1, 2022, 6:20 AM IST

Sri Lanka Crisis: శ్రీలంక ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతోంది. జల విద్యుత్ కొరతతో ఆ దేశం విద్యుత్‌ కోతలు ఎదుర్కొంటోంది. ఇక నుంచి విద్యుత్ ఆదా చేసేందుకు వీధి దీపాలనూ ఆర్పివేయనున్నట్లు గురువారం.. శ్రీలంక వెల్లడించింది. రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోవడంతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశంలో జలవిద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

srilanka crisis
శ్రీలంక సంక్షోభం

Sri Lanka Crisis: ద్వీప దేశం శ్రీలంక ఆర్థిక, ఇంధన సంక్షోభంలో చిక్కుకుపోయింది. జల విద్యుత్ కొరతతో ఆ దేశం విద్యుత్‌ కోతలు ఎదుర్కొంటోంది. ఇక నుంచి విద్యుత్ ఆదా చేసేందుకు వీధి దీపాలను కూడా ఆర్పివేయనున్నట్లు గురువారం ఆ దేశం వెల్లడించింది. 'విద్యుత్‌ ఆదా చేసేందుకు దేశవ్యాప్తంగా వీధి దీపాలను ఆర్పేయాలని మేం ఇప్పటికే అధికారులను ఆదేశించాం' అని విద్యుత్ శాఖ మంత్రి పవిత్రా వన్నియారాచి వెల్లడించారు. 500 మిలియన్ డాలర్ల రుణం కింద భారత్ నుంచి శనివారం డీజిల్ షిప్‌మెంట్ రానుందని ఆమె అంచనా వేశారు. అయితే ఇప్పుడప్పుడే పరిస్థితి మాత్రం మెరుగుపడే అవకాశం లేదని హెచ్చరించారు. వానలు పడేవరకు ఈ పరిస్థితి ఉండొచ్చన్నారు. అంటే మే వరకు ఈ కోతలు కొనసాగే అవకాశం ఉంటుందని మీడియాకు వెల్లడించారు. రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోవడంతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశంలో జలవిద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ విద్యుత్ అంతరాయం అక్కడి స్టాక్‌ మార్కెట్‌పైనా ప్రభావం చూపింది. కొలంబో స్టాక్‌ మార్కెట్లో రోజువారీ ట్రేడింగ్‌ సమయం నాలుగున్నర గంటల నుంచి రెండు గంటలకు తగ్గిపోయింది. విద్యుత్ కోతలు, తగ్గిన ట్రేడింగ్ గంటల వంటి పలు కారణాలతో స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూస్తోంది. ట్రేడింగ్ నిలిపివేయాల్సిన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి.

లంకలో ఎందుకీ పరిస్థితి.. : పర్యాటక దేశంగా పేరొందిన శ్రీలంకలో 2019లో ఈస్టర్‌ పండగ నాడు ఓ చర్చిలో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటన ఆ దేశ పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. ఆ తర్వాత కరోనా మహమ్మారి ప్రభావంతో పాటు ప్రభుత్వం తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలు ఆ దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి. విదేశీ మారక నిల్వలు పడిపోవడంతో దిగుమతులపై నిషేధం విధించారు. ఫలితంగా చమురు, నిత్యావసరాల కొరత ఏర్పడి వాటి ధరలు ఆకాశాన్నంటాయి. చివరకు కాగితం కొరతతో విద్యార్థులకు ఈ నెలలో నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.

ఇదీ చదవండి: 'రాజీనామా చేసే ప్రసక్తే లేదు.. చివరి వరకు పోరాడతా'

Last Updated : Apr 1, 2022, 6:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.