ETV Bharat / international

'విదేశీ రుణాలు చెల్లించలేం'.. చేతులెత్తేసిన శ్రీలంక

author img

By

Published : Apr 13, 2022, 7:01 AM IST

Sri Lanka crisis: సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు శ్రీలంక ప్రభుత్వం చివరి ప్రయత్నం చేసింది. విదేశీ రుణాలను ప్రస్తుతం తిరిగి చెల్లించలేమని ప్రకటించింది. విదేశీ మారక నిల్వలు అడుగంటిన నేపథ్యంలో అత్యవసర వస్తువుల దిగుమతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Sri Lanka crisis
Sri Lanka crisis

Sri Lanka crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలతోపాటు ఇతర రుణదాతలు ఇచ్చిన రుణాలను ప్రస్తుత సమయంలో తిరిగి చెల్లించలేమని చేతులు ఎత్తేసింది. విదేశీ రుణాలను డీఫాల్ట్‌గా ప్రకటించిన శ్రీలంక.. మొత్తం 51 బిలియన్‌ డాలర్ల విదేశీ రుణాలను చెల్లించలేమని పేర్కొంది. విదేశీ మారకనిల్వలు అడుగంటిన నేపథ్యంలో.. అత్యవసర వస్తువుల దిగుమతికి ఈ చర్యలు 'చివరి ప్రయత్నం'గా పేర్కొంది. తీవ్ర ఆర్థిక, ఆహార, ఇంధన కొరతతో అల్లాడుతోన్న శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకు తాజా చర్యలు చేపట్టామని తెలిపింది.

Sri Lanka loan default: తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంక విదేశీ రుణ చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అక్కడి సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రకటించింది. 'రుణాల చెల్లింపులు సవాళ్లతో కూడుకున్నదే కాకుండా అసాధ్యం అనే స్థితికి చేరిపోయం. రుణాలను పునర్నిర్మించడంతోపాటు పూర్తి డీఫాల్ట్‌ను నివారించడమే ప్రస్తుతం తీసుకోగలిగిన ఉత్తమ చర్య' అని శ్రీలంక సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ పీ నందాలాల్‌ వీరసింఘే పేర్కొన్నారు. చిత్తశుద్ధితోనే ఈ చర్యలు తీసుకున్నామన్న ఆయన.. 2.2కోట్ల జనాభా కలిగిన శ్రీలంక గతంలో రుణ చెల్లింపులను ఎన్నడూ ఎగవేయలేదని ఉద్ఘాటించారు.

Sri Lanka debt trap: ఇదిలాఉంటే, 'కొవిడ్‌ లాక్‌డౌన్‌' కారణంగా విదేశీ మారక నిల్వలు మరింత క్షీణించాయని శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్స పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోందన్న ఆయన.. ప్రజలు ఆందోళనలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే దేశంలో జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోతూ పరిస్థితులు దారుణంగా మారాయని.. రానున్న రోజుల్లో నిత్యవసర వస్తువులతోపాటు గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు విపరీతంగా పెరగడంతో పరిస్థితులు మరింత క్షీణించనున్నాయని అన్నారు.

కొత్ తసంవత్సరాదికి భారత్ బియ్యం: ఏప్రిల్ 13, 14 తేదీల్లో శ్రీలంక సింహళ, తమిళ కొత్త సంవత్సరాది సంప్రదాయ పండగను జరుపుకోనుంది. ఈ పండుగకు ఒక్కరోజు ముందు మంగళవారం 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యం భారత్ నుంచి కొలంబొ రేవుకు చేరుకున్నాయి. ఆర్థిక సంక్షోభంతో కుదేలైన శ్రీలంకకు భారత్ అండగా నిలుస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున డీజిల్​ను సరఫరా చేసింది.

ఇదీ చదవండి: శ్రీలంకకు భారత్‌ ఆపన్న హస్తం.. చిగురిస్తున్న స్నేహ బంధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.