ETV Bharat / international

'విలీన ప్రాంతం'పైకి దూసుకెళ్లిన రష్యా రాకెట్లు.. ముగ్గురు మృతి.. 12మందికి తీవ్రగాయాలు!

author img

By

Published : Oct 7, 2022, 7:41 AM IST

Russian missile strike
Zaporizhzhia

ఉక్రెయిన్‌కు చెందిన నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనమైనట్టు పుతిన్‌ ప్రకటించిన తర్వాత కూడా దాడుల తీవ్రత తగ్గలేదు. జపోరిజియాలోని నివాసాలపై మాస్కో విరుచుకుపడింది. రాకెట్లతో భీకర దాడులకు పాల్పడిన ఘటనలో ముగ్గురు మరణించగా, 12 మంది గాయపడ్డారు.

ఉక్రెయిన్‌కు చెందిన నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనమైనట్టు పుతిన్‌ ప్రకటించిన తర్వాత కూడా దాడుల తీవ్రత తగ్గలేదు. ఉక్రెయిన్‌కు గట్టి పట్టున్న జపోరిజియాలోని నివాసాలపై మాస్కో విరుచుకుపడింది. రాకెట్లతో భీకర దాడులకు పాల్పడింది. ఈ ధాటికి ముగ్గురు మరణించగా, 12 మంది గాయపడ్డారు. అక్కడికి సమీపంలోని యూరప్‌లోనే అతి పెద్దదైన అణు కార్మాగారం ఉంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. దొనెట్క్స్‌, ఖేర్సన్‌, నిప్రో ప్రాంతాల్లోనూ మాస్కో బలగాలు దాడులకు పాల్పడ్డాయని.. ఈ ఘటనల్లో పది మంది మృతిచెందినట్టు ఉక్రెయిన్‌ అధ్యక్ష కార్యాలయ డిప్యూటీ చీఫ్‌ కైరి తిమోషెంకో గురువారం వెల్లడించారు.

విలీన ఉత్తర్వులపై పుతిన్‌ సంతకం
ఉక్రెయిన్‌కు చెందిన దొనెట్స్క్‌, లుహాన్స్క్‌, జపోరిజియా, ఖేర్సన్‌లు తమ దేశంలో విలీనం కావడాన్ని రష్యా పార్లమెంటు స్వాగతించింది. దీన్ని ఆమోదిస్తూ పంపిన ఉత్తర్వులపై అధ్యక్షుడు పుతిన్‌ తుది సంతకం చేశారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లోని మరిన్నిచోట్ల రెఫరెండం నిర్వహిస్తారా? అని అడిగిన ప్రశ్నకు.. క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ సమాధానం దాటవేశారు. ఉక్రెయిన్‌ భూభాగాలను రష్యా విలీనం చేసుకోవడంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. యుద్ధంలో ధ్వంసమైన మౌలిక సదుపాయాలను పునరుద్ధరించే నిమిత్తం ఉక్రెయిన్‌కు అమెరికా 55 మిలియన్‌ డాలర్లను అదనంగా అందించనుంది. యుద్ధ ఫలితంగా తమ దేశాల్లో ఎదురవుతున్న ఇంధన సంక్షోభం, ద్రవ్యోల్బణంపై చర్చించేందుకు 'యూరోపియన్‌ పొలిటికల్‌ కమ్యూనిటీ' ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఈ కూటమిలో మొత్తం 44 దేశాలు ఉండగా.. రష్యా, బెలారస్‌లను ఆహ్వానించకపోవడం గమనార్హం.

పుతిన్‌ మనుగడ సాగించలేరు: జెలెన్‌స్కీ
అణ్వస్త్రాలను వినియోగించేందుకు వెనుకాడబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరించడాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కొట్టిపారేశారు. "అణు దాడి జరుగుతుందని చెప్పడం కష్టమే. రష్యాలో అన్నింటిపైనా పుతిన్‌కు సరైన నియంత్రణ లేదు. అణుదాడికి పాల్పడితే ఆయన మనుగడ సాగించలేరు. ప్రపంచ దేశాలు ఏమాత్రం క్షమించవని పుతిన్‌కు బాగా తెలుసు" అని ఆయన పేర్కొన్నారు.

తీవ్రంగా పరిగణిస్తున్నాం: అమెరికా
అంతర్జాతీయ సమాజంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మరింత ఒంటరి అవుతున్నారని అమెరికా వ్యాఖ్యానించింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ప్రధాని మోదీ ఫోన్‌ చేయడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. పుతిన్‌ అణు హెచ్చరికలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, త్వరలోనే అణ్వాయుధాలను ప్రయోగించేందుకు రంగం సిద్ధమవుతోందన్న సూచనలేవీ లేవని పేర్కొంది.

ఇదీ చదవండి: రెచ్చిపోయిన మాఫియా.. నగర మేయర్​ సహా 18 మంది హత్య

కిడ్నాపైన 8 నెలల చిన్నారి దారుణ హత్య.. కుటుంబసభ్యుల్ని కూడా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.