ETV Bharat / international

హ్యాంగర్​పైకి దూసుకెళ్లిన విమానం.. ఐదుగురు మృతి.. 8 మందికి గాయాలు

author img

By

Published : Jul 18, 2023, 8:00 AM IST

Updated : Jul 18, 2023, 10:04 AM IST

Poland plane crash : పోలండ్​లో ఓ విమానం హ్యాంగర్​పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి.

POLAND PLANE CRASH
POLAND PLANE CRASH

Poland plane crash : పోలండ్​లో జరిగిన విమాన ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. 'సెస్నా 208' అనే విమానం స్కైడైవింగ్ సెంటర్​లోని హ్యాంగర్​పైకి దూసుకెళ్లడం వల్ల ప్రమాదం జరిగింది. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

నోవీ డవార్ రాష్ట్రం, గిమినా నాసియెల్​స్క్ జిల్లాలోని క్రిసినో గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ప్లేన్ పైలట్ ప్రాణాలు కోల్పోయాడని అధికారులు తెలిపారు. వాతావరణం సరిగా లేదని హ్యాంగర్​లో తలదాచుకున్న నలుగురు సైతం ఈ ప్రమాదంలో చనిపోయారని చెప్పారు. ఘటనలో ఎనిమిది మందికి గాయాలు కాగా, అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వివరించారు. గాయపడిన వారిలో ఓ చిన్నారి సైతం ఉందని గవర్నర్ సిల్వెస్టర్ డాబ్రోవ్స్కీ తెలిపారు.

POLAND PLANE CRASH
హ్యాంగర్​లోకి దూసుకెళ్లిన విమానం

ప్రమాదం జరిగిన ప్రాంతమైన క్రిసినో పోలండ్ రాజధాని వార్సాకు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఘటన గురించి సమాచారం అందగానే వెంటనే అంబులెన్సులు, అగ్నిమాపక యంత్రాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించాయి. ఇంకెవరైనా బాధితులు ఉన్నారేమోనన్న అనుమానంతో హ్యాంగర్​ను పూర్తిగా తనిఖీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంతవరకు తెలియలేదు. అధికారులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు.
2014లోనూ పోలండ్​లో స్కైడైవింగ్​ ప్లేన్ ఒకటి ప్రమాదానికి గురైంది. టోప్లోలో జరిగిన ఆ నాటి ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన ఘోర దుర్ఘటన ఇదేనని అధికారులు వెల్లడించారు.

నేపాల్ ప్రమాదంలో 70 మంది మృతి
కాగా ఈ ఏడాది ప్రారంభంలో నేపాల్​లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్​వేపై ల్యాండ్ అవుతుండగా యతి ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం అదుపుతప్పి నదిలోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంజిన్ వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తేలింది. పాత విమానాశ్రయానికి.. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి మధ్య ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 72 ప్రయాణికుల్లో 15 మంది విదేశీయులు ఉన్నారు. అందులో ఐదుగురు భారతీయులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన చిత్రాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి. ఈ ఘటన లైవ్ వీడియో కోసం ఈ లింక్​ను క్లిక్ చేయండి.

Last Updated : Jul 18, 2023, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.