ETV Bharat / international

ఇమ్రాన్ ఖాన్ 'యార్కర్'.. పార్లమెంట్​ రద్దు.. సుప్రీం కోర్టుకు బంతి!

author img

By

Published : Apr 3, 2022, 1:14 PM IST

Updated : Apr 3, 2022, 7:21 PM IST

IMRAN KHAN
IMRAN KHAN

13:11 April 03

ఇమ్రాన్ ఖాన్ 'యార్కర్'.. పార్లమెంట్​ను రద్దు చేసిన పాక్ అధినేత

Imran Khan dissolve assemblies: చివరి బంతి వరకు పోరాడతానన్న పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్.. సిసలైన 'మ్యాచ్​'లో విపక్షాలకు షాకిచ్చారు. అవిశ్వాస తీర్మానం పార్లమెంట్​లో తిరస్కరణకు గురికాగా.. అనంతరం ప్రసంగించిన ఇమ్రాన్.. సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సిఫార్సు చేస్తూ దేశ అధ్యక్షుడికి లేఖ రాసినట్లు చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని అన్నారు. ప్రజలంతా ఎన్నికలకు సిద్ధమవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని ఇమ్రాన్ సిఫార్సు మేరకు.. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో.. 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ మంత్రి హబీబ్ ప్రకటించారు.

అంతకుముందు, పాకిస్థాన్ పార్లమెంట్​లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇమ్రాన్ ఖాన్​కు వ్యతిరేకంగా పార్లమెంట్​లో విపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 342 మంది సభ్యుల అసెంబ్లీలో తీర్మానం నెగ్గాలంటే 172 మంది ఓట్లు అవసరం. కాగా, తమకు 177 మంది సభ్యుల బలం ఉందని విపక్షాలు ప్రకటించుకున్నాయి. వంద మందికి పైగా విపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానానిపై సంతకం చేశారు. అయితే, పాకిస్థాన్ పార్లమెంట్(నేషనల్ అసెంబ్లీ) డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూర్ విపక్షాల తీర్మానాన్ని తిరస్కరించారు. తీర్మానం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. సభను వాయిదా వేశారు.

అనంతరం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు ఇమ్రాన్ ఖాన్. తనపై కుట్ర జరిగిందని ఆరోపించారు. 'నాకు వ్యతిరేకంగా చట్టసభ సభ్యులను కొనేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. పాకిస్థాన్ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారు. అవిశ్వాస తీర్మానం పాకిస్థాన్‌పై జరిగిన విదేశీ కుట్ర. పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ(ఆ దేశ పార్లమెంట్)ని రద్దు చేయాలని అధ్యక్షుడికి లేఖ రాశా. తమను ఎవరు పరిపాలించాలో పాకిస్థాన్‌ ప్రజలు నిర్ణయించుకోవాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి' అని ఇమ్రాన్ పేర్కొన్నారు. మరోవైపు, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్​కు అనుమతించకుండా ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ ఆరోపించారు. విపక్ష పార్టీలు పార్లమెంట్​ను వీడేది లేదని అన్నారు. ఈ విషయంపై సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయనున్నట్లు చెప్పారు. తమ న్యాయవాదులు అత్యున్నత ధర్మాసనానికి వెళ్తున్నారని తెలిపారు.

ఎలాంటి సంబంధం లేదు: దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది ఆ దేశ సైన్యం. పార్లమెంట్​లో అవిశ్వాస తీర్మానం తిరస్కరణ, జాతీయ అసెంబ్లీ రద్దు చేసిన క్రమంలో ఈ మేరకు ఓ టీవీ ఛానల్​లో మాట్లాడారు ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్​ జనరల్​ బాబర్​ ఇఫ్తిఖార్​.

సుప్రీం కోర్టులో విచారణ వాయిదా: జాతీయ అసెంబ్లీ రద్దుతో పాకిస్థాన్​ రాజకీయ సంక్షోభం ముగిసినట్లు భావించినా, ఈ కేసును పాకిస్థాన్​ సుప్రీం కోర్టు అత్యవసర విచారణకు స్వీకరించడం వల్ల పరిణామాలు కొత్త మలుపు తీసుకున్నాయి. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. పిటిషన్​పై ఆదివారమే విచారణ చేపట్టగా తుది నిర్ణయం వెలువడుతుందని అంతా ఎదురుచూశారు. కానీ ఎలాంటి తీర్పు చెప్పకుండానే విచారణను ఏప్రిల్​ 4కు వాయిదా వేసింది కోర్టు. దీంతో సోమవారం ఏం జరుగుతుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది. మరోవైపు.. రాజకీయ సంక్షోభంపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉమర్‌ అతా బందియాల్‌ నేతృత్వంలో అయిదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది సుప్రీం కోర్టు.

కొత్త ప్రధానిగా షాహబాజ్​ షరీఫ్​: ఇమ్రాన్‌ వ్యవహరించిన తీరుపై గుర్రుగా ఉన్న విపక్షాలు కూడా వేగంగా పావులు కదుపుతున్నాయి. తాము మాత్రమే ఉన్న జాతీయ అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాలు కొత్త ప్రధానిగా షాహబాజ్‌ షరీఫ్‌ను ఎన్నుకున్నాయి. అంతకు ముందు ఆయాజ్‌ సిద్దిఖీని జాతీయ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నుకోగా, డిప్యూటీ స్పీకర్‌ ఖాసిమ్‌సూరీ దీన్ని తిరస్కరించారు. ప్రభుత్వ రద్దుపై అన్ని వ్యవస్ధలను ఆశ్రయిస్తామని విపక్షాలు తెలిపాయి.

ఆ జాబితాలోకి ఇమ్రాన్​: పాకిస్థాన్‌ రాజకీయ చరిత్రలో ఏ ప్రధాని కూడా అయిదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోలేదు. ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ 2018 ఆగస్టులో పదవీ బాధ్యతలు చేపట్టగా, జాతీయ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఇమ్రాన్‌ కూడా అదే జాబితాలో చేరనున్నారు. అయితే.. సుప్రీంకోర్టు ఏదైనా సంచలన తీర్పు ఇస్తే.. ఈ పరిణామాలు ఎలా మారతాయన్నది ఆసక్తికరం.

ఇదీ చదవండి: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. అసలేమైంది?.. ఎవరు బాధ్యులు?

Last Updated : Apr 3, 2022, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.