ETV Bharat / international

బైడెన్‌కు కీలకంగా మధ్యంతర ఎన్నికలు.. అమెరికా ఏం తేల్చేను?

author img

By

Published : Nov 6, 2022, 7:05 AM IST

Internal Election War in America
బైడెన్‌కు కీలకంగా మధ్యంతర ఎన్నికలు

అగ్రరాజ్యం అమెరికా ప్రస్తుతం అంతర్గత ఎన్నికలతో యుద్ధం చేస్తోంది. ప్రపంచమంతా రష్యా-ఉక్రెయిన్​ యుద్ధం కారణంగా ఆర్థిక మాధ్యంలో ఉంటే.. అమెరికాలో మాత్రం దానికి విరుద్దమైన వాతావరణం కనిపిస్తోంది. మరో మూడు రోజుల్లో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు అధ్యక్షుడు జో బైడెన్‌ పనితీరును ప్రభావితం చేస్తాయి.

రష్యా-ఉక్రెయిన్‌లు యుద్ధంలో మునిగి తేలుతుంటే.. ఆ ప్రభావంతో ప్రపంచమంతా మాంద్యంతో పోరాడుతుంటే.. అమెరికా అంతర్గతంగా ఎన్నికల యుద్ధం చేస్తోంది. మరో మూడురోజుల్లో (8న) అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి. అమెరికా పార్లమెంటులోని ప్రతినిధుల సభలో అన్ని స్థానాలకు, సెనెట్‌లో 35 స్థానాలకు, అన్ని రాష్ట్రాల గవర్నర్‌ పదవులకు జరిగేవే ఈ ఎన్నికలు!

రాబోయే రోజుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పనితీరును ప్రభావితం చేసే ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవి. బైడెన్‌ సజావుగా పనిచేయాలంటే ఈ ఎన్నికల్లో డెమొక్రాట్లు విజయం సాధించాలి. రిపబ్లికన్‌లు ఆధిక్యం సంపాదిస్తే బైడెన్‌ నిర్ణయాలకు గండి పడ్డట్లే! మరి అమెరికా ఎలాంటి తీర్పునివ్వబోతోందని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

435 సీట్లున్న ప్రతినిధుల సభకు ప్రతి రెండేళ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్ష ఎన్నిక జరిగిన రెండేళ్లకు నిర్వహిస్తారు కాబట్టి వీటిని మధ్యంతరంగా పిలుస్తారు. వీటితో పాటు 100 మంది ఉండే సెనెట్‌లోని 35 సీట్లకూ వీటితో పాటే ఎన్నికలు జరుగుతాయి. సెనెట్‌లో ప్రతి రాష్ట్రానికి 2 సీట్లుంటాయి. ప్రతినిధుల సభలో మాత్రం.. రాష్ట్రాల ప్రాతినిధ్యం వారి జనాభాపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ జనాభాగల రాష్ట్రాలు ఎక్కువ మందిని ప్రతినిధుల సభకు పంపిస్తాయి.

ప్రభావితం చేసే అంశాలు..
రెండేళ్ల కిందట హోరాహోరీగా సాగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ప్రధానాంశంగా నిలిచింది. సంకుచిత భావాలున్న డొనాల్డ్‌ ట్రంప్‌తో నష్టమంటూ డెమొక్రాట్లు ప్రచారం చేశారు. మొత్తానికి బైడెన్‌ విజయం సాధించారు. ఈసారి కూడా డెమొక్రాట్లు ప్రజాస్వామ్య నినాదంతో ముందుకెళ్లాలని చూస్తున్నారు. ట్రంప్‌ పార్టీ నుంచి ముప్పుందని ప్రజల్ని ఒప్పించటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆర్థికాంశాలకు ప్రజలు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని సర్వేల్లో వెల్లడవుతోంది.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపైనా, ప్రజలపైనా భారీగానే పడింది. 2021 ఆగస్టుతో పోలిస్తే 2022 ఆగస్టు నాటికి అమెరికాలో ధరలు 11 శాతంపైగా పెరిగాయి. కంపెనీలన్నీ ఉద్యోగ నియామకాలను తాత్కాలికంగా ఆపేశాయి. నిత్యావసరాలు నింగికెగిశాయి. అమెరికాలో ప్రతి ఒక్కరిపైనా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే.. పీఈడబ్ల్యూ నిర్వహించిన సర్వేలో 79శాతం మంది ఈసారి ఎన్నికల్లో ఆర్థికాంశాలే ప్రభావితం చూపిస్తాయని భావించటం గమనార్హం. అదే జరిగితే బైడెన్‌ సారథ్యంలోని డెమొక్రాట్లకు ఎదురు దెబ్బ తగులుతుందని అంచనా. ప్రతినిధుల సభ, సెనెట్‌లో రిపబ్లికన్లకు ఆధిక్యం లభిస్తే... బైడెన్‌ చేసే చట్టాలు, తీసుకునే నిర్ణయాలు ముందుకుసాగటం కష్టమవుతుంది. అధ్యక్షుడి అనేక నిర్ణయాలకు సెనెట్‌ ఆమోదముద్ర తప్పనిసరి.

బరిలో ఐదుగురు భారతీయ సంతతి ప్రముఖులు
ఐదుగురు భారతీయ సంతతి ప్రముఖులు ప్రతినిధుల సభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుత సభ్యులైన అమిబెరా, రాజా కృష్ణమూర్తి, రోఖన్నా, ప్రమీలా జయపాల్‌లు డెమొక్రాటిక్‌ పార్టీ తరఫున తిరిగి ఎన్నికయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. మిషిగాన్‌ నుంచి వ్యాపారవేత్త తానేదార్‌ రిపబ్లికన్‌ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. మేరీలాండ్‌ రాష్ట్రంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి అరుణ మిల్లర్‌ డెమొక్రాటిక్‌ అభ్యర్థిగా ఉన్నారు.

అమెరికాలో ప్రస్తుత బలాబలాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.