ETV Bharat / international

'IT రంగంలో భారత్​తో చైనా ఎప్పటికీ పోటీ పడలేదు!'

author img

By

Published : Dec 11, 2022, 9:18 PM IST

భారత ఐటీ రంగంతో చైనా పోటీ పడలేదని ఆ దేశ నిపుణులే స్పష్టం చేస్తున్నారు. ఐటీలో గ్లోబల్‌ లీడర్‌గా ఎదిగిన భారత్‌కు ఇప్పటికిప్పుడే డ్రాగన్‌ పోటీనిచ్చే అవకాశం లేదని ద రైజ్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఐటీ పుస్తక రచయిత మైక్‌ లియూ అన్నారు. అందరూ అనుకున్నట్లు ప్రభుత్వ విధానాలో.. లేక ఆంగ్ల భాషా పరిజ్ఞానమో భారత ఐటీ వృద్ధికి దోహదం చేయలేదన్నారు. చైనా కూడా భారత ఐటీ సంస్థల నుంచి అనేక విషయాలు నేర్చుకోవాలని సూచించారు.

india china
india china

చైనా అన్ని రంగాల్లో మనకన్నా ముందుకు దూసుకెళ్లినప్పటికీ.. ఇప్పటికీ కొన్నింటిలో భారత్‌దే పైచేయి. ముఖ్యంగా చైనాతో పోలిస్తే... ఐటీ, ఫార్మా రంగాల్లో భారత్‌ అగ్రగామిగా నిలిచింది. అది స్వయానే చైనీయులే అంగీకరించినట్లు ఆ దేశ.. ఐటీ రంగ విశ్లేషకులు మైక్‌లియూ తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులలో గ్లోబల్‌ లీడర్‌గా ఎదిగిన భారత్‌కు పోటీగా నిలిచేందుకు తమ టెక్‌ సంస్థలు చాలా కష్టపడాల్సి ఉందని అన్నారు. తమ ఐటీ ఉత్పత్తులు ఇప్పటికే వృద్ధిని సాధించాయనీ..అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో లీడర్‌గా ఉన్న భారత్‌తో పోలిస్తే చాలా వెనకంజలో ఉన్నామన్నారు.

'ద రైజ్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఐటీ' అనే పుస్తకంలో దశాబ్దాలుగా ఇండియా, చైనాల ఐటీరంగంలోని మార్పులు, వృద్ధి అంశాలను లియూ అనే చైనా ఐటీ నిపుణుడు ప్రస్తావించారు. భారత ఐటీ.. గ్లోబల్‌ మార్కెట్‌ల నుంచి గణనీయంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంటే చైనా ఐటీ రంగ వాటాలో 95 శాతం స్వదేశీ మార్కెట్‌దేనన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై మధ్య చైనా ఐటీ రంగం..797 బిలియన్‌ డాలర్లు అర్జించింది. గతేడాదితో పోలిస్తే 10శాతం వృద్ధి కనబరచినట్లు చైనా ఐటీ మంత్రిత్వశాఖ ప్రకటించింది.

భారత్‌-చైనాల జీడీపీలో 8శాతం సమాచార సాంకేతిక రంగాలదేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నా.. డ్రాగన్‌ ఆర్థిక వ్యవస్థపరిమాణానికి అది చిన్నమొత్తమే అవుతుందని మైక్‌ లియూ వెల్లడించారు. భారత ఐటీరంగ విస్తరణకు భారతీయుల ఆంగ్ల భాషాప్రావీణ్యం, ప్రభుత్వ రాయితీలు, విధానాలు కారణమని భావించడం తప్పు అని తెలిపారు. భారత యువత వైవిధ్యమైన లక్ష్యాలు ఎంచుకుని అద్భుతాలు చేస్తారని అన్నారు.చైనా సంస్థలు కూడా అలాంటి ఆలోచన, పట్టుదలతో ముందుకు వెళ్లాలన్నారు.

ఆంగ్లేతర చైనా, జర్మనీ వంటి దేశాల మార్కెట్‌పైన దృష్టి సారిస్తే భారత్‌ మరింత ముందుకు దూసుకెళ్తుందని తెలిపిన లియూ.. భారత ఐటీ వ్యయ చేతన వ్యూహాన్ని మార్చుకోవాలన్నారు. ఎక్కువ భారత ఐటీ సంస్థలు ఖర్చుకు వెనుకడుగు వేస్తాయనీ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌కు తక్కువ వెచ్చిస్తాయన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.