ETV Bharat / international

బ్రిటన్​ ప్రధాని భార్య అక్షతామూర్తికి 126 కోట్ల ఆదాయం.. ఈసారి పన్నులు చెల్లిస్తారా?

author img

By

Published : Oct 25, 2022, 9:34 PM IST

British Prime Minister Rishi Sunak's wife
రిషి సునాక్​ ఆతని భార్య

గతంలో తనపై వచ్చిన విమర్శలకు సమాధానం ఇచ్చారు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్ సతీమణి అక్షతామూర్తి. ఇకపై ప్రపంచ వ్యాప్తంగా తాను సంపాదించే సంపాదనపై యూకేలో కూడా పన్ను చెల్లిస్తానని ప్రకటించారు. తాజాగా ఆమెకు రూ.126 కోట్ల ఆదాయం రావడం వల్ల ఆమె ఇప్పుడు బ్రిటన్‌లో పన్ను చెల్లించారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు.

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్ సతీమణి అక్షతామూర్తి సంపాదనపై గతంలో ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. అక్షతామూర్తి బ్రిటన్‌కు వెలుపల సంపాదించిన సొమ్ముపై పన్నులు చెల్లించట్లేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే స్పందించిన అక్షతామూర్తి ఇకపై ప్రపంచ వ్యాప్తంగా ఆర్జించే ధనంపై కూడా యూకేలో పన్ను చెల్లిస్తానని ప్రకటించారు. ఐతే 2022లో ఇన్ఫోసిస్‌ ద్వారా ఆమెకు 126 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. దీనిపై ఆమె బ్రిటన్‌లో పన్ను చెల్లించారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు.

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ భార్య అక్షతా మూర్తికి భారత్‌లో పౌరసత్వం ఉండటం వల్ల కేవలం యూకేలో సంపాదించిన ఆదాయంపై మాత్రమే అక్కడ ఇన్నాళ్లుగా పన్ను చెల్లిస్తూ వచ్చారు. అంతే కాదు తన నాన్‌-డొమిసిల్ హోదాను మరో ఏడాది పాటు పొడిగించుకున్నారు. అందుకు 30 వేల పౌండ్లు చెల్లించారు. ఈ హోదా ఉన్నవారు విదేశాల్లో సంపాదించిన ఆదాయంపై బ్రిటన్‌లో పన్ను చెల్లించనవసరం లేదు. కేవలం బ్రిటన్‌లో సంపాదించిన ఆదాయానికే వారు పన్నుకట్టాలి. ఐతే యూకేలో పన్నులు ఎగ్గొట్టేందుకు ఈ హోదాను ఆమె వాడుకుంటున్నారని సునాక్ ప్రత్యర్థులు ఆరోపించారు. రిషి సునాక్‌ ప్రధాని రేసులో నిలిచిన సమయంలో విదేశాల్లో తనకు వచ్చే ఆదాయంపైనా బ్రిటన్లో పన్నులు చెల్లించనున్నట్లు అక్షతామూర్తి ఇదివరకే వెల్లడించారు.

తాజాగా ఈ ఏడాది భారత్‌లోని రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ నుంచి 126 కోట్ల 61 లక్షల రూపాయలు డివిడెండ్ల రూపంలో ఆమెకు వచ్చింది. ఈ సంస్థలో ఆమెకు 3.89 కోట్ల షేర్లు ఉన్నాయి. అది ఇన్ఫోసిస్‌లోని మొత్తం షేర్లలో 0.93 శాతం. బీఎస్ఈలో మంగళవారం ఇన్ఫోసిస్‌ షేర్‌ ధర రూ.1,527 కాగా ఆమె కలిగి ఉన్న షేర్ల విలువ 5 వేల 956 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు 16 రూపాయల డివిడెండ్‌ను చెల్లించింది. ప్రస్తుత సంవత్సరానికి ఈ నెలలో మధ్యంతర డివిడెండ్‌ విలువ 16.5 రూపాయలు చేసింది. రెండు డివిడెండ్‌ల మొత్తం విలువ 32.5 రూపాయలకు చేరింది. దీంతో అక్షతా మూర్తికి తన వాటా డివిడెండ్ల ద్వారా ఇన్ఫోసిస్ నుంచి 126 కోట్ల 61 లక్షలు వచ్చాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తన ఇన్ఫోసిస్‌ షేర్ల ద్వారా అక్షతా మూర్తి 119 కోట్ల 5 లక్షల రూపాయలు ఆర్జించారు.

ఇన్ఫోసిస్ ఫైలింగ్స్ ప్రకారం కంపెనీలో ప్రమోటర్లకు 13.11 శాతం వాటా ఉంది. ఇందులో నారాయణ మూర్తి కుటుంబం 3.6 శాతం కలిగి ఉన్నారు. నారాయణ మూర్తి 0.40 శాతం, ఆయన భార్య సుధ 0.85 శాతం, వారి కుమారుడు రోహన్‌ 1.45 శాతం , కుమార్తె అక్షతా 0.93 శాతం వాటా కలిగి ఉన్నారు. అయితే ఏప్రిల్‌లో అక్షతామూర్తి ఆదాయంపై వివాదం తలెత్తిన సమయంలో ప్రపంచ వ్యాప్తంగా సంపాదించిన సొమ్ముపై కూడా బ్రిటన్‌లో పన్ను చెల్లిస్తానని ఆమె ప్రకటించినప్పటికీ.. ఏప్రిల్‌ తరువాత ఆమె ఎంత మేర పన్ను చెల్లించారన్న విషయంపై స్పష్టత లేదు. రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా కావడంతో మరోసారి ఆయన ప్రత్యర్థులు అక్షతామూర్తి ఆదాయంపై విమర్శలు లేవనెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.