ETV Bharat / international

'కలిసికట్టుగా పనిచేస్తేనే.. కొవిడ్-19​కు ముగింపు'

author img

By

Published : Jan 1, 2022, 1:07 PM IST

Tedros Adhanom on Covid: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న దేశాల మధ్య నెలకొన్న అసమానతలు అంతమైతేనే.. కరోనా మహమ్మారికి ముగింపు లభిస్తుందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్​ అధనోమ్​. దేశాలన్ని కలిసికట్టుగా పనిచేస్తే.. 2022లోనే కొవిడ్​ ముగుస్తుందనే నమ్మకం ఉన్నట్లు చెప్పారు.

WHO chief Tedros Adhanom
ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్​ అధనోమ్

Tedros Adhanom on Covid: కొవిడ్​-19 మహమ్మారి వెలుగులోకి వచ్చి మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్న క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్​ జనరల్​ టెడ్రోస్​ అధనోమ్​ గెబ్రెయసెస్​. దేశాల మధ్య అసమానతలను తొలగించి.. కలిసికట్టుగా పనిచేస్తే.. 2022లోనే ఈ మహమ్మారి అంతమవుతుందన్నారు.

"మహమ్మారి నుంచి ఏ దేశమూ బయటపడలేదు. అయితే, కట్టడి చేసేందుకు, చికిత్స అందించేందుకు చాలా కొత్త సాధనాలు ఉన్నాయి. సుదీర్ఘ కాలం పాటు దేశాల మధ్య అసమానతలు కొనసాగితే.. మనం నియంత్రించలేనంతగా, కనీసం అంచనా వేయలేనంతగా.. వైరస్​ ప్రమాదకరంగా మారుతుంది. అసమానతలకు ముగింపు పలికితేనే.. ఈ మహమ్మారిని అంతం చేయగలుగుతాం. కొవిడ్​-19 మహమ్మారి వచ్చి మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్న క్రమంలో.. ఈ సంవత్సరంలోనే దానికి ముగింపు ఉంటుందనే నమ్మకం ఉంది. కానీ, మనం కలిసికట్టుగా పోరాడితేనే అది సాధ్యమవుతుంది."

- టెడ్రోస్​ అధనోమ్​, డబ్ల్యూహెచ్​ఓ అధినేత.

వచ్చే ఏడాది ప్రపంచం ఎదుర్కోబోయేది కొవిడ్​-19 ఆరోగ్య ముప్పు ఒక్కటే కాదన్నారు టెడ్రోస్​. లక్షలాది మంది ప్రజలు సాధారణ వ్యాక్సినేషన్​, కుటుంబ నియంత్రణ సేవలు, పలు అంటువ్యాధులు, ఇతర వ్యాధులకు చికిత్సలకు దూరమయ్యారని గుర్తు చేశారు. ప్రపంచంలోనే తొలి మలేరియా వ్యాక్సిన్​ను పెద్దఎత్తున అందించాలని కోరారు. అత్యవసరంగా, పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్​ చేపడితే.. ప్రతి ఏటా వేలాది మంది ప్రాణాలు కాపాడగలుగుతామని సూచించారు.

" పోలియో నిర్మూలనలో ఇంకా పూర్తిస్థాయిలో విజయం సాధించలేదు. రెండు దేశాల్లో ఐదు కేసులు నమోదయ్యాయి. మా భాగస్వామ్య సంస్థలు ఎబోలా, మార్బుర్గ్​ వంటి ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే సవాళ్లపై స్పందిస్తున్నాయి. భవిష్యత్తులో ఎదురయ్యే అంటువ్యాధులు, మహమ్మారులను కట్టడి చేసేందుకు కొత్త బయోహబ్​ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. బెర్లిన్​లో పాండమిక్​, ఎండమిక్​ ఇంటెలిజెన్స్​ హబ్​ను ప్రారంభించాం. ప్రజారోగ్యంపై కొత్త ఆవిష్కరణల కోసం ఇది ఉపయోగపడుతుంది. "

- టెడ్రోస్​ అధనోమ్​, డబ్ల్యూహెచ్​ఓ అధినేత

2022 మధ్య నాటికి ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సిన్​ అందించే లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు టెడ్రోస్​.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.