ETV Bharat / international

పుతిన్​తో ఇజ్రాయెల్ ప్రధాని భేటీ- ముందుగానే అమెరికాకు సమాచారం

author img

By

Published : Mar 5, 2022, 6:42 AM IST

Updated : Mar 6, 2022, 12:03 AM IST

Russia Ukraine War
ఉక్రెయిన్​- రష్యా యుద్ధం

23:59 March 05

పుతిన్​తో ఇజ్రాయెల్ ప్రధాని సమావేశం

రష్యా అధ్యక్షుడు పుతిన్​తో ఇజ్రాయెల్​ ప్రధాని నఫ్తాలి బెన్నెట్​.. మాస్కోలో సమావేశమయ్యారు. ఉక్రెయిన్​లో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించినట్లు క్రెమ్లిన్​ వర్గాలు తెలిపాయి. దాదాపు వీరి సమావేశం రెండున్నర గంటలపాటు సాగింది. అయితే ఈ భేటీకి సంబంధించి ఇజ్రాయెల్​ ముందస్తుగానే అమెరికాకు సమాచారం ఇచ్చింది. ఈ చర్చలకు బైడెన్​ మద్దతిచ్చినట్లు ఇజ్రాయెల్​ అధికార వర్గాలు తెలిపాయి. పుతిన్​తో సమావేశం సందర్భంగా బెన్నెట్​తో ఇజ్రాయెల్​ మంత్రి జీవ్ఎల్కిన్ ఉన్నారు. ఈయన ఉక్రెయిన్​లో మూలాలు కలిగిన వ్యక్తి.

అమెరికా సన్నిహిత దేశమైన ఇజ్రాయెల్​ ఉక్రెయిన్​పై రష్యా చర్యలను ఖండించింది. ఆ దేశానికి సంఘీభావం ప్రకటించింది. మానవతా దృక్పథంతో సాయాన్ని పంపింది. మరోవైపు ఈ సంక్షోభాన్ని తగ్గించేందుకు మాస్కోతో నిరంతరం సంబంధాలను కొనసాగిస్తామని ఇజ్రాయెల్​ తెలిపింది.

మరోవైపు ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి చర్చలు ఈ నెల 7న (సోమవారం) మూడో విడత శాంతి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.

22:47 March 05

ఉక్రెయిన్‌లోని మరియుపోల్‌లో మళ్లీ కాల్పులు

ఉక్రెయిన్‌లోని మరియుపోల్‌లో మళ్లీ కాల్పులు మొదలయ్యాయి. కొన్ని గంటల విరామం తర్వాత మళ్లీ రష్యా బలగాల కాల్పులను మొదలు పెట్టాయి. పౌరుల తరలింపు కోసం కొన్నిగంటలపాటు యుద్ధానికి రష్యా విరామం ఇచ్చింది. తాజాగా కాల్పులతో జైటోమిర్‌ ప్రాంతంలో 4 యుద్ధ విమానాలు కూలాయి. ఉక్రెయిన్‌కు చెందిన ఎస్‌యూ-27 జెట్‌లను రష్యా సేనలు కూల్చేసినట్లు సమాచారం.

20:54 March 05

ఉక్రెయిన్‌ పరిణామాలపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. భారతీయుల తరలింపుపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

18:14 March 05

ఉక్రెయిన్‌లో కిరాయి సైన్యాలను దించుతున్నాయి: రష్యా

పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌లోకి కిరాయి సైనికులను పంపడం పెరిగిందని రష్యా ఆరోపించింది. డెన్మార్క్, లాత్వియా, పోలాండ్, క్రొయేషియా దేశాలు తమ పౌరులను ఉక్రెయిన్ భూభాగంలో పోరాడేందుకు అధికారికంగా అనుమతించినట్లు తెలిపింది. ‘ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకారం.. ఉక్రెయిన్‌లో సుమారు 16 వేల మంది విదేశీ సైనికులు ఉన్నారు. క్రొయేషియా నుంచి దాదాపు 200 మంది కిరాయి సైనికులు ఇప్పటికే పోలండ్ గుండా ఉక్రెయిన్‌లోని ప్రవేశించారు. వివిధ ఆయుధాలతో వారంతా రష్యా బలగాలను రెచ్చగొట్టడంతోపాటు విధ్వంసం, దాడులకు పాల్పడుతున్నారు. గాయపడిన సైనికుల తరలింపు, యుద్ధ సామగ్రి సరఫరాకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు’ అని వరుస ట్వీట్‌లలో రష్యా ఆరోపించింది.

17:13 March 05

ఇప్పటివరకు 10 వేల మంది రష్యా సైనికులు మృతి!

రష్యా బలగాల్లో ఇప్పటివరకు పది వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ పేర్కొంది. రష్యాకు చెందిన 269 ట్యాంకులు, 945 సాయుధ పోరాట వాహనాలు, 105 ఆర్టిలరీ వ్యవస్థలు, 50 మల్టీపుల్‌ లాంచ్‌ రాకెట్‌ సిస్టమ్‌లు, 39 యుద్ధ విమానాలు, 40 హెలికాప్టర్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 409 మోటారు వాహనాలు, రెండు తేలికపాటి స్పీడ్ బోట్లు, మూడు యూఏవీలను నాశనం చేసినట్లు చెప్పింది.

14:27 March 05

రష్యాపై పోరాడేందుకు స్వదేశానికి 66వేల మంది ఉక్రెయిన్​ పౌరులు

రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో తమ దేశ సైన్యానికి అండగా నిలుస్తున్నారు ఉక్రెయిన్​ పౌరులు. ఇప్పుడు విదేశాల్లోని వారు సైతం స్వదేశానికి చేరుకుంటున్నారు. రష్యాపై పోరాడేందుకు సుమారు 66,224 మంది విదేశాల్లోని ఉక్రెయిన్​ పౌరులు మాతృ దేశానికి తిరిగివచ్చినట్లు ఆ దేశ రక్షణ మంత్రి ఒలెక్సి రెజ్నికోవ్​ తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

14:06 March 05

కదం తొక్కిన ఉక్రెయిన్‌ సైబర్‌ దండు

తమపై భీకర దాడులకు దిగుతున్న రష్యా సైనికులను నిలువరించేందుకు ఉక్రెయిన్‌ అన్ని మార్గాలను వాడుకుంటోంది. విద్యార్థులు, న్యాయవాదులు, నటులు సైతం ఆయుధాలను చేతబట్టి సైనికులకు సహకరిస్తున్నారు. స్వచ్ఛందంగా ముందుకువస్తున్న ఐటీ నిపుణులు సైతం 'డిజిటల్‌ ఆర్మీ'గా ఏర్పడి తమ వంతు కృషి చేస్తున్నారు.

ఫిబ్రవరి 26న ఉక్రెయిన్‌ ఉపప్రధాని, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌శాఖ మంత్రి మైఖైలో ఫెదొరోవ్‌ స్వచ్ఛంద సైబర్‌ ఆర్మీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. డిజిటల్‌ రంగంలో అనేక మంది ఉక్రెనియన్లు ఉన్నారని.. వారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సైబర్‌ వేదికపై దేశం తరఫున పోరాడాలని పిలుపునిచ్చారు. దీంతో లక్షలాది మంది ముందుకు వచ్చి తమవంతు సాయం చేస్తున్నారు.

రష్యాలో సేవలు నిలిపేసిన 'పేపాల్‌'

ఉక్రెయిన్‌పై దాడులను నిరసిస్తూ.. డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేపాల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రష్యాలో తమ సేవలను నిలిపేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఉక్రెయిన్‌లో రష్యా హింసాత్మక సైనిక దురాక్రమణను ఖండించడంలో అంతర్జాతీయ సమాజానికి తమ సంస్థ మద్దతుగా నిలుస్తున్నట్లు పేపాల్‌ ప్రతినిధి డాన్‌ షూల్‌మన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

13:43 March 05

నాటో కూటమిపై మండిపడ్డ జెలెన్‌స్కీ..

ఉక్రెయిన్‌ గగనతలాన్ని 'నో-ప్లై జోన్‌'గా ఏర్పాటు చేయాలన్న తన అభ్యర్థనను తిరస్కరించినందుకు నాటో కూటమిపై ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ మండిపడ్డారు. తమ దేశంపై రష్యా బాంబుల వర్షం కురిపించేందుకు నాటో నిర్ణయం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని విమర్శించారు. ‘ప్రస్తుతం నాటో సమావేశం జరిగింది. అదొక బలహీన, గందరగోళ సమావేశం. ఆ సమావేశంలో ఒక విషయం స్పష్టమైంది. ఐరోపా స్వాతంత్య్రం కోసం జరిగే పోరాటాన్ని అందరూ మొదటి లక్ష్యంగా భావించరు. నాటో కూటమి ‘నో-ప్లై జోన్‌’ ఏర్పాటుకు నిరాకరించి, ఉక్రెయిన్ నగరాలు, గ్రామాలపై రష్యా ఇంకా తీవ్రస్థాయిలో బాంబుల వర్షం కురిపించేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది’ అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఉక్రెయిన్‌లోని అణు కేంద్రాల భద్రత కోసం తగు చర్యలు: ఫ్రాన్స్

ఉక్రెయిన్‌లోని అయిదు ప్రధాన అణు కేంద్రాల భద్రత కోసం ఫ్రాన్స్ త్వరలో తన సిఫార్సులను ప్రతిపాదించనున్నట్లు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ కార్యాలయం తెలిపింది. అంతర్జాతీయ అణు విద్యుత్తు సంస్థ(ఐఏఈఏ) ప్రమాణాల ఆధారంగా ఈ భద్రతా చర్యలు రూపొందిస్తామని శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. శుక్రవారం ఉక్రెయిన్‌లోని జపోరిజియా అణు విద్యుత్‌ ప్లాంట్‌పై రష్యా దాడులు.. ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలకు కారణమైన విషయం తెలిసిందే.

12:18 March 05

ఉక్రెయిన్​పై రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ.. అందుకే?

ఉక్రెయిన్​పై గత పది రోజుల నుంచి భీకర దాడులకు పాల్పడుతున్న రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది. మానవతా సాయం కింద పౌరులను తరలించేందుకు అవకాశం కల్పించింది. శనివారం సాయంత్రం నుంచి కాల్పుల విరమణ కొనసాగుతుందని రష్యన్​ మీడియా సంస్థ స్పుత్నిక్​ వెల్లడించింది.

11:29 March 05

'ఉక్రెయిన్​లోని భారతీయ విద్యార్థులను తరలించేందుకు సిద్ధం'

ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులతో సహా విదేశీ పౌరులను తరలించేందుకు తమ దేశ బస్సులు సిద్ధంగా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి తెలిపింది రష్యా. ఉక్రెయిన్​లోని ఖార్కివ్​, సుమీ నగరాలకు వెళ్లేందుకు బస్సులు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది.

ఉక్రెయిన్​లోని జపోరిజ్జియా అణు విద్యుత్తు కేంద్రంపై రష్యా దాడుల నేపథ్యంలో శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించింది ఐరాస భద్రతా మండలి. ఈ సందర్భంగా ఉక్రెయిన్​లోని విదేశీయులను శాంతియుతంగా తరలించేందుకు రష్యా సైన్యం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు ఐరాసాలోని రష్యా శాశ్వత రాయబారి వాసిలి నెబెన్​జియా. ఖార్కివ్​, సుమి నగరాల్లో సుమారు 3,700 మంది భారతీయులను బలవంతంగా ఉండేలా చేస్తున్నారని ఆరోపించారు. బెల్గోరోడ్​ ప్రాంతంలో 130 రష్యన్​ బస్సులు సిద్ధంగా ఉన్నాయని సూచించారు.

09:05 March 05

ఉక్రెయిన్​పై 500 క్షిపణులు ప్రయోగించిన రష్యా

ఉక్రెయిన్​పై క్షిపణులు, బాంబులతో దాడులకు పాల్పడుతోంది రష్యా. గత పది రోజులుగా కొనసాగుతున్న ఈ దురాక్రమణలో ఇప్పటి వరకు మొత్తం 500 క్షిపణులు ప్రయోగించింది రష్యా. రోజుకు రెండు డజన్లకుపైగా వివిధ రకాల మిసైల్స్​ను ప్రయోగిస్తున్నట్లు పెంటగాన్​ అధికారి ఒకరు తెలిపినట్లు కీవ్​ మీడియా తెలిపింది.

07:55 March 05

ఉక్రెయిన్​ సరిహద్దు దేశాల పర్యటనకు కమలా హారిస్

ఉక్రెయిన్​, రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​ కీలక పర్యటన చేపట్టనున్నారు. ఉక్రెయిన్​ సరిహద్దులోని పోలండ్​, రొమేనియాలకు వచ్చే వారం వెళ్లనున్నారు. రష్యా దురాక్రమణలకు వ్యతిరేకంగా నాటో భాగస్వామ్య దేశాలను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని కమలా హారిస్​ డిప్యూటీ ప్రెస్​ సెక్రటరీ సబ్రినా సింగ్​ తెలిపారు.

మార్చి 9-11 మధ్య పోలండ్​లోని వార్సావ్​, రొమేనియాలోని బుకారెస్ట్​కు వెళ్లనున్నట్లు తెలిపారు సింగ్​. ఇరు దేశాల నేతలతో సమావేశంలో రష్యా అంశంపై మాట్లాడనున్నట్లు చెప్పారు. ​అలాగే ఉక్రెయిన్​కు భద్రత, ఆర్థిక, మానవతా సాయం వంటి కీలక అంశాలపైనా చర్చించనున్నట్లు వెల్లడించారు.

07:16 March 05

రష్యాకు సామ్​సంగ్​ ఎలక్ట్రానిక్స్​ సరఫరా నిలిపివేత..

ఉక్రెయిన్​పై భీకర దాడులకు పాల్పడుతున్న రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఆ దేశానికి సరఫరాను నిలిపివేసినట్లు ప్రకటించింది సామ్​సంగ్​ ఎలక్ట్రానిక్స్​. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు.. ఉక్రెయిన్​కు సామ్​సంగ్​ 6 మిలియన్​ డాలర్ల మానవతా సాయం అందించినట్లు కీవ్​ మీడియా తెలిపింది.

06:34 March 05

Russia Ukraine War: ఉక్రెయిన్​- రష్యా యుద్ధం లైవ్​ అప్డేట్స్​

Russia Ukraine War: ఉక్రెయిన్​పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. శనివారం తెల్లవారుజామునే ఉక్రెయిన్​లోని కీలక నగరమైన ఖర్కివ్​లో వరుస పేలుళ్లు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. స్థానిక ప్రజలు సమీపంలోని షెల్టర్లలోకి వెళ్లాలని ప్రభుత్వం సూచించినట్లు తెలిపింది.

Last Updated :Mar 6, 2022, 12:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.