ETV Bharat / international

Ukraine Crisis: 'డెడ్‌హ్యాండ్‌'- అణుదాడికి అత్యంత రహస్య వ్యవస్థ

author img

By

Published : Mar 5, 2022, 12:54 AM IST

Russia Ukraine war
Russia Ukraine war

Russia Ukraine war: ఉక్రెయిన్​ సంక్షోభంపై ప్రపంచ దేశాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్​లోని జాపోరియా అణు విద్యుత్తు కేంద్రంపై రష్యాసేనల దాడితో ఆ భయాందోళన మరింత ఎక్కువవుతుంది. సోవియట్‌ హయాంలోనే సిద్ధం చేసిన 'డెడ్‌హ్యాండ్‌' అనే అత్యంత ప్రమాదకర వ్యవస్థ రష్యా వద్ద ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అయితే ఏమిటీ డెడ్‌హ్యాండ్‌? ఎలా పనిచేస్తుంది?

Russia Ukraine war: ఉక్రెయిన్‌ సంక్షోభం క్రమంగా అణు ముప్పు వైపు మళ్లుతోంది. రష్యా సేనలు తాజాగా ఉక్రెయిన్‌లోని జాపోరిషియా అణు విద్యుత్తు కేంద్రంపై దాడి చేశాయి. ఈ నేపథ్యంలో సంక్షోభం తీవ్రతరం అవుతోంది. ఏ దేశమైనా రష్యాపై అణుదాడి చేసినా.. వారిపై తక్షణమే ప్రతిదాడి చేసేలా 'డెడ్‌హ్యాండ్‌' అనే అత్యంత ప్రమాదకర వ్యవస్థను సోవియట్‌ హయాంలోనే సిద్ధం చేసింది. ప్రస్తుతం ఇది రష్యా ఆధీనంలో ఉంది. ప్రత్యర్థులు రష్యాపై అణుదాడి ఆలోచన చేయడానికి కూడా భయపడేలా ఈ వ్యవస్థను రూపొందించారు. కొన్నాళ్ల క్రితం వాషింగ్టన్‌ పోస్టు ప్రతినిధి రష్యాలో ఉండి పరిశోధించి.. 2009లో 'డెడ్‌హ్యాండ్‌' వ్యవస్థపై ఏకంగా పుస్తకం రాశారు.

ఏమిటీ డెడ్‌హ్యాండ్‌..?

రష్యా వద్ద అణ్వాయుధాలు ప్రయోగించే 700 వాహకాలు ఉన్నాయి. వీటిల్లో స్ట్రాటజిక్‌ బాంబర్లు, నూక్లియర్‌ సబ్‌మెరైన్లు, భూగర్భ బొరియల్లో దాచిన ఖండాంతర క్షిపణులు ఉన్నాయి. ఇందుల్లో కొన్ని ఆటోమేటిక్‌గ్గా శత్రువులపై దాడిచేయగలవు. అటువంటి వ్యవస్థను రష్యా సిద్ధం చేసింది.

నాటి సోవియట్‌ (ప్రస్తుతం రష్యా)వంటి దేశంపై అణుదాడి చేస్తే.. మళ్లీ అది ప్రతిదాడి చేసే అవకాశం ఇచ్చేందుకు ఏ దేశం ఇష్టపడదు. ఈ క్రమంలో భారీ ఎత్తునే అణుదాడి జరిగే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా అణుదాడికి ఆదేశాలు జారీ చేసే నూక్లియర్‌ కమాండ్‌ మొత్తాన్ని అంతం చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తారు. కోల్డ్‌వార్‌ సమయంలో ఇదే విషయం సోవియట్‌ను భయపెట్టింది. దీంతో దేశ అత్యున్నత నాయకత్వం, నూక్లియర్‌ కమాండ్‌ అణుదాడిలో తుడిచిపెట్టుకుపోయినా.. ప్రత్యర్థులపై అణ్వాస్త్రాలను సంధించేందుకు 'పెరిమీటర్‌' పేరిట ఒక వ్యవస్థను సోవియట్‌ సిద్ధం చేసింది. దీనిని అమెరికా, పశ్చిమ దేశాల్లో ‘డెడ్‌హ్యాండ్‌’గా వ్యవహరిస్తారు. అణుదాడిలో రష్యా బాగా దెబ్బతిన్నా.. ఈ డెడ్‌హ్యాండ్‌ వ్యవస్థ ప్రత్యర్థులపై ఎదురుదాడి చేస్తుంది.

ఏమిటీ డెడ్‌హ్యాండ్‌..?

సోవియట్‌ శాస్త్రవేత్తలు వినూత్నమైన ఆలోచనతో దీని రూపుకల్పన చేశారు. అత్యంత శక్తిమంతమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థను దీని వార్‌హెడ్‌లో అమర్చారు. ఇది దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లోని భూగర్భ బొరియలు (సిలోస్‌), ఇతర చోట్ల భద్రపర్చిన అణు క్షిపణులకు దాడికి సంబంధించి ఆదేశాలు జారీ చేస్తుంది. ఇందుకోసం రష్యా రాడార్లు, శాటిలైట్లతో సమన్వయం చేసుకొంటూ ఈ వ్యవస్థ పనిచేస్తుంది.

అణుదాడి జరిగే అవకాశం ఉన్న సమయంలో అత్యున్నత స్థాయి అధికారులు డెడ్‌హ్యాండ్‌ను యాక్టివేట్‌ చేస్తారు. అప్పుడు ఈ వ్యవస్థ సెస్మిక్‌ , రేడియేషన్‌, గాలి ఒత్తిడి వంటి వాటిని సెన్సర్ల సాయంతో ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటుంది. అణుదాడి జరిగినట్లు నిర్ధారించుకొన్నాక.. వార్‌ రూమ్‌తో కమ్యూనికేషన్‌ చేసేందుకు ప్రయత్నిస్తుంది. కొంత సమయం వేచి చూసిన తర్వాత అణుదాడికి ఆదేశాలు జారీ చేసేవారి వైపు నుంచి స్పందన లేకపోతే.. వారు మృతి చెందినట్లు భావించి పెరిమీటరే అణుదాడికి ఆదేశాలు జారీ చేస్తుంది.

ఇందుకోసం ఎస్‌ఎస్‌-19 బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగిస్తుంది. దీని వార్‌హెడ్‌లో అత్యంత శక్తిమంతమైన రేడియో ట్రాన్స్‌మిటింగ్‌ వ్యవస్థ ఉంటుంది. ఇది భూమికి నాలుగు కిలోమీటర్ల ఎత్తులో దాదాపు 4,500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో సురక్షితంగా ఉన్న అణు క్షిపణులకు ఆదేశాలు జారీ చేస్తుంది. వెంటనే భూగర్భ బొరియల నుంచి ఖండాంతర అణు క్షిపణులు గాల్లోకి లేచి శత్రుదేశంపై విరుచుకుపడతాయి.

1970లో దీని నిర్మాణం ప్రారంభించిన సోవియట్‌ యూనియన్‌.. 1984లో బైలోరసియన్‌ నుంచి పరీక్షించింది. ఇక్కడి నుంచి గాల్లోకి లేచిన క్షిపణి.. కజకిస్థాన్‌లోని బైకనూర్‌ వద్ద భూగర్భ బొరియలోని క్షిపణికి ఆదేశాలు జారీ చేసింది. ఆ క్షిపణి నిర్ణీత లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. 1985 నుంచి ఈ వ్యవస్థను వినియోగంలోకి తెచ్చింది. సోవియట్‌ విచ్ఛిన్నం తర్వాత రష్యా ఆధీనంలోనే ఈ వ్యవస్థ ఉంది.

సైబర్‌ అణు ముప్పు..

ఈ డెడ్‌హ్యాండ్‌ వ్యవస్థ కృత్రిమ మేధ ఆధారంగా పనిచేస్తుంది. కోల్డ్‌వార్‌ సమయంలో నిర్మించిన దీనిని కొంత అప్‌గ్రేడ్‌ చేశారు. 2018లో అణు నిరాయుధీకరణ నిపుణుడు బ్రూస్‌ బ్లేయర్‌ ఓ పత్రికతో మాట్లాడుతూ 'పెరిమీటర్‌'(డెడ్‌హ్యాండ్) సైబర్‌ దాడులకు అనుకూలంగా ఉందని వెల్లడించారు. ఇదే జరిగితే వినాశనం తప్పదని హెచ్చరించారు.

అణు సునామీకీ ఏర్పాట్లు..!

రష్యా 2018లో పొసైడాన్‌ నూక్లియర్‌ అండర్‌వాటర్‌ డ్రోన్‌ను ఆవిష్కరించింది. ఇది శత్రుదేశాల్లోని తీరాల్లో 300 అడుగుల ఎత్తున సునామీని సృష్టించగలదు. ఫలితంగా శత్రువుల నావికాదళం తుడిచిపెట్టుకుపోతుంది. అమెరికాను లక్ష్యంగా చేసుకొని దీనిని నిర్మించినట్లు భావిస్తున్నారు. 2027 నాటికి ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది.

ఇదీ చూడండి: ట్విట్టర్, ఫేస్‌బుక్, బీబీసీ, యాప్‌ స్టోర్‌పై రష్యా బ్యాన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.