ETV Bharat / international

ఉక్రెయిన్​పై ఆగని దాడులు.. ఆ ప్రాంతాలకు భారీగా నాటో బలగాలు

author img

By

Published : Mar 24, 2022, 9:04 PM IST

Russia Ukraine war: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. భాస్వరంతో తయారు చేసిన బాంబులను రష్యా తమపై ప్రయోగిస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. సైనిక పరంగా నాటో సాయం అందించాలని అభ్యర్థించారు. ఈ యుద్ధంలో రష్యా సైన్యానికి కూడా భారీ నష్టమే వాటిల్లినట్లు నాటో అంచనా వేసింది.

Russia Ukraine war
ఉక్రెయిన్​పై రష్యా దాడులు

Russia Ukraine war: ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన సైనికచర్య నెలరోజులకు చేరింది. కీవ్‌ సహా కొన్ని నగరాల్లో కాల్పులు, ఫిరంగి దాడులు జరుగుతున్నట్లు ఉక్రెయిన్‌ వర్గాలు తెలిపాయి. కీవ్‌పై రాకెట్ దాడుల్లో రష్యాకు చెందిన ఓ మహిళా పాత్రికేయురాలు చనిపోయినట్లు ప్రకటించాయి. ఖర్కివ్‌ పరిపాలనా భవనం శిథిలాల నుంచి మరో 24 మృతదేహాలను బయటికి తీసినట్లు సహాయబృందాలు తెలిపాయి. ఈనెల ఒకటిన రష్యా సేనలు జరిపిన రాకెట్‌ దాడుల్లో ఖర్కివ్‌ పరిపాలనా భవనం ధ్వంసమైంది. ట్రాస్టియనెట్స్‌ నగరంలో 2 రోజుల క్రితం భారీ అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇంకా మంటలు ఎగసిపడుతున్నట్లు అక్కడి గవర్నర్‌ తెలిపారు. రాకెట్‌ దాడులు, భీకర పోరు వల్ల సహాయ బృందాలు ఘటనా స్థలానికి వెళ్లలేకపోతున్నట్లు చెప్పారు. మరియుపోల్‌లో 15 వేల మంది పౌరులను రష్యా సైన్యం అక్రమంగా తమ దేశానికి తరలించినట్లు ఉక్రెయిన్‌ ఆరోపించింది.

భాస్వరం బాంబుల దాడి: భాస్వరముతో తయారు చేసిన బాంబులను రష్యా తమపై ప్రయోగిస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. సైనిక పరంగా నాటో సాయం అందించాలని అభ్యర్థించారు. రష్యా పొరుగు దేశాలు ప్రమాదంలో పడ్డాయని స్వీడన్‌ చట్టసభలో వర్చువల్‌గా చేసిన ప్రసంగంలో జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. ఖేర్సన్‌ నగరంలో నాటకరంగ సంచాలకుడిని రష్యా సేనలు అపహరించినట్లు ఉక్రెయిన్‌ సాంస్కృతిక శాఖ ప్రకటించింది. 9 వాహనాల్లో వచ్చిన పుతిన్ సేనలు బలవంతంగా ఆయన్ని ఇంటి నుంచి తీసుకెళ్లినట్లు పేర్కొంది. రాజధాని కీవ్‌ నగరంలోకి ప్రవేశించే విషయమై ఎలాంటి పురోగతి లేకపోవటంతో కీవ్‌ వెలుపల 15నుంచి 20 కిలోమీటర్ల మధ్య రష్యా సేనలు రక్షణ స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు అమెరికా వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు 7నుంచి 15 వేలమంది రష్యా సైనికులు చనిపోయినట్లు నాటో తెలిపింది. రష్యా దాడుల్లో ఎంత మంది ఉక్రెయిన్‌ సైనికులు, పౌరులు మరణించారనే విషయం అటు ఉక్రెయిన్‌గాని ఇటు నాటోగాని చెప్పలేదు.

కొనసాగుతున్న ఆంక్షలు: రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షల పర్వం కొనసాగుతోంది. మరో 59మంది రష్యాకు చెందిన వ్యక్తులు, సంస్థలతోపాటు బెలారస్‌కు చెందిన మరో ఆరు సంస్థలపై బ్రిటన్‌ ఆంక్షలు విధించింది. మాస్కో కూడా ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది. మిత్రదేశాలు కానివారికి సొంత కరెన్సీ రూబుల్‌ ద్వారా మాత్రమే గ్యాస్‌ విక్రయించాలని నిర్ణయించింది. ఇప్పటికీ ఉక్రెయిన్‌ ద్వారా ఐరోపా దేశాలకు సహజ వాయువు సరఫరా చేస్తున్నట్లు రష్యా దిగ్గజ చమురు సంస్థ గాజ్‌ప్రొమ్‌ తెలిపింది. ఉక్రెయిన్‌లో రష్యా సేనల యుద్ధ నేరాలను గుర్తించినట్లు అమెరికా ప్రకటించింది.

ఉక్రెయిన్‌కు బిలియన్‌ డాలర్ల మానవతా సాయం: యుద్ధ సంక్షోభిత ఉక్రెయిన్‌లో మానవతా సాయానికి ఒక బిలియన్ డాలర్ల ఆర్థిక తోడ్పాటు అందించడంతోపాటు లక్ష మంది ఉక్రెయిన్ శరణార్థులను దేశంలోకి అనుమతించే ప్రణాళికను అమెరికా ప్రకటించనున్నట్లు సీనియర్ అధికారి తెలిపారు. దీంతోపాటు ఉక్రెయిన్‌, పొరుగు దేశాల్లో మీడియా స్వేచ్ఛ, మానవ హక్కులకు అండగా నిలిచేందుకు అగ్రరాజ్యం 320 మిలియన్‌ డాలర్ల నిధులతో 'యూరోపియన్ డెమొక్రటిక్ రెసెలియన్స్‌ ఇనిషియేటివ్'ను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

నాటో తూర్పుభాగం బలోపేతానికి అన్ని చర్యలు: నాటో తూర్పు భాగాన్ని బలోపేతం చేయాలని కూటమి సభ్యత్వ దేశాల నేతలు నిర్ణయించారు. 'రష్యా చర్యలకు ప్రతిస్పందనగా.. మేం నాటో దీర్ఘకాలిక రక్షణ ప్రణాళికలను యాక్టివేట్‌ చేశాం. తూర్పు భాగంలో 40వేల మంది నాటో రెస్పాన్స్ ఫోర్స్‌ సైనికులను మోహరించాం' అని బ్రస్సెల్స్‌లో అత్యవసర శిఖరాగ్ర సమావేశం అనంతరం ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 'బల్గేరియా, హంగరీ, రొమేనియా, స్లోవేకియాలో నాలుగు అదనపు మల్టీనేషనల్‌ యుద్ధ బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. మిత్రదేశాల భద్రతను నిర్ధరించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం' అని అందులో పేర్కొన్నారు. సైబర్ రక్షణ వ్యవస్థనూ బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు.

రష్యన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ 'బంగారం' లావాదేవీలపై పరిమితులు: రష్యన్ సెంట్రల్ బ్యాంక్ తన లావాదేవీలకు బంగారాన్ని ఉపయోగించడాన్ని పరిమితం చేస్తున్నట్లు జీ-7 కూటమి నేతలు గురువారం ప్రకటించారు. ఆయా అంతర్జాతీయ సంస్థలు.. రష్యాతో తమ సంబంధాలను సమీక్షించుకోవాలంటూ జీ-7 కూటమి పిలుపునిస్తోందని అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు 400కుపైగా రష్యన్‌ ప్రముఖులు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని అమెరికా తాజాగా మరో ఆంక్షల జాబితాను విడుదల చేసింది.

1035 పౌరులు మరణించారు.. ఐరాస హక్కుల కార్యాలయం: ఉక్రెయిన్‌లో రష్యా దాడుల కారణంగా ఇప్పటివరకు 1035 మంది పౌరులు మృతి చెందినట్లు ఐరాస మానవ హక్కుల కార్యాలయం(ఓహెచ్‌సీహెచ్‌ఆర్‌) గురువారం వెల్లడించింది. ఇందులో 90 మంది చిన్నారులు ఉన్నారని ఓ ప్రకటనలో తెలిపింది. మరో 1650 మంది గాయాలపాలయ్యారని చెప్పింది. మరియుపోల్ తదితర నగరాల నుంచి ఇంకా పూర్తిస్థాయి నివేదికలు రాని నేపథ్యంలో.. మరణాల సంఖ్య భారీగానే ఉంటుందని అంచనా వేసింది. ఫిరంగులు, మల్టీపుల్‌ లాంచ్ రాకెట్ వ్యవస్థల ద్వారా భారీ ఎత్తున షెల్లింగ్‌తోపాటు క్షిపణి, వైమానిక దాడుల కారణంగానే ఎక్కువ మంది మరణించారని వెల్లడించింది.

బోరిస్‌ జాన్సన్‌.. రష్యా వ్యతిరేకి: ప్రస్తుతం రష్యాకు వ్యతిరేకంగా అత్యంత చురుకుగా వ్యవహరిస్తున్న ప్రపంచ నేత.. బోరిస్‌ జాన్సన్‌ అని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ పేర్కొన్నారు. రష్యా విషయంలో బ్రిటన్‌ వ్యవహార తీరు.. ఆ దేశంలో తమ విదేశాంగ విధానం ముగింపునకు దారి తీస్తుందని పెస్కోవ్‌ హెచ్చరించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. ఉక్రెయిన్​పై రష్యా చేస్తున్న దాడులపై దర్యాప్తు చేపట్టాలని అంతర్జాతీయ క్రిమినల్​ కోర్టును కోరారు 20 దేశాల నేతలు. హేగ్​లోని బ్రిటీష్​ రాయబారి నివాసంలో గురువారం భేటీ అయ్యారు. దర్యాప్తునకు సహకరించాలని కోరారు. గ్లోబల్​ లీగర్​ ఆర్డర్​కు కూటమి దేశాలు మద్దతుగా నిలవాలని నేతలను కోరారు కోర్టు చీఫ్​ ప్రాసిక్యూటర్​.

ఆరోపణలను తోసిపుచ్చిన చైనా: ఉక్రెయిన్​లో అమెరికా కార్యకలాపాలు చేస్తున్నట్లు రష్యా తప్పుడు వాదనలను వ్యాప్తి చేసేందుకు చైనా సాయం చేస్తోందన్న ఆరోపణలను తోసిపుచ్చింది చైనా. ఉక్రెయిన్​పై తప్పుడు ఆరోపణల వ్యాప్తికి చైనాను నిందించటమే సరైనది కాదని డ్రాగన్​ విదేశాంగ శాఖ ప్రతినిది వాంగ్​ వెన్​బిన్​ పేర్కొన్నారు. చైనా పరిస్థితులకు తగినట్లుగా నడుచుకుంటోందన్నారు. ఉక్రెయిన్​లోని బయోల్యాబ్​లపై అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.