ETV Bharat / international

ఆ దేశ ప్రధానిపై రూ.900కోట్ల దావా

author img

By

Published : Dec 24, 2020, 12:51 PM IST

relatives of people who died of Covid in Italy had begun legal actions
ఆ దేశ ప్రధానిపై రూ.900కోట్ల దావా

ఇటలీ ప్రధానిపై ఆ దేశంలోని కొవిడ్-19తో మృతి చెందిన వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన నష్టానికి రూ.900 కోట్ల పరిహారం చెల్లించాలని అంటున్నారు. వైరస్​ వ్యాప్తిని కట్టడి చేయడంలో ఇటలీ విఫలమైన నేపథ్యంలో బెర్గామో ప్రజలు న్యాయపోరాటం చేస్తున్నారు.

ఇటలీలో కొవిడ్-19 మృతుల బంధువులు ఆ దేశ ప్రధానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. మొత్తం 500 మంది కలిసి ఒక సమూహంగా ఏర్పడి ప్రభుత్వంపై దావా వేశారు. తమకు జరిగిన నష్టానికి రూ.900 కోట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వారు తమ దావాలో ఇటలీ ప్రధాని గిసెప్పే కొంటే, ఆరోగ్యశాఖ మంత్రి రోబర్టో స్పెరాంజా, లాంబార్డీ ప్రాంత గవర్నర్‌ అట్టిలియో ఫొంటానా పేర్లను చేర్చారు.

మొదటిసారి కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తరవాత దాని కారణంగా అత్యధికంగా ప్రభావితమైన పాశ్చాత్య దేశాల్లో ఇటలీ ముందుంది. ఫిబ్రవరిలో ఆ దేశంలో వైరస్‌ ఉనికిని గుర్తించగా.. ఇప్పటివరకు 70 వేలకుపైగా మరణాలు సంభవించాయి. ఐరోపా పరంగా చూసుకుంటే మృతుల విషయంలో తొలిస్థానంలో ఉండగా ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానంలో నిలిచింది. ఆ దేశం వైరస్‌తో ఎంతగా ఉక్కిరిబిక్కిరి అయ్యిందో ఈ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి.

బృందంగా ఏర్పడి...

లాంబార్డీలో వైరస్‌తో తీవ్రంగా ఇబ్బంది పడిన బెర్గామో ప్రాంతానికి చెందిన 500 మంది.. తమ ఆప్తులను కోల్పోయారు. ఏప్రిల్‌లో వీరంతా ఓ బృందంగా ఏర్పడి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ.. తమకు జరిగిన నష్టంపై న్యాయ పోరాటం మొదలు పెట్టారు.

'తమ బాధ్యతలు నిర్వర్తించని వారికి ఇది క్రిస్మస్ బహుమతి' అంటూ ఈ బృందానికి నేతృత్వం వహిస్తోన్న లూకా ఫుస్కో ఓ ప్రకటనలో తెలిపారు. వైరస్ విజృంభిస్తున్న సమయంలో లాక్‌డౌన్ విధించడంలో, అది తెచ్చిపెట్టిన ఆర్థిక నష్టాన్ని నివారించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సంసిద్ధత లేకపోవడం, ప్రణాళిక బద్ధంగా వ్యవహరించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. అయితే, ఈ దావాపై ప్రధాని, ఆరోగ్య మంత్రి, గవర్నర్‌ అధికార ప్రతినిధులు స్పందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో... ఇటలీలో వైరస్ విజృంభణపై ఇప్పటికే ఆ దేశ ప్రధానిని కూడా ప్రాసిక్యూటర్లు ప్రశ్నించారు.

ఇదీ చదవండి:పెరూలో వ్యవసాయ కార్మికుల ఆగ్రహం -వాహనాలకు నిప్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.