ETV Bharat / international

ఫేస్​బుక్​ దారిలో యూట్యూబ్​-​ సైన్యం ఛానళ్లు బంద్

author img

By

Published : Mar 5, 2021, 3:52 PM IST

మయన్మార్​లో సైనిక తిరుగుబాటు, ప్రజాందోళన నేపథ్యంలో మిలిటరీ ఆధ్వర్యంలోని 5 ఛానళ్లు సహా మొత్తం 20 ఛానళ్లను రద్దు చేసింది యూట్యూబ్​. హింసాత్మక, రెచ్చగొట్టే కంటెంట్​ ఉన్న 160 వీడియోలను తొలగించింది. మరోవైపు.. మయన్మార్​లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా. సైన్యం తీరును తప్పుపట్టింది.

YouTube cancels Myanmar military-run channels, pulls videos
మయన్మార్​ సైన్యం ఛానళ్ల తొలగింపు

మయన్మార్​లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న క్రమంలో ఆ దేశ సైన్యం ఆధ్వర్యంలోని ఖాతాలపై సామాజిక మాధ్యమ వేదికలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఫేస్​బుక్​ మిలిటరీ పేజీలను తొలగించగా.. ఆ జాబితాలో యూట్యూబ్​ చేరింది. సైన్యానికి చెందిన 5 ఛానళ్లను తొలగించింది. తమ మార్గదర్శకాలు, నిబంధనలను అతిక్రమించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

"మ్యావాడీ మీడియా, ఎంఆర్​టీవీ, డబ్ల్యూడీ ఆన్​లైన్​ బ్రాడ్​కాస్టింగ్​, ఎండబ్ల్యూడీ వెరైటీ, ఎండబ్ల్యూడీ మయన్మార్​కు చెందిన మీడియా ఛానళ్లను రద్దు చేశాం. మా మార్గదర్శకాలు, చట్టాలను అనుసరించి ఇతర ఛానళ్లు​, వీడియోలనూ తొలగించాం. నిబంధనలు అతిక్రమించే ఛానళ్లను నిశితంగా పరిశీలిస్తున్నాం. "

- యూట్యూబ్​

20 ఛానళ్లు​, 160 వీడియోలు..

సైన్యానికి చెందిన 5 ఛానళ్లు​ సహా మొత్తం 20 ఛానళ్లపై వేటు వేసినట్లు తెలిపింది యూట్యూబ్​. కొద్ది నెలలుగా రెచ్చగొట్టే ప్రసంగాలు, వేధింపులు, స్పామ్​, హింసాత్మక సమాచారం వంటి తమ విధాన నిబంధనలు అతిక్రమించిన 160 వీడియోలనూ తొలగించినట్లు వెల్లడించింది.

గత ఏడాది డిసెంబర్​లో 34 ఛానళ్లను తొలగించింది యూట్యూబ్​. అందులో మయన్మార్​ ఎన్నికలు, అమెరికా, చైనా, మలేసియాలల్లో ప్రాంతీయ ఘర్షణలకు సంబంధించిన వీడియోలు ఉన్నట్లు తేలటం వల్ల ఆ నిర్ణయం తీసుకుంది.

మయన్మార్​ పరిస్థితులు ఆందోళనకరం: అమెరికా

మయన్మార్​లో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొంది అమెరికా. పరిస్థితులు చక్కదిద్దేందుకు ఆ ప్రాంతంలోని తమ భాగస్వామ్య దేశాలతో అధ్యక్షుడు బైడెన్​ పరిపాలన విభాగం కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. ఆంక్షలు విధించడం ద్వారా.. మయన్మార్​లో సైనిక తిరుగుబాటు ఆమోదయోగ్యం కాదనే స్పష్టమైన సందేశాన్ని బైడెన్​ పంపారని శ్వేతసౌధం ప్రెస్​ సెక్రటరీ జెన్​ సాకి వివరించారు. గురువారం రోజున మయన్మార్​ సైన్యం కాల్పుల్లో దాదాపు 24 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వచ్చిన వార్తలతో దిగ్భ్రాంతికి గురైనట్లు అగ్రరాజ్య విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్​ ప్రైస్​ తెలిపారు. సైన్యం అవలంభిస్తున్న హింసాత్మక ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: నిరసనకారులపై పోలీసుల కాల్పులు- 33 మంది మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.