'ఇంట్లోనే ఉండండి'.. మహిళలకు తాలిబన్ల ఆర్డర్

author img

By

Published : Sep 19, 2021, 3:04 PM IST

taliban

అఫ్గాన్​ రాజధాని కాబుల్​లో పనిచేసే మహిళలు ఎవరూ ఇళ్లు విడిచి బయటకు రాకూడదని ఆదేశాలిచ్చింది తాలిబన్​ ప్రభుత్వం. డిజైనింగ్‌, ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ తదితర పనుల్లో నైపుణ్యం కలిగిన వారికి మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పింది.

అఫ్గానిస్థాన్​ మహిళలను తాలిబన్లు తమ ఆంక్షల చట్రంలో మరింత బిగించేస్తున్నారు(afghan women taliban). తాజాగా రాజధాని కాబుల్‌లో పనిచేసే మహిళా ఉద్యోగులు ఎవరూ ఇళ్లు విడిచి బయటకు రావడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. అయితే కేవలం మహిళలు(taliban women news) చేసే పనులకు మాత్రమే వారిని అనుమతించనున్నట్లు.. కాబుల్‌ మేయర్‌ హమ్‌దుల్లా నమోనీ స్పష్టం చేశారు. డిజైనింగ్‌, ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ తదితర పనుల్లో నైపుణ్యం కలిగిన వారికి మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. అటు పురపాలక విభాగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కాబుల్‌ మేయర్‌ అన్నారు.(taliban women rights)

వారం రోజుల్లో మూడోసారి...

మహిళలకు వ్యతిరేకంగా తాలిబన్లు చర్యలు చేపట్టడం.. వారం రోజుల్లో ఇది మూడోసారి! 6-12 తరగతుల అబ్బాయిలు, పురుష ఉపాధ్యాయులు శనివారం నుంచే క్లాసులకు హాజరుకావాలని ఆదేశిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది విద్యాశాఖ(taliban girls education). శుక్రవారం ఈ ప్రకటన ఫేస్​బుక్​లో దర్శనమిచ్చింది. అబ్బాయిల గురించే ఇందులో ఉంది. అమ్మాయిల గురించి ఎలాంటి ప్రకటన లేదు(taliban education news). మార్గదర్శకాల్లోనూ వారి ప్రస్తావన లేకపోవడం.. బాలికలు, మహిళలపై కఠిన ఆంక్షలు ఉంటాయన్న వాదనలకు మరింత ఊతమిస్తోంది.

గత తాలిబన్ల పాలనలో ఇటువంటి కఠిన వైఖరే ఉండేది. అయితే అప్పుడు కనీసం 1-6 తరగతుల బాలికలను చదువుకోనిచ్చేవారు. ఆ తర్వాత పాఠశాలలు, పని ప్రదేశాల్లోకి వారికి అనుమతులు లేవు. అఫ్గాన్​లోని కొన్ని రాష్ట్రాల్లో అనేకమంది మహిళలు ఇప్పటికీ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆసుపత్రి, విద్య, ఆరోగ్యశాఖలో పనిచేసే కొందరికి మాత్రమే అనుమతులుండేవి.

ఇదీ చూడండి:- Afghanistan women: 'మహిళలను మనుషుల్లానే చూడట్లేదు!'

ఇలా.. మహిళల చదువుకు, ఉద్యోగాలకు అనేక ఆంక్షలు విధిస్తున్న తాలిబన్లు.. శనివారం ఏకంగా మహిళా మంత్రిత్వ శాఖనే ఎత్తేశారు. ఆ స్థానంలో 'వైస్ అండ్​ వర్చ్యూ మంత్రిత్వ శాఖ' ను తీసుకొచ్చింది. ఇందులో సభ్యులంతా పురుషులే ఉన్నారు.(taliban women news)

మరోవైపు అఫ్గాన్​లో.. ప్రపంచ బ్యాంకు చేపట్టిన 100మిలియన్​ డాలర్ల మహిళ ఆర్థిక సాధికారత, గ్రామీణాభివృద్ధి కార్యక్రమం కూడా దాదాపు ముగింపు దశకు చేరుకుంది! అక్కడి సిబ్బంది అఫ్గాన్​ను విడిచి వెళ్లిపోవడమే ఇందుకు కారణం.

భయం గుప్పిట్లో..

తాలిబన్ల పాలనలో ప్రజలంతా భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. ఇటు బాలికలు బయటకు వెళ్లలేక.. అటు జీతాలు అందక ఉద్యోగులు, వైద్యులు విలవిలలాడిపోతున్నారు. అమెరికా దళాలు వైదొలగకముందే.. ఆగస్టు 15న కాబుల్​పై జెండా ఎగరేశారు తాలిబన్లు. ఫలితంగా ఆ దేశం సంక్షోభంలోకి కూరుకుపోయింది. దేశాన్ని వీడేందుకు ప్రజలు పోటీపడి కాబుల్​ విమానాశ్రయం వద్ద బారులుతీరారు. పలువురు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోగా.. అనేకమంది అక్కడే ఉండిపోయారు. కొన్ని రోజుల అనంతరం దేశంలో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు తాలిబన్లు.

మహిళలకు.. పూర్తి స్వేచ్ఛను ప్రసాదిస్తామని తొలినాళ్లలో చెప్పిన తాలిబన్లు అందుకు పూర్తి భిన్నంగా ఆంక్షలు విధించటంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. 1990 నాటి పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇవీ చూడండి:- Afghanistan News: 'నా దుస్తులు తాకొద్దు'.. తాలిబన్లకు వ్యతిరేకంగా ఉద్యమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.