ETV Bharat / international

ఇజ్రాయెల్​-గాజా కాల్పుల విరమణకు ఫ్రాన్స్​ మద్దతు!

author img

By

Published : May 19, 2021, 10:00 AM IST

Updated : May 19, 2021, 10:08 AM IST

ఇజ్రాయెల్​ బలగాలకు, గాజాలోని హమాస్​ ఉగ్రవాదులకు మధ్య కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం చేయాలని ఫ్రాన్స్​ కోరినట్లు చైనా తెలిపింది. మరోవైపు.. ఈ రెండు దేశాల మద్య తలెత్తిన ఘర్షణలపై ఐరాస మానవ హక్కుల సమన్వయ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. గాజా పునర్మిర్మాణం కోసం ఈజిప్టు 500 మిలియన్​ డాలర్ల సాయం ప్రకటించింది.

gaza
గాజా, ఇజ్రాయెల్​ ఘర్షణలు

ఇజ్రాయెల్​ బలగాలకు, గాజాలోని హమాస్​ ఉగ్రవాదులకు మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఐక్యరాజ్య సమితి(ఐరాస) భద్రతా మండలి తీర్మానం చేయాలని ఫ్రాన్స్ కోరినట్లు ఐరాసలోని చైనా రాయబారి తెలిపారు. ఈ మేరకు భద్రతా మండలి మూడో సమావేశంలో ఐరాసలోని ఫ్రాన్స్​ రాయబారి నికోలస్​ డి రివిరే తెలిపినట్లు ఐరాస భద్రతా మండలి అధ్యక్షుడు ఝాంగ్​ జున్​ ధ్రువీకరించారు.

ఇప్పటికే.. ఇజ్రాయెల్, గాజాల మధ్య ఉద్రిక్తతలకు అంతం చేసే దిశగా తాము దౌత్యమార్గాల్లో ప్రయత్నిస్తున్నామని అమెరికా తెలిపింది. అందుకు కాల్పుల విరమణ అంశంపై భద్రతా మండలిలో తాము చేసే ప్రకటన సాయపడదని చెప్పింది. ఇజ్రాయెల్​, గాజా ఉగ్రవాదులు కాల్పుల విరమణ కోసం భద్రతా మండలిలో తీర్మానం చేయాలన్న చైనా, నార్వే, ట్యునీషియా ప్రతిపాదనను మరో 14 సభ్య దేశాలు మద్దతు తెలిపాయని దౌత్యవేత్తలు తెలిపారు. దీనిపై భద్రతామండలి అధికారిక ప్రకటన చేసేందుకు 15 సభ్యదేశాల మద్దతు అవసరమవుతుంది. అయితే.. తీర్మానం చేసేందుకు కనీసం 9 దేశాలు మద్దతు తెలపాల్సి ఉంటుంది. అందులో ఒక్క శాశ్వత సభ్యదేశం కూడా తిరస్కరించకూడదు. ఈ తరుణంలో అమెరికా తీసుకోనున్న నిర్ణయం కీలకంగా మారింది.

భయానక పరిస్థితులు..

ఇజ్రాయెల్​, గాజాల మధ్య భయానక యుద్ధవాతావరణాన్ని తలపిస్తోందని ఐక్యరాజ్య సమితికి చెందిన మానవ హక్కుల సమన్వయ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘర్షణల కారణంగా 47,000 మంది పాలస్తీనియన్ల ఆచూకీ గల్లంతైందని తెలిపింది. ఇజ్రాయెల్​పై గాజా ఉగ్రవాదులు 3,400 రాకెట్లను ప్రయోగించారని చెప్పింది. గాజాలో విద్యుత్​ సరఫరా తీవ్రంగా దెబ్బతిందని, వైద్యం ఇతర సేవలకు అంతరాయం కలుగుతోందని వెల్లడించింది.

గాజాకు అండగా ఈజిప్టు

గాజా పునర్నిర్మాణం కోసం ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్​ ఫతా-ఎల్​ సిస్సి .. 500 మిలియన్​ డాలర్ల సాయం ప్రకటించారు. ఈమేరకు ఆ అధ్యక్షుడి కార్యాలయం ఫేస్​బుక్​ వేదికగా తెలిపింది.

గాజా, ఇజ్రాయెల్​ మధ్య కాల్పుల విరమణ కోసం ఈజిప్టు కృషి చేస్తోంది. దాడుల వల్ల గాయపడ్డవారి చికిత్స కోసం గాజాకు రెండు డజన్ల ట్రక్కుల వైద్య సామగ్రిని, సిబ్బందిని పంపించింది. గాయపడ్డవారికి తమ దేశంలోని ఆస్పత్రుల్లో చికిత్సను అందిస్తోంది.

ఇదీ చూడండి: 'హేట్​ క్రైమ్'​ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం

Last Updated : May 19, 2021, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.