ETV Bharat / international

మయన్మార్ సైనిక అధినేతతో ఆసియాన్ దేశాల చర్చలు

author img

By

Published : Apr 24, 2021, 6:57 PM IST

ASEAN leaders demand Myanmar coup leaders end killings
మయన్మార్ సైనిక అధినేతతో ఆసియాన్ దేశాల చర్చలు

మయన్మార్​ సైన్యం నిర్బంధించిన నేతల విడుదల సహా, పౌరులపై హింసను ఆపాలని ఆసియాన్ దేశాలు డిమాండ్ చేశాయి. మయన్మార్ సైనిక ప్రభుత్వ అధినేతతో జరిగిన చర్చల సందర్భంగా ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. దేశంలో శాంతి, స్థిరత్వాన్ని ఏర్పరచాలని సూచించాయి.

మయన్మార్​లో తిరుగుబాటుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న పౌరులను చంపడం ఆపాలని ఆ దేశ సైనిక ప్రభుత్వానికి ఆసియాన్ దేశాలు హితవు పలికాయి. నిర్బంధంలో ఉన్న రాజకీయ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ఇండోనేసియా రాజధాని జకర్తాలో జరిగిన అత్యవసర సమావేశంలో మయన్మార్ సైనిక ప్రభుత్వ అధినేతకు స్పష్టం చేశాయి.

ఈ మేరకు మయన్మార్ సైనిక ప్రభుత్వ అధినేత సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ లాయింగ్​తో శనివారం ఆసియాన్ దేశాధినేతలు చర్చలు జరిపారని ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో తెలిపారు. మయన్మార్​లో రెండు పక్షాల మధ్య చర్చలు ప్రారంభం కావాలని ఆసియాన్ దేశాలు ఆకాంక్షించినట్లు వెల్లడించారు. మయన్మార్​లో ప్రస్తుతమున్న పరిస్థితులు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కావని స్పష్టం చేశారు.

"హింస తప్పకుండా ఆగిపోవాలి. మయన్మార్​లో శాంతి, స్థిరత్వం, ప్రజాస్వామ్యం పునస్థాపితం కావాలి. మయన్మార్ ప్రజల ప్రయోజనాలే ఆ దేశానికి ప్రాధాన్యం కావాలి."

-జాకో విడోడో, ఇండోనేసియా అధ్యక్షుడు

అయితే, మయన్మార్ సైనిక అధినేత లాయింగ్.. ఆసియాన్ దేశాలకు సమాధానం ఇచ్చారా అన్న విషయంపై స్పష్టత లేదు. సైనిక తిరుగుబాటు తర్వాత మయన్మార్​ విడిచి బయటకు రావడం లాయింగ్​కు ఇదే తొలిసారి.

700 మంది మృతి!

ఫిబ్రవరి 1న తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసింది మయన్మార్​ సైన్యం. ఈ తిరుగుబాటుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. వీటిని అణచివేసేందుకు సైన్యం కఠిన చర్యలు చేపడుతోంది. సొంత పౌరులపైనే కాల్పులకు తెగబడుతోంది. ఇప్పటివరకు భద్రతా దళాల కాల్పుల్లో 700 మంది నిరసనకారులు చనిపోయినట్లు అంచనా.

ఇదీ చదవండి- ఇండోనేసియా జలాంతర్గామి శకలాలు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.