ETV Bharat / international

Delta Variant: వెయ్యి రెట్లు ఎక్కువగా వైరస్‌ వ్యాప్తి!

author img

By

Published : Jul 26, 2021, 10:14 AM IST

DELTA VARIANT virus 1000 times
వెయ్యి రెట్లు ఎక్కువగా వైరస్‌ వ్యాప్తి

కరోనా డెల్టా వేరియంట్(Delta Variant) ప్రమాదకర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. బాధితుడికి దగ్గరగా వెళ్లిన 4 రోజుల్లోనే ఇన్‌ఫెక్షన్‌ సోకుతోంది. ఈ వేరియంట్ బారిన పడ్డ రోగి నుంచి వెయ్యి రెట్లు ఎక్కువగా వైరస్‌ విడుదల అవుతోంది. డెల్టా వల్ల మరణ ముప్పు రెండు రెట్లు ఉంటోందని అధ్యయనాలు చెబుతున్నాయి.

కరోనాలో వెలుగు చూసిన వేరియంట్లన్నింటిలోకి అత్యంత ఎక్కువ సాంక్రమిక శక్తిని ప్రదర్శిస్తున్న డెల్టా రకాన్ని కట్టడి చేయడానికి ముమ్మర చర్యలు అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వేరియంట్‌ బారినపడినవారికి దగ్గరగా వెళ్లిన వారిని ప్రారంభ దశలోనే గుర్తించడానికి వ్యవధి తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. కొవిడ్‌-19 టీకాలు ప్రజలందరికీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని నేపథ్యంలో ఈ రకం ఉద్ధృతికి కళ్లెం వేయాలంటే ఇలాంటివారిని శరవేగంగా గుర్తించడం ముఖ్యమని స్పష్టంచేస్తున్నారు.

2019లో చైనాలోని వుహాన్‌లో వెలుగుచూసిన కరోనా రకం మొదట పలు దేశాల్లో విస్తరించింది. అయితే గత ఏడాది మార్చిలో.. మరింత ఎక్కువ సాంక్రమిక శక్తి కలిగిన డి614జి రకం వచ్చిపడింది. అనంతరం బ్రిటన్‌లో ఆల్ఫా రకం బయటపడింది. 2021 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా దీని వ్యాప్తి ఎక్కువగా కనిపించింది. ఈలోగా డెల్టా రకం వచ్చిపడింది. కొన్ని ఉత్పరివర్తనల వల్ల దీని వ్యాప్తి ఆల్ఫా కన్నా చాలా ఎక్కువగా ఉంది. టీకాల ద్వారా లభించిన రోగనిరోధక శక్తిని కొంతమేర ఏమార్చే సామర్థ్యాన్ని సొంతం చేసుకుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వుహాన్‌ రకంతో పోలిస్తే.. డెల్టా వేరియంట్‌ సోకిన వ్యక్తి నుంచి వెయ్యి రెట్లు ఎక్కువగా వైరస్‌ వెలువడుతున్నట్లు ఒక అధ్యయనం తేల్చింది. డెల్టా వల్ల ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం, ఐసీయూలో చికిత్స తీసుకోవాల్సి రావడం, మరణం ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటాయని మరో పరిశోధన పేర్కొంది.

ఎక్కువ వ్యవధి లేదు..

గత ఏడాది.. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి దగ్గరకు వెళ్లినప్పటి నుంచి ఇన్‌ఫెక్షన్‌ బారినపడటానికి మధ్య సరాసరిన ఆరు రోజుల వ్యవధి ఉండేది. డెల్టా వేరియంట్‌ విషయంలో ఇది నాలుగు రోజులకు పడిపోయింది. దీంతో ఇన్‌ఫెక్షన్‌ సోకడానికి ముందే వారిని గుర్తించడం మరింత కష్టమవుతోందని శాస్త్రవేత్తలు చెప్పారు. తాము గుర్తించేటప్పటికే.. బాధితుడిగా దగ్గరగా వచ్చిన వారిలో 100 శాతం మంది ఇన్‌ఫెక్షన్‌ బారినపడుతున్నారని ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌ వేల్స్‌ అధికారులు తెలిపారు. గత ఏడాది అది 30 శాతం మాత్రమే ఉండేదని చెప్పారు. బాధితుడికి దగ్గరగా వెళ్లిన వ్యక్తి నుంచి 24 గంటల్లోనే వైరస్‌ వ్యాప్తి మొదలవుతున్న ఉదంతాలు దక్షిణ ఆస్ట్రేలియాలో వెలుగు చూశాయన్నారు.

నియంత్రణ చర్యలే శరణ్యం..

ప్రస్తుతం ప్రతి ఒక్కరికి వేగంగా టీకా వేసేంత స్థాయిలో వ్యాక్సిన్లు లేకపోవడం వల్ల కరోనా కట్టడికి పలు నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా.. ముమ్మరంగా పరీక్షలు నిర్వహించడం ద్వారా కొత్త కేసులను గుర్తించి, వారిని వేగంగా విడిగా ఉంచాలన్నారు. అలాగే ఇన్‌ఫెక్షన్‌ సోకినవారికి దగ్గరగా వచ్చినవారిని సత్వరం గుర్తించి, వారిని ఏకాంతంలో ఉంచాలని సూచించారు. వ్యాధి లక్షణాలు లేనివారు, లక్షణాలు మొదలు కావడానికి ముందు దశలో ఉన్నవారి నుంచి కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలతోపాటు ఇవి చాలా కీలకమని వివరించారు.

వచ్చే ఏడాదీ లాక్​డౌన్లు!

60 శాతానికిపైగా జనాభా టీకా పొందిన ఇజ్రాయెల్‌ వంటి దేశాల్లో డెల్టా విజృంభిస్తున్నప్పటికీ ఆసుపత్రిపాలు, మరణం ముప్పు నుంచి చాలావరకూ రక్షణ లభిస్తున్నట్లు నిపుణులు తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల తయారీ సామర్థ్యం పెంపునకు చర్యలు చేపట్టడంతోపాటు డెల్టా, ఎప్సిలాన్‌ వంటి వేరియంట్లను ఎదుర్కొనే బూస్టర్‌ టీకాలకు ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. ఈ చర్యలు సత్వరం చేపట్టకుంటే మళ్లీ వచ్చే ఏడాది కూడా లాక్‌డౌన్లు విధించాల్సిన పరిస్థితి వస్తుందని, వ్యాక్సిన్ల కోసం నిరీక్షణ మళ్లీ పెరుగుతుందని స్పష్టంచేశారు.

ఇవీ చదవండి:

కొత్త కేసుల్లో 'డెల్టా' రకమే అధికం!

కొత్త వేరియంట్ల పుట్టుకకు కారణం ఇదే..

డెల్టా రకంతో పెరుగుతోన్న రీఇన్​ఫెక్షన్​ ముప్పు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.