ETV Bharat / international

America Afghanistan: 'ఆగస్టు 31 నాటికి మా వాళ్లను తరలిస్తాం'

author img

By

Published : Aug 24, 2021, 10:31 AM IST

అఫ్గానిస్థాన్​(Afghanistan news)​ నుంచి తమ పౌరుల తరలింపు ప్రక్రియను ఆగస్టు 31వరకు పూర్తి చేయడంపైనే తాము దృష్టి సారించామని అమెరికా అధికారులు(America Afghanistan) తెలిపారు. అయితే.. ఈ ప్రక్రియను ఎప్పుడు ముగించాలన్నదానిపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెనే తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మరోవైపు.. తరలింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు తాలిబన్లతో తాము రోజువారీగా చర్చిస్తున్నామని పేర్కొన్నారు.

us evacuation
అఫ్గాన్ నుంచి అమెరికా బలగాలు ఉపసంహరణ

తాలిబన్​ ఆక్రమిత అఫ్గానిస్థాన్(Afghanistan news)​ నుంచి తమ ప్రజలను తరలించే ప్రక్రియను ఆగస్టు 31నాటికి పూర్తి చేయడంపై దృష్టి సారించామని అమెరికా అధికారులు(America Afghanistan) తెలిపారు. అయితే.. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ​ తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ మేరకు శ్వేతసౌధం, విదేశాంగ శాఖ, పెంటాగన్(రక్షణ విభాగం)​ అధికారులు తెలిపారు.

"కాబుల్ విమానాశ్రయంలో(Kabul airport) ప్రస్తుతం 5,800 బలగాలు ఉన్నాయి. అమెరికా వాసులను, అఫ్గాన్​లో 20 ఏళ్లుగా అమెరికాకు సాయం చేసిన అఫ్గాన్​ పౌరులను వెనక్కి రప్పించేందుకు వారు సాయం చేస్తున్నారు. అమెరికా నుంచి సాధ్యమైనంత స్థాయిలో మేము పౌరుల తరలింపు ప్రక్రియ కొనసాగిస్తున్నామని అధ్యక్షుడు బైడెన్ భావిస్తున్నారు. ఇప్పటికే వేలాది మందిని అఫ్గాన్​ నుంచి తరలించాము. రానున్న రోజుల్లోనూ ఇంతే సమర్థవంతంగా మేము ఉపసంహరణ ప్రక్రియను కొనసాగిస్తాం. ఈ ప్రక్రియను కొనసాగించడంపై అధ్యక్షుడే తుది నిర్ణయం తీసుకుంటారు."

-జేక్ సులివాన్​, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు.

ఆగస్టు 31 నాటికి బలగాల ఉపసంహరణ పూర్తి చేయాలని తాలిబన్లు చేస్తున్న డిమాండ్​ తమ దృష్టికి వచ్చిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి జాన్​ కిబ్రీ తెలిపారు. వాటిని తాము అర్థం చేసుకోగలమని చెప్పారు. ప్రస్తుతం తాము ఈ నెలాఖరులోపు తరలింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు దృష్టి సారించామని పేర్కొన్నారు.

ఈ తరలింపు ప్రక్రియను ఎప్పుడు ముగించాలన్న దానిపై అధ్యక్షుడు బైడెన్​దే(US President Biden) తుది నిర్ణయమని విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్​ ప్రైస్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ప్రజలను సురక్షితంగా వెనక్కు తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు. గత 24 గంటలుగా తాము భారీ సంఖ్యలో ప్రజలను తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.

తాలిబన్లతో చర్చిస్తున్నాం..

అఫ్గాన్​లోని తాలిబన్లతో తాము రాజకీయ, భద్రతాపరమైన మార్గాల ద్వారా రోజువారీగా చర్చిస్తున్నామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు(ఎన్​ఎస్​ఏ) జేక్ సులివాన్​ తెలిపారు. కాబుల్ విమానాశ్రయం నుంచి ప్రజలను తరలించే క్రమంలో మిత్రదేశాలనూ సంప్రదిస్తున్నట్లు చెప్పారు. అయితే.. తాలిబన్లను అమెరికా ఎంత మాత్రం నమ్మబోదని మరోసారి స్పష్టం చేశారు.

"అఫ్గానిస్థాన్​, కాబుల్​ విమానాశ్రయంలో ప్రస్తుతం ఏం జరుగుతోంది వంటి అన్ని అంశాలను తాలిబన్లతో మేము రోజువారీగా చర్చిస్తున్నాం. అమెరికా ప్రజలను వెనక్కి తీసుకురావడానికి ఏ ఇబ్బందులు కల్గించకుండా ఉండేలా వారితో మేం సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ సంప్రదింపులు ఇకపై కూడా కొనసాగిస్తాం."

-జేక్ సులివాన్​, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు

తాలిబన్ సంస్థ ప్రతినిధులతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా మాట్లాడే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. జేక్ సులివాన్​ తోసిపుచ్చారు.

ఇదీ చూడండి: Afghan Crisis: 'అమెరికా.. అలా చేయడం సరికాదు'

ఇదీ చూడండి: బైడెన్​కు తాలిబన్ల హెచ్చరిక- 'రెడ్ లైన్' దాటితే అంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.