ETV Bharat / international

'భారత్​, చైనాల మధ్య మధ్యవర్తిత్వం ఆలోచన లేదు'

author img

By

Published : Jun 18, 2020, 5:13 AM IST

Updated : Jun 18, 2020, 7:01 AM IST

Trump is aware of India-China border row
భారత్​, చైనాల మధ్య మధ్యవర్తిత్వం ఆలోచన లేదు

భారత్​, చైనాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభన పరిష్కారం దిశగా మధ్యవర్తిత్వం వహించే ఆలోచన లేదని స్పష్టం చేసింది అమెరికా. లద్దాక్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. వీర మరణం పొందిన భారత జవాన్లకు సంతాపం ప్రకటించింది శ్వేతసౌధం.

భారత్​, చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో అగ్రరాజ్యం అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. తూర్పు లద్దాక్​లోని గాల్వన్​ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణపై అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నట్లు వెల్లడించింది శ్వేతసౌధం. అయితే.. ఇరు దేశాల మధ్య సయోధ్యకు మధ్యవర్తిత్వంపై ఎలాంటి ప్రణాళికలు లేవని నొక్కి చెప్పింది.

" భారత్​, చైనా సరిహద్దు పరిస్థితులపై అధ్యక్షుడికి తెలుసు. తూర్పు లద్దాక్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. ఘర్షణల్లో 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు భారత్​ ప్రకటించింది. సైనికుల మరణానికి మేము సంతాపం తెలుపుతున్నాం. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వంపై ఎలాంటి ఆలోచన లేదు. జూన్​ 2న అధ్యక్షుడు ట్రంప్​, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య జరిగిన ఫోన్​ సంభాషణలో భారత్​-చైనా సరిహద్దు అంశంపై మాట్లాడారు నేతలు."

- కేలీ మెక్​ఎనాన్​, శ్వేతసౌధం అధికార ప్రతినిధి

జూన్​ 15న (సోమవారం) రాత్రి తూర్పు లద్దాక్​లోని గాల్వన్​ లోయలో భారత్​-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది తీవ్రంగా గాయప్డడారు. చైనా వైపు కూడా భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు పలు నివేదికలు చెబుతున్నా.. డ్రాగన్​ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇదీ చూడండి: కరోనా రోగులకు ప్రాణదాతగా మారిన ఔషధం!

Last Updated :Jun 18, 2020, 7:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.