ETV Bharat / international

ట్రంప్​ పైనే భారతీయ-అమెరికన్​ ఓటర్ల విశ్వాసం!

author img

By

Published : Oct 31, 2020, 10:38 AM IST

అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ పైనే భారతీయ-అమెరికన్​ ఓటర్లు ఎక్కువ నమ్మకం పెట్టుకున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు, సీఏఏపై డెమొక్రటిక్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు, ప్రధాని మోదీతో ట్రంప్​కు ఉన్న స్నేహసంబంధం, చైనాతో ఉద్రిక్తతల సమయంలో భారత్​కు అమెరికా మద్దతుగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Indian-Americans seem more confident voting for Trump
ట్రంప్​ పైనే భారతీయ-అమెరికన్​ ఓటర్ల విశ్వాసం!

నవంబరు 3న జరిగే అధ్యక్ష ఎన్నికలను అమెరికా చరిత్రలోనే అత్యంత ముఖ్యమైనవిగా అభివర్ణించారు డొనాల్డ్ ట్రంప్. పలు రాష్ట్రాల్లో విజయాన్ని నిర్ణయించే 18 లక్షల మంది భారతీయ-అమెరికన్ ఓటర్లు ఈసారి ఎంతో కీలకంగా మారారు. అమెరికాలో మొత్తం 257 మిలియన్ల మంది 18ఏళ్లకు పైబడిన వారున్నారు. వీరిలో 240మిలియన్ల మందికి ఓటు హక్కు ఉంది. 80 మిలియన్ల మంది అమెరికన్లు ఇప్పటకే బ్యాలెట్​ ఓటు వేశారు. గత 100 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటింగ్ శాతం నమోదవుతుందని ఫ్లోరిడా యూనివర్సిటీ అంచనా వేస్తోంది.

ఈసారి ఎన్నికల్లో ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని, పోలింగ్​పై ఆసక్తి కనబరుస్తున్నారని రీడ్​ కళాశాలలో పొలిటికల్​ సైన్స్​ ప్రొఫెసర్​ పాల్​ గ్రోంకి తెలిపారు. ఓటర్ల సమాచార కేంద్రాన్ని ఆయన నిర్వహిస్తారు.

ఫలితాలను ప్రభావితం చేయగలరు..

పలు రాష్ట్రాల్లో విజయాలను నిర్ణయించి అధ్యక్ష ఎన్నికను ప్రభావితం చేసే భారతీయ-అమెరికన్ ఓటర్లను ఆకర్షించేందుకు రిపబ్లికన్, డెమొక్రటిక్​ పార్టీల నాయకులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వీళ్లే ఫలితాలను నిర్ణయిస్తున్నారని డెమొక్రటిక్ జాతీయ కమిటీ ఛైర్మన్​ థామస్​ పెరేడ్​ అభిప్రాయపడ్డారు.

భారతీయ-అమెరికన్లు అగ్రరాజ్య అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తున్నారని ఐక్యరాజ్య సమితి మాజీ రాయబారి, భారత సంతతికి చెందిన నిక్కీ హాలే తెలిపారు. అమెరికాలో వారికి రక్షణ కల్పించాల్సిన అవసరముందన్నారు. నిరుద్యోగం రేటు పెరిగినా వ్యాపారాలు సజావుగా సాగేందుకు ట్రంప్​ కృషి చేసిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు.

" భారత్​తో గతంలో బలమైన సంబంధాలు లేవు. అది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ట్రంప్, ప్రధాని మోదీ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు కీలకమైన రక్షణ, వాణిజ్య రంగాల్లో భారత్-అమెరికాలు భాగస్వామ్య దేశాలయ్యాయి. "

-నిక్కీ హాలే.

నిక్కీ హాలే అభిప్రాయంతో అనేక మంది భారతీయ-అమెరికన్ ఓటర్లు ఏకీభవిస్తున్నారు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​కే తమ మద్దతు ఉంటుందని చెబుతున్నారు.

భారతీయ-అమెరికన్లు శాంతిభద్రతలను ఇష్టపడతారని హ్యూస్టన్​లో ప్రముఖ భారత సంతతి నేత అచ్చలేశ్​ అమర్ తెలిపారు.

" కశ్మీర్​, సీఏఏ అంశాలపై డెమొక్రటిక్​ పార్టీ ముఖ్య నేతలు చేసిన వ్యాఖ్యల పట్ల భారతీయ-అమెరికన్లు అసంతృప్తితో ఉన్నారు. చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో భారత్​కు మద్దతుగా అమెరికా నిలవడాన్ని వారు ప్రశంసిస్తున్నారు. ఈ విషయమే వారిని ట్రంప్ వైపు నిలబడేలా చేసింది. "

-అచ్చలేశ్​ అమర్.

ట్రంప్ పాలనలో భారతీయ-అమెరికన్లకు పూర్తి సహకారం అందిందని నలంద ఇంటర్నేషనల్​ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అమెరికా ఎన్నికల నిపుణుడు విభూతి ఝా అన్నారు. అందుకే వారు ఆయన వైపే మొగ్గు చూపుతారని తెలిపారు.

డెమొక్రాట్ల నాయకత్వం, కాంగ్రెస్​లోని వారి ఇడ్లీ-సమోసా నేతలు భారత్​కు వ్యతిరేక తీర్మానాలకే మద్దతిచ్చారు. మెజారిటీ భారతీయ-అమెరికన్లు ట్రంప్​కే ఓటు వేస్తారని భావిస్తున్నాు. భారత వ్యతిరేక శక్తులకు అనుకూల ఎజెండా ఉన్న బైడెన్​-హ్యారిస్​లపై వారు ఆగ్రహంతో ఉన్నారు.

-విభూతి ఝా.

ట్రంపే గెలవాలి...

ట్రంప్ గెలవాలని ప్రార్థిస్తూ విజయదశమికి ముందే ఆయనకు ఓటు వేశారు లక్ష్మీ మహదేవన్. బైడెన్​ గెలిస్తే శాంతిభద్రతలు క్షీణించి, సామాజిక అశాంతి నెలకొని, బంధుప్రీతి పెరుగుతుందని ఆమె భయాందోళన వ్యక్తం చేశారు.

"నవరాత్రి ఉత్సవాల్లో దుర్గామాతకు పూజ చేయడానికి కమలా హ్యారిస్ బంధువులను అనుమతించలేదు. హిందువులను అవమానించినట్లు మాట్లాడారు. ఆ తర్వాత క్షమాపణలు కూడా చెప్పలేదు."

లక్ష్మీ మహదేవన్.

2016 ఎన్నికల్లో భారతీయ-అమెరికన్లకు ఇచ్చిన హామీలను ట్రంప్​ నిలబెట్టుకున్నారని రిపబ్లికన్ హిందూ కొయాలిషన్ వ్యవస్థాపకుడు, పారిశ్రామిక వేత్త శలాభ్ కుమార్ అన్నారు. తాను అధికారంలోకి వస్తే శ్వేతసౌధంలో భారత్​కు ఎప్పుడూ ఓ మిత్రుడు ఉంటాడని 2016 ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చెప్పినట్లు గుర్తు చేశారు. కరోనా సంక్షోభంలోనూ అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడి, చిన్న చిన్న వ్యాపారాలను ట్రంప్ ప్రోత్సహించారని శలాభ్ చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.