కరోనా వ్యాప్తికి శీతాకాలం అనువైనదన్నారు జో బైడెన్ సలహాదారు డాక్టర్ వివేక్ మూర్తి. చలికాలంలో ప్రజలు ఇళ్లల్లోనే ఎక్కువగా ఉంటారని, దీంతో బయటి ప్రదేశాలకంటే ఇండోర్లోనే వైరస్ వ్యాప్తి సులభంగా జరుగుతుందని తెలిపారు.
అమెరికాలో వైరస్ నియంత్రణకు బైడెన్ ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై ఫాక్స్ న్యూస్తో కీలక విషయాలు వెల్లడించారు మూర్తి. ఈ మహమ్మారితో ప్రజలు అలసట చెందారని తెలిపారు.
" చాలా నెలలుగా మహమ్మారితో పోరాడుతున్నాం. ముఖ్యమైన అంశం వైరస్ అలసట. అంటే ప్రజలు తమ బబుల్లోకి ఇతరులను అనుమతిస్తున్నారు. డిన్నర్ పార్టీలు, రాత్రి ఆటల వంటి వాటితో ఇతరులతో కలుస్తున్నారు. ఇలాంటి సమావేశాలతోనే అధిక కేసులను గుర్తిస్తున్నాయి ఆరోగ్య శాఖ విభాగాలు. ఇలాంటి వాటి వల్లే అమెరికాలో ఇటీవల కేసులు పెరిగాయి. వైరస్ వ్యాప్తిని తగ్గించటమే తక్షణం చేయాల్సిన పని. అది మన ప్రవర్తన, మనం చేయబోయే పనులపై ఆధారపడి ఉంటుంది. మాస్క్లు ధరించటం, భౌతిక దూరం, చేతులు కడుక్కోవటం వంటివి చాలా చిన్నవిగా అనిపిస్తాయి. కానీ వాస్తవానికి వైరస్ వ్యాప్తిని తగ్గించటంలో చాలా శక్తివంతమైనవి. "
- డాక్టర్ వివేక్ మూర్తి, బైడెన్కు ఇండో- అమెరికన్ సలహాదారు.
అమెరికాలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పరీక్షల సామర్థ్యం పెంచటం, కేసులను గుర్తించటం వంటి వాటిపై బైడెన్ తమతో చర్చించారని పేర్కొన్నారు మూర్తి. వ్యక్తిగత భద్రత కిట్ల ఉత్పత్తిని పెంచాలని భావిస్తున్నారని, దాంతో ఆరోగ్య సిబ్బందికి మాస్క్లు, గ్లౌజ్లు లభిస్తాయన్నారు. పాఠశాలలు, వ్యాపారాలతో పాటు రాష్ట్ర సంస్థలు, భారీ క్రీడా పోటీలను సురక్షితంగా ఎలా నిర్వహించుకోవాలనే దానిపై మార్గనిర్దేశం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.
లాక్డౌన్ చివరి అవకాశం..
ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ దేశవ్యాప్త లాక్డౌన్ చివరి అవకాశం అని వెల్లడించారు మూర్తి. వైరస్ ప్రారంభంలో ఉన్న దాని కంటే ప్రస్తుతం ప్రజల్లో ఎంతో అవగాహన వచ్చిందన్నారు.
" మన ప్రయత్నాలు చేయకుండా దేశం మొత్తాన్ని లాక్చేస్తే.. మహమ్మారి ప్రభావాన్ని తీవ్రతరం చేసినట్లే అవుతుంది. ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ మరింత దెబ్బతింటాయి. పాఠశాలలను మూసివేసి మన చిన్నారుల విద్యను దెబ్బతీసినట్లే."
- డాక్టర్ వివేక్ మూర్తి, బైడెన్ సలహాదారు
వ్యాక్సిన్ పంపిణీ అనేది చాలా సవాళ్లతో కూడుకున్న పనిగా పేర్కొన్నారు మూర్తి. చాలా ఏళ్లుగా ప్రజలకు వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్నామని, కానీ, త్వరలో చేపట్టబోయే వ్యాక్సినేషన్ దేశ చరిత్రలోనే చాలా కీలకమైనదిగా అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్లపై రాజకీయాలు చేస్తున్నారని చాలా మంది ప్రజలు ఆరోపిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు చెప్పే మాటలు ప్రజలు నమ్మేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చూడండి: టీకా సంస్థలతో భేటీ కానున్న బైడెన్ సలహాదారులు