ETV Bharat / entertainment

''ఒకే ఒక జీవితం' సినిమాలో నేను ఎక్కడా కనిపించను.. కేవలం..'

author img

By

Published : Sep 4, 2022, 6:50 AM IST

sharwanand
sharwanand

హీరో శర్వానంద్​ నటించిన తాజా చిత్రం 'ఒకే ఒక జీవితం'. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కథానాయకుడు శర్వానంద్​.. తన చిత్రబృందంతో కలిసి సినిమా విశేషాలను పంచుకున్నారు. అవి వారి మాటల్లోనే తెలుసుకుందాం.

Sharwanand Oke Oka Jeevitham Movie: "నా మనసును హత్తుకున్న సినిమా 'ఒకే ఒక జీవితం'. చాలా గొప్పగా ఉంటుంది. తప్పకుండా అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది" అన్నారు కథానాయకుడు శర్వానంద్‌. ఆయన.. రీతూ వర్మ జంటగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ కార్తీక్‌ తెరకెక్కించారు. అమల అక్కినేని, వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి, నాజర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రం సెప్టెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం చిత్రబృందంతో కలిసి సినిమా విశేషాలు పంచుకున్నారు శర్వానంద్‌.

"ఇది పూర్తిగా తల్లీకొడుకుల అనుబంధాల నేపథ్యంలో సాగే ఎమోషనల్‌ చిత్రం కాదు. వినోదాత్మకంగా ఉంటుంది. సినిమా చూశాక.. ఇందులోని పాత్రలతో ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒకచోట కచ్చితంగా రిలేట్‌ అవుతారు. ఈ నిమిషాన్ని.. ఈ క్షణాన్ని.. గుర్తించి ఆస్వాదిస్తూ బతకగలిగితే జీవితం చాలా అందంగా ఉంటుందన్న గొప్ప విషయాన్ని దర్శకుడు కార్తీక్‌ ఈ చిత్రంతో తెలియజేశాడు. అందుకే ఈ కథకు ‘ఒకే ఒక జీవితం’ అన్న టైటిల్‌ పెట్టాం చాలా అరుదుగా దొరికే కథ ఇది. వాస్తవానికి ఇలాంటి మాటలు సినిమా సక్సెస్‌ తర్వాత చెబుతుంటారు. కానీ, ఈ మాట ఇప్పుడే చెప్పడానికి ఓ కారణం ఉంది. మనస్ఫూర్తిగా చెబుతున్నా.. ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు. అందుకే ఈ సినిమా చేసినందుకు చాలా గర్వంగా.. సంతోషంగా ఉంది. ఇప్పటికే సినిమా చూశా. చాలా సంతృప్తిగా అనిపించింది. తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్మకం కలిగింది. ఇప్పటి వరకు చాలా టైమ్‌ ట్రావెల్‌ సినిమాలు చూసుంటారు. కానీ, ఇది వాటికి పూర్తి భిన్నంగా.. చాలా కొత్తగా ఉంటుంది. గతంలోకి వెళ్లి మనల్ని మనం సరి చేసుకునే అవకాశం వస్తే ఎలా ఉంటుందన్న పాయింట్‌ని దీంట్లో చాలా చక్కగా ట్రీట్‌ చేశారు కార్తీక్‌" అంటూ శర్వానంద్​ చెప్పుకొచ్చారు.

"సినిమాలో నేనెక్కడా కనిపించను. దర్శకుడు కార్తీక్‌కు వాళ్ల అమ్మపై ఉన్న ప్రేమే కనిపిస్తుంది. తను అంత ప్రేమగా రాసుకున్న స్క్రిప్ట్‌ కాబట్టే ఈ చిత్రం నటుడిగా నాపై మరింత బాధ్యత పెంచింది. ఈ చిత్రం చేస్తున్నప్పుడల్లా మా ఇంట్లో వాళ్లకు టెన్షన్‌. ఈ చిత్ర షెడ్యూల్‌లో పాల్గొంటే తప్పకుండా నేను డిప్రెషన్‌తో ఇంటికొస్తానని నమ్మేవారు (నవ్వుతూ). ఈ సినిమాని కార్తీక్‌ నాకు అంతలా తలకెక్కించాడు".

-- హీరో శర్వానంద్​

.

"దర్శకుడిగా నాకిది తొలి సినిమా. ఈ కథని తొలుత తమిళంలోనే రాసుకున్నా. ఇందులోని ఎమోషన్లు నచ్చి.. ఈ కథ అందరికీ కనెక్ట్‌ అవుతుందన్న నమ్మకంతో నిర్మాతలు దీన్ని తెలుగు, తమిళ భాషల్లో చేద్దామని చెప్పారు. అలా ఇది ద్విభాషా చిత్రంగా పట్టాలెక్కింది. ఈ సినిమాకి దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ సంభాషణలు అందించారు. మా అమ్మ కోసం చేసిన చిత్రమిది. దీనితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అదేంటన్నది సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ సినిమాని శర్వానంద్‌ తప్ప మరెవరూ చేయలేరు. తన పాత్ర నవ్విస్తుంది.. కంటతడి పెట్టిస్తుంది.. మంచి సందేశమందిస్తుంది.. అందరినీ సర్‌ప్రైజ్‌ చేస్తుంది. ఈ చిత్రంలో అమ్మ పాత్రను అమలని దృష్టిలో పెట్టుకునే రాసుకున్నా. సినిమాకి ఆమె పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. రీతూ వర్మ పాత్రతో అందరూ ప్రేమలో పడతారు. తన పాత్రని తీర్చిదిద్దిన విధానం చాలా కొత్తగా ఉంటుంది. సిరివెన్నెల రాసిన అమ్మ పాట మా సినిమాకి ప్రధాన బలం".

- శ్రీకార్తీక్‌, చిత్ర దర్శకుడు

"పది సంవత్సరాల తర్వాత నేను చేసిన తెలుగు చిత్రమిది. ఇంత మంచి కథ తీసుకొచ్చి.. నాకు అవకాశం అందించినందుకు దర్శకుడు శ్రీకార్తీక్‌కు థ్యాంక్స్‌. ఇందులో నేను శర్వానంద్‌ తల్లిగా నటించాను. ఈ చిత్రంతో నాకు మూడో అబ్బాయి దొరికాడు. ఈ సినిమా ముగ్గురి లైఫ్‌ జర్నీ గురించి చెప్తుంది. వాళ్లు ఎదుర్కొన్న కష్టాలను చూపిస్తుంది. వారికి ఓ అవకాశం వస్తుంది. కాలంతో ఆడుకుంటూ దాన్ని కరెక్ట్‌ చేయాలనుకుంటారు. కానీ, విధి మాత్రం మారలేదు. మరి అలా ఎందుకు జరిగిందన్నది సినిమా చూసి తెలుసుకోవాలి" అంటూ నటి అమల అక్కినేని మాట్లాడారు.

"దర్శకుడు కార్తీక్‌ చాలా ప్రేమతో ఈ సినిమా తీశారు. శర్వానంద్‌ ఎంతో సిన్సియర్‌గా తన పాత్రని చేశారు. ప్రతి ఎమోషన్‌నీ చాలా బాగా పండించారు. అమల పాత్రతో ప్రేక్షకులు ప్రేమలో పడిపోతారు. సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకముంది. థియేటర్లలో ఈ చిత్రం చూసి ఆదరించి, ఆశీర్వదించండి".

- నటి.. రీతూ వర్మ

"దర్శకుడు కార్తీక్‌ కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చేసింది. వింటున్నంత సేపూ చాలా ఎంజాయ్‌ చేశా. కామెడీ, థ్రిల్లర్‌, సైన్స్‌ ఫిక్షన్‌, సెంటిమెంట్‌.. ఇలా అన్ని జానర్లు కలగలసి ఉన్న చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ఈ స్క్రిప్ట్‌ ఒప్పుకొని చేసినందుకు శర్వానంద్‌, రీతూ వర్మకు థ్యాంక్స్‌. సినిమా బాగా వచ్చింది. కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్మకముంది" అంటూ చిత్ర నిర్మాత.. ఎస్‌.ఆర్‌.ప్రభు చెప్పుకొచ్చారు.

ఇవీ చదవండి: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రష్మి.. కానీ ఓ ట్విస్ట్​.. ఏంటంటే

కేతిక శర్మ చేసిన పనికి అలా ట్వీట్​ చేసిన దేవీ శ్రీ, ఏంటంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.