ETV Bharat / crime

బతికుండగానే చంపేశారు.. నకిలీ పత్రాలతో కోటిన్నర కొట్టేశారు..

author img

By

Published : Oct 11, 2022, 10:25 AM IST

ఓ స్థిరాస్తిపై కన్నేసిన అక్రమార్కులు... యజమాని దంపతులను బతికుండగానే చంపేశారు. వారి సొంత కుమారులను కాదని... ఓ నకిలీ వారసుడిని సృష్టించారు. ఆ ధ్రువపత్రాలను మున్సిపల్‌ కమిషనర్‌ సహా రెవెన్యూ అధికారులూ ధ్రువీకరించారు. ఆస్తి ఉన్న ఊళ్లో కాకుండా... నకిలీ పత్రాలతో మరోచోట రిజిస్ట్రేషన్‌ చేయించేశారు. నకిలీ పత్రాలని స్పష్టంగా తెలుస్తున్నా... సబ్‌ రిజిస్ట్రార్ వెనుకాముందూ చూడకుండా కోటిన్నర విలువచేసే ఇంటి అమ్మకానికి రాజముద్ర వేసి రిజిస్టర్ చేశారు. అనంతపురానికి చెందిన ఓ గిరిజన కుటుంబానికి జరిగిన అన్యాయం విస్తుగొల్పుతోంది.

బతికుండగానే చంపేశారు.. నకిలీ పత్రాలతో కోటిన్నర కొట్టేశారు..
బతికుండగానే చంపేశారు.. నకిలీ పత్రాలతో కోటిన్నర కొట్టేశారు..

బతికుండగానే చంపేశారు.. నకిలీ పత్రాలతో కోటిన్నర కొట్టేశారు..

ఏపీ అనంతపురంలో స్థిరాస్తులను కాజేసే అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు. బతికున్నవారిని కూడా చనిపోయినట్లు ధ్రువపత్రాలు సృష్టించి.. వారి వారసులుగా మరొకరిని చూపిస్తూ.. కోట్ల రూపాయల ఆస్తులను ఇతరులకు అమ్మేస్తున్నారు. ఈ లావాదేవీలు చేస్తున్నవారంతా ఒకే ముఠా సభ్యులు కావడంతో.. కొనేవారు, అమ్మేవారు అంతా కలసికట్టుగా దందా సాగిస్తున్నారు. ఈ ముఠాకు వివిధ శాఖలకు చెందిన కొందరు అవినీతి అధికారులు అండగా నిలుస్తుండటంతో.. అసలు యజమానులు నిశ్చేష్టులవుతున్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవరచెరువుకు చెందిన శ్రీరామ్ నాయక్, కాంతమ్మ దంపతులు.. ఉపాధి కోసం చాలా ఏళ్ల కిందటే హైదరాబాద్‌ వెళ్లారు. వంట మనుషులుగా పనిచేస్తూ సంపాదించిన డబ్బుతో.. అనంతపురం ఆదర్శనగర్‌లో 2012లో 5 సెంట్ల స్థలం కొనుగోలు చేశారు. హైదరాబాద్‌లోనే ఉంటూ రుణం తీసుకుని ఆ స్థలంలో 2014లో ఇల్లు నిర్మించారు. మూడు పోర్షన్లుగా కట్టిన ఇంటిని అద్దెకు ఇచ్చారు.

వడ్డీ భారం పెరిగిపోవడంతో.. ఇంటిని అమ్మేసి అప్పు తీర్చాలని భావించారు. దాదాపు 10 మంది ఏజెంట్లకు ఇంటి పత్రాల జిరాక్సులు ఇచ్చారు. వారి ద్వారా శ్రీరామ్ నాయక్‌, కాంతమ్మ దంపతులకు ఓ విస్తుపోయే వాస్తవం తెలిసింది. శ్రీరామ్, కాంతమ్మ చనిపోయినట్లు కొందరు అక్రమార్కులు ధ్రువపత్రాలు సృష్టించి, నకిలీ వారసుడిని తయారుచేసి.. ఆ ఇంటిని విక్రయించారని తెలుసుకుని నిర్ఘాంతపోయారు.

మరణించినట్లు ధ్రువపత్రాలు..
ఓబులదేవరచెరువు మండలానికి చెందిన శ్రీరామ్ నాయక్ కుటుంబం కదిరిలో శాశ్వత నివాసం ఏర్పాటుచేసుకుందని నకిలీ పత్రాల్లో పేర్కొన్నారు. 2017 ఏప్రిల్‌లో శ్రీరామ్, ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంతమ్మ మృతి చెందారంటూ పత్రాలు సృష్టించారు. ఈ నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు.. కదిరి మున్సిపల్ కమిషనర్‌ పేరిట మంజూరయ్యాయి. శ్రీరామ్ నాయక్ దంపతులకు కార్తిక్‌, పవన్‌ కుమార్‌ అనే ఇద్దరు కుమారులు ఉండగా.. ధర్మవరంలో అనిల్‌ అనే 20 ఏళ్ల యువకుడిని వారసుడిగా చూపిస్తూ మరో పత్రం సిద్ధం చేశారు.

అనిల్‌ వారి కుమారుడేనని ధ్రువీకరిస్తూ.. తహసీల్దార్‌తో సంబంధం లేకుండా ధర్మవరం వీఆర్​వోనే వంశవృక్షం పత్రాన్ని జారీ చేశారు. ఈ నకిలీ పత్రాలను పరిగణనలోకి తీసుకుని.. అనంతపురంలోని ఆస్తిని ధర్మవరం సబ్‌ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేశారు. కోటిన్నర విలువచేసే ఇంటిని కప్పల ముత్యాలమ్మ అనే మహిళకు నకిలీ కుమారుడు అనిల్‌ విక్రయించినట్లు.. గత నెల 23న ధర్మవరం సబ్ రిజిస్ట్రార్‌ డాక్యుమెంట్‌ ఇచ్చేశారు. కదిరి మున్సిపాలిటీ, ధర్మవరం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అవినీతితో.. తాము రోడ్డున పడాల్సి వచ్చిందని అసలు యజమానులు వాపోతున్నారు.

ఇదే తరహాలో నకిలీ పత్రాలతో అనంతపురంలో గత ఏడాదిన్నర కాలంలో అక్రమార్కులు మూడుచోట్ల ఖరీదైన ఆస్తులను కాజేశారు. అక్రమార్కులకు అధికారులు అండగా నిలుస్తుండటంతో.. ఎవరిని ఆశ్రయించాలో తెలియడం లేదని బాధితులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.