ETV Bharat / crime

బంగారం అక్రమ రవాణాకు అడ్డాగా శంషాబాద్​ ఎయిర్​పోర్టు.. అడ్డుకట్ట వేసేదెలా..?

author img

By

Published : Oct 9, 2022, 9:01 AM IST

Illegal gold smuggling in Shamshabad Airport: హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం బంగారం అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. స్మగ్లింగ్ ముఠాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ నిఘా సంస్థల కళ్లు కప్పుతున్నాయి. 4 రోజుల్లో రూ.7 కోట్ల విలువైన 13 కిలోలకు పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారంటే.. పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

Illegal gold smuggling
Illegal gold smuggling

శంషాబాద్​ ఎయిర్​పోర్టు.. బంగారం అక్రమ రవాణాకు అడ్డగా మారిందా!!

Illegal gold smuggling in Shamshabad Airport: హైదరాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా తగ్గడం లేదు. ఎవరు ప్రయాణికుడో.. ఎవరు స్మగ్లరో తేల్చుకోలేక నిఘా సంస్థలు అయోమయానికి గురవుతున్నాయి. ఇప్పటి వరకు విదేశాల నుంచి ముఖ్యంగా గల్ఫ్ దేశాలతో పాటు కొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను మాత్రమే నిశితంగా తనిఖీలు నిర్వహించేవారు. కానీ స్మగ్లర్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తుండటంతో అప్పుడప్పుడు డొమెస్టిక్ ప్రయాణికులను సైతం తనిఖీలు చేయాల్సి వస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. విదేశాల నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేని వస్తువులను సైతం బంగారం స్మగ్లింగ్ కోసం తెస్తున్నారు.

4 రోజుల్లో రూ.7 కోట్ల బంగారం స్వాధీనం: ఈ నెల 5 నుంచి 8 వరకు కేవలం నాలుగు రోజుల్లోనే రూ.7 కోట్ల విలువైన 13,367 గ్రాముల బంగారం శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5న రెండు వేర్వేరు కేసుల్లో 1,300 గ్రాముల బంగారం పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి పేస్ట్ రూపంలో 855 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. 6న రెండు వేర్వేరు కేసుల్లో దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు నుంచి రూ.4 కోట్లకు పైగా విలువైన ఏడున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

లో దుస్తుల్లో దాచి తెస్తున్నారు: దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు దొంగచాటుగా స్వర్ణాన్ని తెచ్చాడు. అదేవిధంగా మరో ఇద్దరు దుబాయ్ నుంచి వస్తూ బిస్కెట్ల రూపంలో బంగారం తెచ్చుకున్నారు. ఈ రెండు కేసులు కూడా పక్కా సమాచారంతో తనిఖీలు చేశారు. ఈ నెల 7న దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళా ప్రయాణికులు లో దుస్తులు, నైట్‌డ్రెస్‌లో దాచి బంగారం తెస్తున్నట్లు ముందే సమాచారంతో అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. వారి నుంచి రూ.1.72 కోట్లు విలువ చేసే 3,283 గ్రాముల బంగారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న రెండు వేర్వేరు కేసుల్లో ఒక ప్రయాణికురాలు సహా ఇద్దరు ప్రయాణికుల నుంచి 1,089 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

గల్ఫ్​ దేశాల నుంచే ఎక్కువగా: గల్ఫ్ దేశాలతో పాటు సింగపూర్, మలేసియా నుంచి కూడా బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. హైదరాబాద్ స్మగ్లర్లతోనే ఇబ్బంది పడుతుంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర నుంచి కూడా స్మగ్లర్లు ఇక్కడే మకాం వేసి విదేశాల్లో ఉంటున్న ముఠాలతో సంబంధాలు ఏర్పర్చుకుని బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. నిఘా సంస్థలు కళ్లుగప్పి తెస్తున్న బంగారంలో 10 నుంచి 15 శాతం మాత్రమే అధికారులు పట్టుకుంటున్నారు. మిగిలిన 85 నుంచి 90 శాతం బంగారం నిర్దేశించిన దుకాణాలకు చేరిపోతుంది. నిబంధనలు కఠినతరం చేసి నిఘా సంస్థలను బలోపేతం చేయాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.