ETV Bharat / crime

Adulterated Meat: ముక్క లేనిదే ముద్ద దిగదా..? అయితే జాగ్రత్త

author img

By

Published : Nov 10, 2021, 6:49 AM IST

ముక్క అందుబాటులో లేనిదే ఎక్కువమంది హైదరాబాదీలకు ముద్ద దిగదు. అలాగని ఎడాపెడా దుకాణాల నుంచి మాంసాన్ని కొనుగోలు చేయొద్దని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు. పలువురు వ్యాపారులు అత్యాశకు పోయి నాసిరకం, కల్తీ మాంసాన్ని విక్రయిస్తున్నారని వారు వెల్లడించారు.

Adulterated Meat
కల్తీ మాంసం విక్రయాలు

నాన్​వెజ్​ తినే వాళ్లు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు అధికారులు. ముఖ్యంగా హైదరాబాద్​లో ఉండేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. నగరంలో అనారోగ్యానికి గురైన గొర్రెలు, మేకలు, చనిపోయిన జీవాలను నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్నారని అధికారులు తెలిపారు. మరోవైపు, గొడ్డు మాంసాన్నీ వ్యాపారులు కల్తీ చేస్తున్నారని.. అశుభ్ర వాతావరణంలో జంతువధ చేయడమేగాక, వేర్వేరు ప్రాంతాల నుంచి మృత, అనారోగ్యకర జంతువులను తీసుకొచ్చి, మార్కెట్లో అడ్డగోలుగా విక్రయిస్తుండం ఆందోళనకు తావిస్తోందని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ పశువైద్య విభాగం అధికారులు దాడులు చేస్తున్నా… పరిస్థితిలో మాత్రం ఏ మార్పు రావడం లేదని తెలిపారు.

ఖైరతాబాద్‌ జోన్‌లో అధికంగా..

హైదరాబాద్‌లో జరిగే మాంసం వ్యాపారంలో జియాగూడ కబేళా నుంచి వెళ్లే జీవాలు 80 శాతం ఉంటాయి. ఈ కబేళా కేంద్రంగా భారీ వ్యాపారం జరుగుతుంది. కశ్మీర్‌ నుంచి మొదలుపెడితే.. అనేక రాష్ట్రాల నుంచి జియాగూడ కబేళాకు జీవాలు వస్తాయి. అందులో అనారోగ్యమున్న జీవాలు, చనిపోయిన మేకలు, గొర్రెలు ఉంటాయని, వాటినీ వ్యాపారులు మార్కెట్‌కు తరలిస్తున్నారని ఫిర్యాదులున్నాయి. మాంసం దుకాణాలపై జరుపుతున్న తనిఖీల ఆధారంగా చూస్తే.. ఖైరతాబాద్‌ జోన్‌లో ఎక్కువగా కల్తీ మాంసం లభిస్తోందని, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి జోన్లలోనూ సంబంధిత దుకాణాలను గుర్తిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

కల్తీ మాంసం వివరాలు

ముద్ర ఉంటేనే కొనుగోలు చేయాలి..

జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు ఆమోద ముద్ర వేసిన జంతు కళేబరాల నుంచే మాంసాన్ని కొనుగోలు చేయాలని అధికారులు కోరుతున్నారు. అధికారిక కబేళాల్లో వధించిన మేక, గొర్రె పొట్టేలు, గొడ్డు మాంసాన్ని మాత్రమే ఉపయోగించాలంటున్నారు. జంతు కళేబరంపై బల్దియా ముద్ర ఉందా? లేదా? అని సరిచూసుకోవాల్సిన బాధ్యత పౌరులదేనని గుర్తుచేస్తున్నారు. ముద్ర గురించి దుకాణదారుడు ప్రశ్నించాలని, అప్పుడే వ్యాపారులు నాణ్యమైన మాంసాన్ని విక్రయిస్తారని సూచిస్తున్నారు.

యథేచ్ఛగా చేస్తున్నారు..

నగరవ్యాప్తంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి జరిపిన తనిఖీల్లో ఇప్పటి వరకు కల్తీ చేసిన 2,851 కేజీల గొడ్డు మాంసం, 539 కేజీల పొట్టేలు మాంసం గుర్తించామని బల్దియా వెల్లడించింది. అవకతవకలు చేసిన 139 దుకాణాలపై మున్సిపల్‌ కోర్డులో కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ముద్రలేని మాంసాన్ని విక్రయించే వారికి జరిమానాలూ విధిస్తున్నామన్నారు.

హోటళ్లపై ప్రత్యేక నిఘా..

బల్దియా ముద్రలేని మాంసంతో వంటలు తయారు చేస్తోన్న హోటళ్లపైనా దాడులు చేస్తామని, ఆహార కల్తీ వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందని బల్దియా హెచ్చరిస్తోంది. బిర్యానీ భారీగా అమ్ముడుపోయే హైదరాబాద్‌లో.. కల్తీ మాంసానికి తావు ఇవ్వొద్దని వ్యాపారులకు గుర్తుచేస్తోంది.

ఇదీ చూడండి: ఆఫర్లు చూసి టెంప్ట్.. పార్శిల్ ఓపెన్ చేస్తే కంపు

కూరగాయల్లో కల్తీ జరిగిందా?.. తెలుసుకోండి ఇలా!

కల్తీ మద్యం ఘటనలో 33కు పెరిగిన మృతులు!

PETROL: 'పెట్రోల్ నింపితే వాహనాలు మొరాయిస్తున్నాయ్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.