Hyderabad Pub Raid Case : ఈనెల 3న పుడింగ్‌ పబ్‌లో ఏం జరిగింది?

author img

By

Published : Apr 7, 2022, 8:45 AM IST

Hyderabad Pub Raid Case

Hyderabad Pub Raid Case : హైదరాబాద్ రాడిసన్‌ బ్లూ ప్లాజాలోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే పబ్ మేనేజర్ అనిల్, నిర్వాహకుడు అభిషేక్‌ను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి కొంత సమాచారం సేకరించారు. ఈ కేసులో పలు వివరాలు సేకరించి నాంపల్లి కోర్టులో రిమాండ్ రిపోర్టు దాఖలు చేశారు. ఈ రిపోర్టులో ఏం ఉంది? 3వ తేదీన పుడింగ్‌ పబ్‌లో ఏం జరిగింది?

Hyderabad Pub Raid Case : బంజారాహిల్స్‌ రాడిసన్‌ బ్లూ ప్లాజాలోని పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసులో పోలీసులు నాంపల్లి కోర్టులో రిమాండ్ రిపోర్టు దాఖలు చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే పబ్‌ మేనేజర్‌ అనిల్‌, నిర్వాహకుడు అభిషేక్‌ మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్టు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. పుడింగ్‌ పబ్‌లో రోజూ తెల్లవారుజామున 4గంటల వరకు మద్యం, మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్టు పోలీసులు సమాచారం తెలుసుకున్నారు. పక్కా ప్రణాళికతో 3వ తేదీ తెల్లవారుజామున పబ్‌పై దాడి చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కౌంటర్‌ వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న ట్రేలలో స్ట్రాలు, టిష్యూ పేపర్లు, టూత్‌ పిక్స్‌ను గమనించారు. అదే ట్రేలో అనుమానాస్పద ప్యాకెట్లు ఉన్నాయి. వాటిలో తెల్లటి పౌడర్‌ను గమనించిన పోలీసులు స్వాధీనం చేసుకుని పరీక్షించగా కొకైన్‌గా తేలింది. 4.6 గ్రాముల కొకైన్‌ ఉన్నట్టు గుర్తించారు. ల్యాప్‌ టాప్‌, ప్రింటర్‌, వేయింగ్‌ మిషన్‌తో పాటు ప్యాకింగ్‌ మెటీరియల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Pudding Pub Case : ఇవన్నీ పబ్‌ మేనేజర్‌ అనిల్‌ పర్యవేక్షణలో ఉన్నట్టు తెలుసుకొని అతన్ని ప్రశ్నించారు. అనిల్‌ ఇచ్చిన సమాచారం మేరకు పబ్‌ నిర్వాహకుడు అభిషేక్‌ను పిలిపించారు. ఇద్దరినీ ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసి వాళ్ల వద్ద ఉన్న చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. పబ్‌లో కిరణ్‌రాజు, అర్జున్‌ వీరమాచినేని కూడా భాగస్వాములుగా ఉన్నట్టు గుర్తించి పోలీసులు వాళ్లపైనా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ పరారీలో ఉన్నట్టు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. పామ్‌ అనే యాప్‌లో రిజిస్టర్‌ చేసుకున్న వాళ్లకే పబ్‌లోకి అనుమతి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. రూ.50వేల రుసుము కడితేనే యాప్‌లో లాగిన్‌ అయ్యే అవకాశం కల్పిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. 3వ తేదీ రాత్రి జరిగిన పార్టీలో వేర్వేరు బృందాలుగా ఏర్పడి దాదాపు 150మంది వరకు పబ్‌కు వచ్చారు. వీళ్లలో ఏ బృందం కొకైన్‌ తీసుకుందనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అనిల్‌ అభిషేక్‌లను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే మాదక ద్రవ్యాలకు సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.