ETV Bharat / crime

Mtech Student Suicide case : 'కరోనా సమయంలో నా ఆత్మవిశ్వాసం దెబ్బతింది.. అందుకే..'

author img

By

Published : Sep 14, 2022, 11:52 AM IST

Mtech Student Suicide case : ఇటీవల ఐఐటీ హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఎంటెక్ విద్యార్థి రాహుల్ ల్యాప్‌టాప్‌లో పోలీసులు సూసైడ్ నోట్ గుర్తించారు. ఒత్తిడితో పాటు మరో మూడు కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాహుల్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన విషయాలను తాజాగా పోలీసులు వెల్లడించారు. అసలేం జరిగిందంటే..?

Mtech Student Suicide case
Mtech Student Suicide case

Mtech Student Suicide case : కొవిడ్‌ సమయంలో ఆన్‌లైన్‌ తరగతుల వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినడంతో పాటు, మరో మూడు కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బింగుమల్ల రాహుల్‌(24) తన మరణ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఐఐటీ హైదరాబాద్‌లో ఎంటెక్‌ చదువుతున్న ఏపీలోని నంద్యాలకు చెందిన రాహుల్‌ తానుంటున్న వసతిగృహంలోనే మంచానికి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

IIT Hyderabad Mtech Student Suicide case : ఆగస్టు 31న ఉదయం 10 గంటల సమయంలో ఈ విషయాన్ని తోటి విద్యార్థులు గుర్తించారు. ఆయన గదిలో ఒక నోట్‌ పుస్తకంలో ‘ఇంపార్టెంట్‌ టెక్ట్స్‌... ప్లీజ్‌ సీమై ల్యాప్‌టాప్‌’ అని కనిపించింది. లాక్‌ తెరిపించి అందులో ఉన్న వాంగ్మూలాన్ని(సూసైడ్‌ లెటర్‌) పోలీసులు కనుగొన్నారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్‌ మంగళవారం విలేకరుల సమావేశంలో అందులోని వివరాలను చదివి వినిపించారు. ఉద్యోగం వస్తుందో రాదోనన్న ఆందోళన, థీసిస్‌కు సంబంధించిన ఒత్తిడి వల్లనే రాహుల్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు స్పష్టమైందన్నారు.

భవిష్యత్తుపై భయంతో.. ‘‘నాకు జీవించాలని లేదు. ప్లేస్‌మెంట్స్‌ ఒత్తిళ్లు, థీసిస్‌, భవిష్యత్తులో ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలే ఇందుకు కారణం. ప్రతిరోజూ ఒత్తిడికి గురవుతున్నా. చాలామంది విద్యార్థులు ప్లేస్‌మెంట్స్‌ కోసమే ఎంటెక్‌లో ప్రవేశిస్తారు. అలాంటప్పుడు థీసిస్‌ ఎందుకు? ట్రిపుల్‌ ఐటీ బెంగళూరులో థీసిస్‌కు బదులుగా ఇంటర్న్‌షిప్‌ను అందుబాటులోకి తెచ్చారు. థీసిస్‌ కోసం ఏ విద్యార్థినీ ఒత్తిడి చేయకండి. నా నిర్ణయానికి గైడ్‌ కారణం కాదు.. కేవలం భవిష్యత్తు మీద భయం మాత్రమే. ఒత్తిడి నుంచి బయటపడేందుకు మద్యపానం, ధూమపానానికీ అలవాటుపడ్డా. ఒత్తిడిని జయించలేకపోయా. అమ్మా, నాన్నా.. నా అవయవాలను దానం చేయండి. నాన్నా... నాకు ఆశ్చర్యమేస్తోంది. నువ్వు ఇన్ని రోజులు నీ జీవితంలో సమస్యలతో ఎలా పోరాడావు. ఈ చిన్నదాన్నే నేను హ్యాండిల్‌ చేయలేకపోతున్నా’ 2019లో జరిగిన మూడు ఆత్మహత్యల ఘటనల నుంచి ఐఐటీ ఏమీ నేర్చుకోలేదు. విద్యార్థులకు స్టయిఫండ్‌ను సకాలంలో ఇవ్వాలి’’ అంటూ ల్యాప్‌టాప్‌లో రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఐఐటీ హైదరాబాద్‌లో కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు ప్రత్యేక కేంద్రం ఉందని ఎస్పీ రమణకుమార్‌ వివరించారు. అయినా ఆ సదుపాయాన్ని రాహుల్‌ వాడుకోలేదన్నారు. ఈ నెల 6న పోతిరెడ్డిపల్లిలోని భవనం పైనుంచి దూకి చనిపోయిన ఐఐటీ పూర్వ విద్యార్థి మేఘ్‌కపూర్‌ గదిలో ఎలాంటి లేఖా లభించలేదన్నారు. విద్యార్థులు ఏదైనా సమస్య ఉంటే తమ సాయం తీసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో సంగారెడ్డి డీఎస్పీ రవీంద్రారెడ్డి, సీఐ శివలింగం పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.