ETV Bharat / crime

పోడు రైతుపై అటవీ అధికారుల దాడి.. కార్యాలయానికి తీసుకెళ్లి..

author img

By

Published : Mar 12, 2022, 5:36 PM IST

forest officials attack on podu farmer
పోడు రైతులపై అటవీశాఖ అధికారుల దాడులు

forest officials attack on podu farmer: తమ పొలంలో కందకాలు తవ్వొద్దని చెప్పినందుకు.. ఓ రైతుపై దాడి చేశారు అటవీశాఖ అధికారులు. కార్యాలయానికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి.. మూత్రం తాగించేందుకు యత్నించారని బాధితులు వాపోయారు. మహబూబాబాద్​ జిల్లా పుట్టల భూపతి గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది.

forest officials attack on podu farmer: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పుట్టల భూపతి గ్రామశివారులో అటవీ శాఖ అధికారులు కొట్టడంతో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో వేంపల్లిపాడు ప్రాంతంలో అటవీ అధికారులు కందకాలు తవ్వుతుండగా... అక్కడికి వెళ్లిన రైతు సోలం బాబును తీవ్రంగా కొట్టారని ఆయన భార్య తెలిపారు. గతంలో గ్రామ పెద్దలు చూపిన హద్దుల వెంట కందకాలు తవ్వుకోవాలని చెప్పినందుకు తమపై దాడి చేశారని ఆరోపించారు.

మంచి నీళ్లు అడిగితే..

హద్దుల వెంట తవ్వుకోమన్నందుకు ఆగ్రహించిన అధికారులు సోలంబాబును గంగారం అటవీశాఖ కార్యాలయానికి తీసుకువెళ్లి కర్రలతో తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. దాహమేస్తుందని తన భర్త మంచి నీళ్లు అడిగితే అధికారులు బాటిల్​లో మూత్రం పోసి ఇచ్చి తాగమన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామంలో వదిలి వెళ్లిపోయారని బాధితుడి భార్య ఆరోపించారు.

"మా పొలంలో కందకాలు తీయొద్దని చెప్పాం. గ్రామ పెద్దలు చూపించిన సరిహద్దు వెంట తవ్వుకోవాలని చెప్పాం. దీంతో నా భర్తపై కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. అనంతరం కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడా కొట్టారు. బాటిల్​లో మూత్రం పోసి తాగమని చెప్పారు. దారుణంగా హింసించారు. మాకు న్యాయం చేయాలి." -సోలం బాబు భార్య

అధికారులపై ఫిర్యాదు

సోలం బాబును చికిత్స కోసం కుటుంబసభ్యులు నర్సంపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం స్థానిక పోలీస్​స్టేషన్​లో అటవీశాఖ అధికారులపై ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: Woman's Suspicious Death : తల్లి చనిపోయిందని తెలియక.. 4 రోజులుగా స్కూలుకెళ్లొస్తూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.