జూనియర్ లైన్‌మ్యాన్ పరీక్షల గోల్‌మాల్‌ కేసు.. వారే కీలక సూత్రధారులు..!

author img

By

Published : Jul 26, 2022, 2:24 PM IST

Updated : Jul 26, 2022, 9:07 PM IST

junior linemen

14:20 July 26

junior linemen: రూ.5 లక్షలకు ఒప్పందం.. ఐదుగురు అరెస్ట్

junior linemen exam: జూనియర్ లైన్ మెన్ నియామక పరీక్షలో అక్రమాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇంటి దొంగల హస్తం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. నియామక పరీక్ష రాస్తున్న అభ్యర్థితో 5 లక్షల రూపాయల బేరం కుదుర్చుకొని పరీక్షలో సమాధానం చెప్పేలా ఒప్పందం చేసుకున్నారు. పరీక్షాకేంద్రంలో చరవాణిలో చూస్తు సమాధానాలు రాస్తున్న శివప్రసాద్ అనే అభ్యర్థిని గమనించిన ఇన్విజిలేటర్... పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. నియామక పరీక్షలో అక్రమాలకు పాల్పడిన విద్యుత్ శాఖకు చెందిన ఇద్దరు ఇంజనీర్లతో పాటు.. వాళ్లకు సహకరించిన ముగ్గురిని ఘట్ కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న జూనియర్ లైన్ మెన్ పోస్టులను భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు నియామక పరీక్ష నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన నిర్వహించిన పరీక్షలో వేల మంది హాజరయ్యారు. అభ్యర్థుల ఆశను సొమ్ము చేసుకోవాలని విద్యుత్ శాఖకే చెందిన నలుగురు ఉద్యోగులు అడ్డదారి ఎంచుకున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని తెలిసిన వాళ్ల ద్వారా అభ్యర్థులకు ప్రచారం చేయించారు. శివప్రసాద్ అనే ఒక ఎలక్ట్రీషియన్ ఐఐటీ పాసై... జూనియర్ లైన్​మెన్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. నవ్య అనే యువతి శివప్రసాద్​ను మభ్యపెట్టి.. 5 లక్షల రూపాయలు ఇస్తే ఉద్యోగం వస్తుందని నమ్మించి అతని నుంచి లక్ష రూపాయలు తీసుకుంది.

పరీక్షా కేంద్రంలోని వెళ్లినప్పుడు చరవాణి వెంట తీసుకెళ్లాలని దానికి సమాధానాలు పంపిస్తామని చెప్పింది. ఘట్​కేసర్​లోని ప్రతాప్ రెడ్డి కళాశాల పరీక్షా కేంద్రంలోని శివప్రసాద్ చరవాణి తీసుకెళ్లాడు. చరవాణిలో చూస్తూ సమాధానాలు రాయడం గమనించిన ఇన్విజిలేటర్ వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వాళ్లు ఘట్​కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మిర్యాలగూడలో విద్యుత్ కార్యాలయంలో అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీర్ గా పనిచేస్తున్న సైదులు, జగిత్యాలలో సబ్ ఇంజనీర్​గా పనిచేస్తున్న సాజన్ ప్రశ్నలకు సమాధానాలు పంపిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీళ్లిద్దరూ కలిసి నవ్య, ఖలీముల్లా అనే ఏజెంట్ల సాయంతో శివప్రసాద్ నుంచి డబ్బులు తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పరీక్ష రాసిన శివప్రసాద్​తో పాటు.... ఏడీఈ సైదులు, సబ్ ఇంజనీర్ సాజన్, నవ్య, ఖలీముల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్​లోని మెహదీపట్నం పుల్లారెడ్డి డిగ్రీ కళాశాలలో జరిగిన పరీక్షా కేంద్రంలోనూ ఓ అభ్యర్థి చూచిరాతకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. లోక్యానాయక్, దశరథ్ నాయక్ అనే ఇద్దరు అభ్యర్థులు జూనియర్ లైన్​మెన్ నియామక పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. విద్యానగర్​లో లైన్​మెన్​గా పనిచేస్తున్న శ్రీనివాస్​ను సంప్రదించి ఎలాగైనా ఉద్యోగం వచ్చేలా చేయాలని కోరారు. మలక్​పేటలో ఏడీఈగా పనిచేస్తున్న ఫిరోజ్​తో సన్నిహితంగా మెలిగే శ్రీనివాస్​ ఈ విషయాన్ని వెంటనే అతనికి తెలిపాడు.

ఒక్కో అభ్యర్థి 5 లక్షల రూపాయలు ఇస్తే... ఉద్యోగం వచ్చేలా చేస్తామని ఫిరోజ్, శ్రీనివాస్ చెప్పడంతో లోక్యానాయక్, దశరథ్ చెరో లక్ష రూపాయలు చెల్లించారు. ఈనెల 17వ తేదీన జరిగిన నియామక పరీక్షకు దశరథ్, లోక్యానాయక్ హాజరయ్యారు. పరీక్ష ముగిసే వరకు హాల్​లోనే ఉండాలని... చివర్లో సెల్​ఫోన్​కు సమాధానాలు పంపిస్తామని ఫిరోజ్, శ్రీనివాస్ చెప్పారు. సగం సమయం ముగిసినా ఒక్క సమాధానం కూడా సెల్​ఫోన్​కు రాకపోవడంతో లోక్యానాయక్ సమాధాన పత్రం ఇచ్చేసి బయటికి వచ్చాడు.

అదే రోజు సాయంత్రం లైన్​మెన్ శ్రీనివాస్​ను కలిసి తన లక్ష రూపాయలు ఇవ్వాలని కోరాడు. చివరి వరకు పరీక్షా కేంద్రంలో ఉండకపోవడం నీ తప్పేనని లోక్యానాయక్​కు చెప్పిన శ్రీనివాస్ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో లోక్యానాయక్ అంబర్​పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏడీఈ ఫిరోజ్, లైన్​మెన్ శ్రీనివాస్​తో పాటు వాళ్లకు సహకరించిన దశరథ్​ను ఆరు రోజుల క్రితమే అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

రెండు కేసుల్లో విద్యుత్ శాఖకు చెందిన ఇద్దరు ఏడీఈలు, ఒక సబ్ ఇంజనీర్, లైన్​మెన్​తో పాటు వాళ్లకు సహకరించిన నలుగురిని అరెస్ట్ చేశారు. జూనియర్ లైన్ మెన్ నియామక పరీక్షలో అక్రమాలకు సంబంధించి పోలీసులు ఇప్పటికే విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షా పత్రం లీక్ కాలేదని... కేవలం ఇద్దరు అభ్యర్ధులు మాత్రమే ఇతరుల ద్వారా సమాధానాలు తెప్పించుకునే ప్రయత్నం చేసినట్లు విద్యుత్ ఉన్నతాధికారులు పోలీసులకు తెలిపారు. అంబర్ పేట పోలీసులు అరెస్ట్ చేసిన ఏడీఈ ఫిరోజ్, ఘట్ కేసర్ పోలీసులు అరెస్ట్ చేసిన ఏడీఈ సైదులుకి గత కొన్నేళ్లుగా పరిచయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీళ్లిద్దరూ కలిసి ఇంకెవరి నుంచైనా డబ్బులు వసూలు చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూనియర్ లైన్ మెన్ నియామక పరీక్షలో అక్రమాలు చోటు చేసుకోవడం పట్ల ఇతర అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పరీక్ష గురించి సీఎండీకి కొంతమంది అభ్యర్థులు లేఖ రాశారు. ఉన్నతాధికారులు స్పందించకుంటే ఆందోళనకు దిగుతామని అభ్యర్థులు చెబుతున్నారు.

ఇవీ చదవండి: బిగ్​ అలెర్ట్​.. రానున్న 3 రోజులు అతి భారీ వర్షాలు

ఈడీ విచారణలో సోనియాకు లంచ్ బ్రేక్.. ఇంటికి కాంగ్రెస్​ అధినేత్రి

Last Updated :Jul 26, 2022, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.