ETV Bharat / bharat

ముగిసిన సోనియా విచారణ.. ఆరు గంటలు ప్రశ్నించిన ఈడీ

author img

By

Published : Jul 26, 2022, 11:09 AM IST

Updated : Jul 26, 2022, 7:02 PM IST

సోనియా గాంధీ
సోనియా గాంధీ

19:01 July 26

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం ఈడీ విచారణ ముగిసింది. మంగళవారం ఆరు గంటల పాటు సోనియాను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది.

15:32 July 26

సెకండ్ రౌండ్ విచారణ

భోజన విరామం తర్వాత తిరిగి ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు సోనియా గాంధీ.

14:18 July 26

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి.. ఈడీ అధికారులు భోజన విరామం ఇచ్చారు. ఆమె ఎన్​ఫోర్స్​మెంట్ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లారు. విచారణ కోసం మళ్లీ మధ్యాహ్నం మూడున్నరకు తిరిగి రావాలని అధికారులు ఆమెకు సూచించారు. నేషనల్​ హెరాల్డ్ వ్యవహారానికి సంబంధించి వేర్వేరు కోణాల్లో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్ అధికారులు ఆమెను ప్రశ్నించినట్లు తెలిసింది.

13:21 July 26

ప్రతిపక్షాలను అణచివేసేందుకు కేంద్రం.. దర్యాప్తు సంస్థలను వాడుకుంటోందని అన్నారు కాంగ్రెస్​ నేత సచిన్​ పైలట్. కాంగ్రెస్​ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలే లక్ష్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. పోలీసుల సూచనల మేరకు తాము నిరసన చేపట్టామని అయినా తమను అదుపులోకి తీసుకున్నారన్నారు సీనియర్​ నేత మల్లికార్జున ఖర్గే. ప్రధాని మోదీ, అమిత్​ షా పన్నిన కుట్రలో భాగమే ఇదంతా అని ఆరోపించారు. అంతకుముందు విజయ్​చౌక్​లో బైఠాయించిన కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత్​ పోలీసులు ఆధిపత్యం చెలాయించే దేశమని.. మోదీ అందుకు రాజు అని పేర్కొన్నారు రాహుల్.

12:14 July 26

అదుపులోకి రాహుల్ గాంధీ

సోనియా గాంధీ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్​ నేతలు చేపడుతున్న నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. రాహుల్​ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్​ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో రాహుల్​ సహా 17 మంది ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయం, పార్లమెంటు ఆవరణల్లో ఈ నిరసనలు జరుగుతున్నాయి. ఖర్గే, కేటీఎస్ తుల్సీ, చిదంబరం, వివేక్​ తన్ఖా వంటి సీనియర్లు పోలీసుల అదుపులో ఉన్న నేతల జాబితాలో ఉన్నారు. ఈడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని.. దీనిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్​ నేతలు పేర్కొన్నారు.

11:02 July 26

ఈడీ విచారణకు సోనియా గాంధీ

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్​ కేసులో కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలపై సోనియాను ఈడీ ప్రశ్నించనుంది. సోనియాకు తోడుగా ఆమె కుమారుడు రాహుల్​ గాంధీ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చారు. మరోవైపు సోనియాపై ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్​ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మహిళా కార్యకర్తలు నల్ల బెలూన్లు చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈడీ అధికార దుర్వియోగాన్ని మానుకోవాలని డిమాండ్​ చేశారు. కాంగ్రెస్​కు భాజపా భయపడే ఈడీని పంపిస్తోందని పేర్కొన్నారు.

ఇప్పటికే ఓసారి ఈడీ సోనియాను విచారించింది. ఈనెల 21న జరిగిన విచారణలో సోనియాను ఈడీ సుమారు 25 ప్రశ్నలు అడిగింది. అయితే సోనియా చేసిన విజ్ఞప్తి కారణంగా విచారణను రెండు గంటల్లో ముగించింది. పార్టీ అధినేత్రి విచారణ నేపథ్యంలో ఆ రోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ నిరసనలు చేపట్టింది. పలు చోట్ల నిరసనలు ఉద్ధృతంగా మారాయి. నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. సీడబ్ల్యూసీ సభ్యులు, కాంగ్రెస్​ ఎంపీలను నిర్బంధించారు. దాదాపు 75 మంది కాంగ్రెస్​ ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ కేసు..: కాంగ్రెస్‌కు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్‌ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో స్వామి కేసు వేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌ను ఈడీ ప్రశ్నించింది.

Last Updated :Jul 26, 2022, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.