ETV Bharat / crime

రామకృష్ణగౌడ్‌ హత్య కేసుపై పోలీసుల దర్యాప్తు.. స్థలవివాదమా..? పరువు హత్యా..?

author img

By

Published : Apr 17, 2022, 2:20 PM IST

Updated : Apr 17, 2022, 6:34 PM IST

భువనగిరిలో అదృశ్యమై సిద్దిపేటలో శవమై.. స్థలవివాదమా..? పరువు హత్యా..?

యాదాద్రి భువనగిరి జిల్లాలో అదృశ్యమైన స్థిరాస్తి వ్యాపారి, మాజీ హోంగార్డు రామకృష్ణ గౌడ్‌ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. రామకృష్ణది కులాంతర వివాహం కావడంతో తన తండ్రే హత్య చేయించాడని మృతుని భార్య భార్గవి ఆరోపిస్తోంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు. పరువు హత్యా లేదా ఆస్తి వివాదాలా అనే కోణంలో విచారణ జరుగుతోంది. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

యాదాద్రి భువనగిరి వలిగొండ మండలం లింగరాజుపల్లికి స్థిరాస్తి వ్యాపారి, మాజీ హోంగార్డు రామకృష్ణ ఎలా చనిపోయారన్నది ఇంకా తేలలేదు. రామకృష్ణ మృతికి కారణాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే... రామకృష్ణది రియల్‌ ఎస్టేట్‌ గొడవలతో జరిగిన హత్యనా లేదా పరువు హత్యనా అనే కోణంలో విచారణ చేపట్టారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు కక్ష గట్టి తన తండ్రే రామకృష్ణను హత్య చేయించాడని రామకృష్ణగౌడ్ భార్య భార్గవి ఆరోపించారు. రామకృష్ణ వ్యాపార సహచరుడు అయిన లతీఫ్‌ సాయంతో తన తండ్రి వెంకటేశ్వర్లు హత్య చేయించాడని ఆరోపిస్తున్నారు. రెండ్రోజుల క్రితం లతీఫే తన భర్తను ఇంటి నుంచి తీసుకెళ్లాడని ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోవట్లేదని.. తన తండ్రే రామకృష్ణను హత్య చేయించాడని భార్గవి కన్నీరుమున్నీరవుతోంది.

ప్లాన్​ ప్రకారమే చంపారు.. నిన్న సాయంత్రం నుంచి ఆయన ఫోన్​ లిఫ్ట్​ చేయడం లేదు. నాకు అనుమానం వచ్చి రాత్రి 2 గంటలకు డయల్​ 100కు ఫిర్యాదు చేశా. ఉదయం 6 గంటలకు రమ్మంటే.. స్టేషన్​కు వెళ్లి పిటిషన్​ ఇచ్చా. ఏమి కాదమ్మా.. నీ భర్తను తీసుకొస్తామని చెప్పారు. చిన్నపాప ఉంది. నా బిడ్డ, నేను ఆగమైనం. నా భర్త, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. తను లేకుండా ఎట్లుంటాం. పెళ్లి అయిన దగ్గర్నుంచి మా తల్లిదండ్రులకు దూరంగానే ఉన్నాం. మమ్మల్ని వదిలేశారు. ఇంకా వాళ్లు ఏం చేయరు అనుకున్నాం. కానీ ఇట్ల నమ్మించి గొంతు కోస్తాడని అనుకోలేదు. మా ఆయన ఏనాడు మీ అమ్మవాళ్లను ఇది, అది అడుగు అని ఏనాడు అనలేదు. నన్ను కన్నతల్లి కంటే ఎక్కువగా చూసుకున్నడు నా భర్త. ప్లాన్​ ప్రకారమే నా భర్తను చంపారు. -భార్గవి, మృతుడు రామకృష్ణ భార్య

రామకృష్ణ గౌడ్ హత్య కేసులో భువనగిరి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసుపై ప్రశ్నిస్తున్నారు. అయితే రామకృష్ణ కొన్నాళ్లుగా స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ గొడవల్లో అతడిని హత్య చేసి ఉంటారా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. రామకృష్ణది ప్రేమ వివాహం కావడంతో... పరువు కోసం అతని మామ హత్య చేయించాడా అని దిశలోనూ దర్యాప్తు సాగుతోంది.

ఇదీ జరిగింది: లింగరాజుపల్లికి చెందిన రామకృష్ణ.. గతంలో యాదగిరిగుట్టలో హోంగార్డుగా పని చేసేవాడు. గుప్తనిధుల కేసులో సస్పెండ్​ అయ్యాడు. యాదగిరిగుట్టలో హోంగార్డుగా పనిచేస్తున్న సమయంలో(రెండేళ్ల కిందట) రామకృష్ణకు.. గౌరాయిపల్లికి చెందిన వెంకటేశ్వర్లు(రాజపేట మండలంలో వీఆర్​వో) కూతురు భార్గవితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. రామకృష్ణ గౌడ సామాజిక వర్గానికి చెందిన వాడు కాగా.. భార్గవి ముదిరాజ్​ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. ఈ కారణంగా వీరిద్దరి పెళ్లికి భార్గవి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. దీంతో.. 2020లో ఇద్దరు ప్రేమ వివాహాం చేసుకున్నారు.

వివాహం తరువాత.. కొన్ని రోజులకు భార్గవి, రామకృష్ణను వెతికి పట్టుకున్న అమ్మాయి తరఫువాళ్లు మాట్లాడారు. ఆ సమయంలో రామకృష్ణతోనే ఉంటానని.. భార్గవి తెగేసి చెప్పింది. తన తండ్రి ఆస్తిలో వాటా కూడా అడగనని ఓ పత్రంపై రాతపూర్వకంగా స్పష్టం చేసింది. అప్పటి నుంచి అంతా బాగానే ఉంది. 8 నెలల క్రితం భువనగిరి పట్టణంలోనే ఓ గదిని అద్దెకు తీసుకొని సంతోషంగా నివసిస్తున్నారు. వాళ్లిద్దరికి ఓ పాప కూడా పుట్టింది.

ఈమధ్యే రామకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. కాగా.. శుక్రవారం(ఏప్రిల్ 15) సాయంత్రం లతీఫ్ అనే వ్యక్తితో రామకృష్ణ ఇంటి నుంచి వెళ్లినట్లు భార్య భార్గవి తెలిపారు. శనివారం ఉదయం వరకు రామకృష్ణ ఇంటికి రాకపోవటం.. ఎన్నిసార్లు ఫోన్​ చేసినా సమాధానం లేకపోవటం వల్ల ఆందోళనతో.. పొలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన భువనగిరి పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈరోజు(ఏప్రిల్​ 17) సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారంలో ఓ మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఆరా తీయగా.. గుర్తుతెలియని వ్యక్తులు రామకృష్ణ గౌడ్​ని చంపి శవాన్ని లకుడారంలో పడేసినట్టు తెలిసింది. అయితే.. ఈ హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం.. భార్గవి వాళ్ల తండ్రి వెంకటేశ్వర్లు యాదగిరిగుట్టలోనే నివాసం ఉంటూ రాజపేట మండలంలో వీఆర్​వోగా విధులు నిర్వహిస్తున్నారు.

ప్లాన్​ ప్రకారమే చంపారు: భార్గవి

ఇవీ చూడండి:

Last Updated :Apr 17, 2022, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.