ETV Bharat / crime

స్క్రాచ్‌ కార్డు చీటింగ్​ ముఠా అరెస్టు

author img

By

Published : Mar 2, 2021, 3:39 AM IST

cyber-thieves-are-cheating-people-in-innovative-ways-in-hyderabad
స్క్రాచ్‌ కార్డు చీటింగ్​ ముఠా అరెస్టు

సైబర్‌ నేరాలు రోజుకో పుంతలు తొక్కుతున్నాయి. మోసాలను ఊహించడానికి కూడా వీలు లేని విధంగా నేరగాళ్లు సరికొత్త మార్గాల్లో పెట్రేగిపోతున్నారు. అంతర్జాలం, యాప్‌లు, ఓటీపీల ద్వారా జనాలను లూటీ చేస్తున్న ఈ మాఫీయా... నిలువు దోపిడీకి ఇప్పుడు మరో వినూత్న పంథాను ఎంచుకుంది. ఇంటికి స్క్రాచ్‌ కార్డు పంపి... ఆకర్షణీయమైన బహుమతి అంటూ బురిడీ కొట్టిస్తోంది. ఇటీవల ప్రజలను అమాయకులను చేస్తూ వేలల్లో కొట్టేసిన నేరగాళ్లను సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

స్క్రాచ్‌ కార్డు చీటింగ్​ ముఠా అరెస్టు

రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్నసైబర్‌ మోసాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. విభిన్న మార్గాల్లో సమాజంలో చొచ్చుకొస్తున్న సైబర్‌ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. జనాలు ఈ నేరగాళ్ల బారినపడి నిత్యం వేలు, లక్షల్లో కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్ మాదాపూర్‌కు చెందిన కార్తీక్‌ అనే వ్యక్తికి.. గత సెప్టెంబర్‌లో పోస్టు ద్వారా ఓ స్క్రాచ్‌ కార్డు వచ్చింది. మీకు ఇన్నోవా కారు వరించిందని... బహుమతి పొందేందుకు కింది నంబరుకు ఫోన్ చేయాలని అందులో రాసి ఉంది. స్పందించిన కార్తీక్ ఆ నంబరుకు ఫోన్ చేయగా... పలు కారణాలు చెప్పి విడతల వారీగా 95వేలు వసూలు చేశారు. కారు కోసం వారికి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించిన కార్తీక్.. సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు... నిందితులు బిహార్‌కు చెందిన వారిగా గుర్తించారు.

షాపింగ్ చేసిన వారి వివరాలు

బిహార్‌కు చెందిన ప్రధాన నిందితుడు తరుణ్‌కుమార్... గతంలో పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. అందులో నష్టం రావడంతో సులభంగా డబ్బులు సంపాదించేందుకు.. మోసాలు చేయడం మొదలుపెట్టాడు. పలు ఈ కామర్స్‌ వెబ్‌సైట్లో పనిచేస్తున్న అలోక్, తిరాంజు వద్ద నుంచి షాపింగ్ చేసిన వారి వివరాలు సేకరిస్తున్నాడు.

మాయమాటలు చెప్పి..

అతని సన్నిహితుడైన మోహిత్ ద్వారా వివిధ ఈ కామర్స్ సంస్థల నకిలీ పేపర్లు తయారు చేయించాడు. వాటిలో స్క్రాచ్‌ కార్డుల ఉంచి పోస్టు ద్వారా వివిధ చిరునామాలకు పంపుతున్నాడు. స్పందించిన వారికి తన ముఠా ద్వారా మాయమాటలు చెప్పి.. ప్రజలను లూటీ చేస్తున్నాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. చిరునామా, చరవాణి లొకేషన్ ద్వారా కాల్‌సెంటర్లపై దాడి చేసి నిందితులను పట్టుకున్నామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. వీరినుంచి 42 చరవాణులు, 2 ల్యాప్‌ ట్యాప్‌లు, 900 స్క్రాచ్‌ కార్డులు, 28 డెబిట్‌ కార్డులు, 10 ఆధార్‌ కార్డులు, 2 రబ్బర్‌ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కామర్స్ సంస్థలు ఎప్పుడూ ఉచితంగా బహుమతులు ఇవ్వవని... ఇలాంటివి నమ్మి మోసపోవద్దని పోలీసులు చెబుతున్నారు. ఎలాంటి అనుమానం వచ్చినా పీఎస్‌లో ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి : నల్లమల అడవుల్లో పెద్దఎత్తున మంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.