ETV Bharat / crime

Illegal Weapons : మాటల్లేవ్‌.. తూటాలే.. గొడవేదైనా ఆయుధంతోనే సమాధానం

author img

By

Published : Aug 2, 2022, 8:28 AM IST

gun
gun

Illegal Weapons in Telangana : రాష్ట్రంలో అక్రమ ఆయుధాలు సమకూర్చుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కారణాలేవైనా తుపాకులు పేలే వరకూ ఈ విషయం పోలీసులకూ తెలియడంలేదు. ఆయుధాలకు డిమాండు పెరగడంతో ఉత్తరాది నుంచి వాటిని సరఫరా చేసే ముఠాలు తయారయ్యాయి. స్థిరాస్తి లావాదేవీలే ప్రధాన కారణంగా ఆయుధాల సరఫరా పెరుగుతోంది. గొడవేదైనా ఆయుధంతోనే సమాధానం చెబుతున్నారు. తాజాగా మాదాపూర్​లో జరిగిన కాల్పులు కలకలం రేపాయి.

Illegal Weapons in Telangana : బెదిరింపులు.. దోపిడీలు.. అపహరణలు.. హత్యలు.. ఇవన్నీ చేయాలంటే గన్నులుండాలి. కూర్చొని పరిష్కరించుకోవడం కాదు.. ధనాధన్‌ ఫటాఫట్‌గా వ్యవహారం తేలిపోవాలని రౌడీషీటర్లు, నేరస్థులు పిస్తోళ్లు.. రివాల్వర్లను వినియోగిస్తున్నారు. రాజకీయ నేతలు, వారి అనుచరులు, వ్యాపారులూ స్థిరాస్తి సెటిల్‌మెంట్లకు ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. రౌడీషీటర్లు, నేరస్థుల చేతుల్లోనే 80 శాతం వరకూ ఆయుధాలు ఉన్నాయని అంచనా. వీటిని రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారు. గతంలో కరడుగట్టిన నేరగాళ్ల వద్ద మాత్రమే ఆయుధాలుండేవి. ఇప్పుడు పాతబస్తీలో నేరస్థులు.. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో కొందరు రియల్టర్లు, రౌడీషీటర్ల వద్ద అత్యాధునిక పిస్టళ్లు, తుపాకులు, రివాల్వర్లున్నాయి.

అనధికారికంగా 35 వేలు.. హైదరాబాద్‌లో పోలీసుల అనుమతితో పది వేల ఆయుధాలుంటే.. అనధికారికంగా 35వేలున్నాయి. గ్రేటర్‌లో నమోదవుతున్న నేరాల్లో 40శాతం ఆయుధాలకు సంబంధించినవే. రైళ్లల్లో తనిఖీలు లేకపోవడంతో ఆయుధాలు తీసుకువస్తున్నారు. శివారు రైల్వేస్టేషన్లలో దిగి వెళ్లిపోతున్నారు. నగరంలో ప్రస్తుతం తనిఖీలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అక్రమాయుధాలను రాజస్థాన్‌లో జయపుర, బిహార్‌లోని గయ.. ముంగేర్‌.. పట్నా, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌, బర్వానీలలో చాలా సులభంగా తయారు చేస్తున్నారు.

ఇస్మాయిల్‌పై 6 కేసులు.. రౌడీషీటర్‌ ఇస్మాయిల్‌పై కాలాపత్తర్‌, బహదూర్‌పురా, ఫలక్‌నుమా ఠాణాల పరిధిలో మొత్తం ఆరు కేసులున్నాయని పోలీసులు తెలిపారు. నవాబ్‌సాబ్‌కుంటలో ఉండే ఇతనికి పదేళ్ల క్రితం ఓ హత్య కేసులో కోర్టు జీవితఖైదు విధించింది. ఐదేళ్లు జైలుశిక్ష అనుభవించాక పైకోర్టులో అప్పీలు చేసుకోగా.. అభియోగాలను కొట్టేసింది. బయటకు వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నాడు. మూడేళ్ల క్రితం పీడీ చట్టం ప్రయోగించగా.. రెండేళ్ల క్రితం బెయిల్‌పై వచ్చాడు.

అక్కడే రెండు కాల్పుల ఘటనలు.. రౌడీషీటర్‌పై కాల్పులు జరిగిన మాదాపూర్‌ 100 అడుగుల రోడ్డుకు ఇవతలి వైపు(నీరూస్‌ జంక్షన్‌) జూబ్లీహిల్స్‌ 36లో 2015 అగస్టు 20న మరో కాల్పుల ఘటన జరిగింది. కర్ణాటకకు చెందిన దొంగలు అబ్దుల్‌ ఖాదర్‌, మీర్జా అబ్దుల్‌ ఉల్లాబేగ్‌ నీరూస్‌ జంక్షన్‌ వద్ద చరవాణులు దుకాణంలో దోపిడీకి పథకం వేశారు. పసిగట్టిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు డెకాయ్‌ ఆపరేషన్‌ చేయగా దొంగలు కాల్పులు జరపడంతో ఎల్‌అండ్‌టీ కార్మికుడు ధర్మేంద్ర ఛాతీలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. అతను ప్రాణాలతో బయటపడ్డాడు.

ఉస్మానియాలో పోస్టుమార్టం.. ఇస్మాయిల్‌ మృతదేహానికి సోమవారం ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మార్చురీ వద్ద ఇస్మాయిల్‌ స్నేహితుడు ఫయాజ్‌ మాట్లాడుతూ.. 8 రోజుల క్రితమే తాడ్‌బంద్‌ వద్ద ముజాహిదీన్‌తో జరిగిన చర్చలు విఫలమయ్యాయని తెలిపారు. ఒంటరిగా ఎక్కడికీ వెళ్లవద్దనీ, ఎన్నోసార్లు చెప్పానన్నారు. చర్చించుకుందామని రప్పించి హతమార్చారని పేర్కొన్నారు.

బయటికొస్తే.. బరితెగింపే!

మాదాపూర్‌లో ఇస్మాయిల్‌ హత్యకు గురైన ప్రదేశం..

భూముల కబ్జా.. బెదిరింపులు.. సెటిల్‌మెంట్లు.. రౌడీషీటర్లు, గ్యాంగ్‌స్టర్ల నిత్య కృత్యాలు. పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నా పంథా మార్చుకోవడం లేదు. వివాదాల్లో ఉన్న భూములు.. కాలనీలు.. గల్లీలో నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లు.. శివార్లలోని రూ.కోట్ల విలువైన స్థలాల క్రయ విక్రయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. తమ మాట వినని వారిపై భౌతిక దాడులకు దిగుతున్నారు. ప్రత్యర్థులను మట్టుబెట్టేందుకూ వెనుకాడడంలేదు. ఇలాంటివారిపట్ల కఠినంగా వ్యవహరించేందుకు పోలీసులు పీడీ(ముందస్తు నిర్బంధ) చట్టం ప్రయోగిస్తున్నారు. నిర్బంధ గడువు ముగియగానే బయటకు వస్తున్న నేరస్థులు మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారు. మళ్లీ పీడీ చట్టం ప్రయోగించేందుకు న్యాయపరమైన ఇబ్బందులు ఉండడంతో ఠాణాలకు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.

‘పీడీ’ చట్టం ఉన్నంత వరకే.. పీడీ చట్టాన్ని ప్రయోగిస్తే.. ఏడాది వరకూ జైల్లో ఉండాలి. ఏదైనా కేసులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నా పీడీ చట్టం ఉంటే బయటకు రావడం సాధ్యం కాదు. ఏడాది ముగియగానే బయటకు వచ్చి నేరాలకు పాల్పడుతున్నవారు 60 శాతం మంది ఉన్నట్లు గుర్తించారు. గ్యాంగ్‌స్టర్‌ అయూబ్‌ ఖాన్‌ సహా పలు రౌడీషీటర్లు, గొలుసు దొంగలు ఇలాగే చేశారు.

సైబరాబాద్‌ సీపీ స్వీయ పర్యవేక్షణ.. మాదాపూర్‌లో సోమవారం తెల్లవారుజామున రౌడీషీటర్‌ ఇస్మాయిల్‌ను తుపాకీతో కాల్చి చంపిన కేసు దర్యాప్తును సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మాదాపూర్‌ ఏసీపీ రఘునందన్‌రావు సారథ్యంలో 5 బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, ప్రధాన నిందితుడు ముజాహిద్‌ కోసం వేట ప్రారంభించాయి. జహీరాబాద్‌లో ఉండొచ్చన్న అంచనాకు వచ్చాయి. నిందితులు నగరంలో తిరిగిన ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్‌లను, ఘటనా స్థలంలోని సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించినట్టు సమాచారం.

రమ్మంటే వెళ్లాం.. 'భూ వివాదంలో డబ్బులిస్తామంటే వెళ్లామని కాల్పుల ప్రత్యక్ష సాక్షి, ఇస్మాయిల్‌ అనుచరుడు జహంగీర్‌ తెలిపాడు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు మాదాపూర్‌లోని ఇడ్లీ బండి వద్ద టిఫిన్‌ చేశాం. ఇస్మాయిల్‌, ముజాహిద్‌ మధ్య గొడవ పెద్దదైంది. జిలానీ పిస్తోలుతో ఇస్మాయిల్‌పై 5-6 సార్లు కాల్పులు జరిపాడు. అడ్డుకొనేందుకు వెళ్లిన తనపైనా కాల్పులు జరిపాడు. కింద పడిన ఇస్మాయిల్‌ తలకు గాయం కాగా, తానే కారులో ఆసుపత్రికి తీసుకెళ్లా.' అని జహంగీర్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.