ETV Bharat / city

ముంపులోనే ఊళ్లు.. బిక్కుబిక్కుమంటున్న ప్రజలు

author img

By

Published : Jul 17, 2022, 7:06 AM IST

Updated : Jul 17, 2022, 7:13 AM IST

floods
floods

Severe damage due to Heavy floods: 'పల్లె ఏదో... పట్టణం ఏదో' కనిపించటం లేదు. 'పూరి గుడిసెలు-అద్దాల మేడలు' అనే తేడా లేదు. 'పేద-ధనిక' అన్న భావనే లేదు. అందరిదీ ఒకే వ్యథ. అందరికీ ఒకటే కష్టం. ఎవరిని కదిలించినా నిర్వేదమే. ఎవరి పలకరించినా దయనీయమే. ప్రకృతి విలయతాండవానికి గోదావరి పరీవాహక ప్రాంతాలు కకావికలమయ్యాయి. సర్వస్వం కోల్పోయి వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తీరప్రాంత గ్రామాలు, పట్టణాలు జలదిగ్బంధంలో మగ్గుతుండగా... ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి.

Severe damage due to Heavy floods: ఉగ్ర గోదావరి హోరు.. నిండా మునిగి ఉన్న ఇళ్లు.. బాహ్య ప్రపంచానికి వచ్చేందుకు గట్లపై ఎదురుచూస్తున్న జనం. వరద వెనక్కు వెళ్లడంతో తేలిన ఇళ్లలో పేరుకుపోయిన బురద.. వరద ఉద్ధృతికి పాడైన గృహోపకరణాలు.. నీటిలో నాని ముక్కిపోయిన బియ్యం.. రోడ్డుపై ఆరబెట్టిన దుస్తులు.. ఆకలితో అల్లాడుతున్న చిన్నారులు.. ఆహారం కోసం ఎదురు చూస్తున్న బాధితులు..పునరావాస కేంద్రాల్లో నిర్వాసితుల గోడు.. ఎవరిని కదలించినా నిరాశ.. నిర్వేదం. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఎటు చూసినా ఇవే దృశ్యాలు. ముఖ్యంగా భద్రాద్రి జిల్లా బూర్గంపాడు, భద్రాచలం మండలాల్లో వరద గోదావరి సృష్టించిన విలయం మాటలకు అందని రీతిలో ఉంది. మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్‌నగర్‌, రాంనగర్‌, పద్మశాలినగర్‌, రెడ్డికాలనీ, ఎల్‌ఐసీ కాలనీ, గణేశ్‌నగర్‌, బాలాజీనగర్‌, గౌతమినగర్‌, పాత మంచిర్యాలల్లోనూ ముంపు తీవ్రత కనిపించింది. మొత్తంగా ఆయా ప్రాంతాల్లోని దిగువ మధ్య తరగతి కుటుంబాలకు రూ.వేలల్లో నష్టం వాటిల్లగా.. మధ్య తరగతి కుటుంబాలు రూ.లక్షల ఆస్తిని పోగొట్టుకొని నడిరోడ్డుపై నిలబడ్డాయి. సాయం కోసం ఎదురుచూడటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి జారుకున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరద బీభత్సంపై ‘ఈటీవీ భారత్​' ప్రత్యేక కథనాలు..

.

బురద మిగిల్చిన వరద.. ఇళ్లు శుభ్రం చేసుకోవడమే పని..

ఎవరిని కదిలించినా నిరాశ.. నిర్వేదం.. భవిష్యత్తుపై బెంగ. దిగువ మధ్య తరగతి కుటుంబాలకు రూ.వేలల్లో నష్టం వాటిల్లగా.. మధ్య తరగతి కుటుంబాలు రూ.లక్షల ఆస్తిని పోగొట్టుకొని నడిరోడ్డుపై నిలబడ్డాయి. జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో వరద బాధితుల దీనస్థితి ఇది... పట్టణంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 4 వేల కుటుంబాలు ఆర్థికంగా తీవ్రనష్టం చవిచూశాయి. ముఖ్యంగా ఎన్టీఆర్‌ కాలనీలోని కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. రోళ్లవాగు నుంచి వచ్చిన వరద గోదావరి నదిలో కలిసే ప్రాంతానికి ఆనుకునే ఈ కాలనీ ఉండటంతో సుమారు 200 ఇళ్లు నీట మునిగాయి. దీంతో కాలనీ ప్రజలు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లాల్సి వచ్చింది. రెండు రోజుల కిందటే తిరిగి ఇళ్లకి చేరుకున్నారు. అప్పటినుంచి శుభ్రం చేసుకోవడానికే వీరు పరిమితమయ్యారు. వీధుల్లో ఇళ్ల ముందర రోడ్లపై సామాన్లు దర్శనమిస్తున్నాయి. వంట చేసుకుని పిల్లలకు తిండి పెట్టడం గగనమైపోతోంది. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ఇచ్చే నిత్యావసర సరకుల కోసం బారులు తీరారు. దాతలు ఇచ్చిన అరటిపండ్ల కోసం పిల్లలు పరుగులు తీస్తున్న దృశ్యాలు ఆకలితీవ్రతకు దర్పణాలుగా నిలిచాయి.

కప్పులు ఎగిరిపోయి.. గోడలు కూలిపోయి..

ఎన్టీఆర్‌నగర్‌లో దాదాపు అన్నీ కూలీల కుటుంబాలే. వీరికి వారం రోజులుగా ఉపాధి లేకుండా పోయింది. ప్రస్తుతం కాలనీవాసులు సమీపంలో ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. రాంనగర్‌, రెడ్డికాలనీలాంటి ప్రాంతాల్లో అయితే భవనాలూ ముంపునకు గురయ్యాయి. వాటిలోని ఏసీలు, ఫ్రిజ్‌లు, టీవీలు, సోఫాలు, వాషింగ్‌మెషీన్లు దెబ్బతిన్నాయి. ఒక్కో ఇంట్లో రూ.2-5 లక్షల వరకు ఆస్తినష్టం సంభవించింది. విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించకపోవడంతో పదుల సంఖ్యలో జనరేటర్లను కిరాయికి తెచ్చుకొని కాలం గడుపుతున్నారు. వరద ముంపు సమయంలో తమను సంరక్షణ కేంద్రాలకు తరలించిన ప్రభుత్వ యంత్రాంగం తర్వాత పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. ‘కలెక్టర్‌.., నాయకులు వచ్చి చూసివెళ్లారు. ఒక సంఘం వాళ్లు 5 కిలోల దొడ్డుబియ్యం ఇచ్చి వెళ్లారు.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు’ అని ఒక బాధితురాలు చెప్పారు.

కట్టలు కట్టలుగా పాములు..

.

పలు జనావాసాల్లో పాములు తిరుగుతూ కనిపించాయి. వరద ముంపు తగ్గడంతో అవి బయట తిరుగుతూ భయకంపితుల్ని చేశాయి. గోదావరి ఒడ్డునే నిర్మించిన ప్రభుత్వ మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో అయితే పదుల సంఖ్యలో పాములు కనిపించాయి. శనివారం ఆసుపత్రిని శుభ్రం చేస్తున్న క్రమంలో సిబ్బంది వాటిని చంపేశారు.

.

చిత్రంలో కనిపిస్తున్నది నాగరాజు దంపతులు. వీరిది రెండు గదుల ఇల్లు.. మొత్తం బురద.. గృహానికి విద్యుత్తు సరఫరా లేదు. తాగడానికి నీళ్లు లేవు. పొయ్యి వెలగడం లేదు. వంట సరకులు, దుస్తులు, ఇతర సామగ్రి తడిసి ముద్దయ్యాయి. పనికి వెళ్తేగాని పూట గడవని పరిస్థితుల్లో ఉన్న వీరు ఏ పూటకాపూట ఎవరైనా తిండి పెడతారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. రోజంతా ఇల్లు శుభ్రం చేసుకోవడం.. రాత్రికి వెళ్లి సంఘం భవనంలో విశ్రమించడం.. మూడు రోజులుగా ఇదీ వీరి పరిస్థితి.

కట్టుబట్టలే మిగిలాయి.. వరద పాలైన నిత్యావసర సామగ్రి..

అప్పు చేసి ఏడాదికి సరిపడా తెచ్చుకున్న బియ్యం.. నెలకు అవసరమయ్యే నిత్యావసర సరకులు, పిల్లల పుస్తకాలు.. దుస్తులు.. ఎరువులు.. అత్యవసర పరిస్థితిలో అక్కరకొస్తాయని దాచుకున్న డబ్బులు.. గోదావరి వరదల్లో ఇవన్నీ కొట్టుకుపోయాయి. మిగిలినవి పాడైపోయి పనికిరాకుండా మారాయి. చాలామందికి నీడనిచ్చే గూడు కూడా మిగల్లేదు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుని ప్రాణం కాపాడుకున్నా.. అన్నీ కోల్పోయి ఇక మీదట ఎలా బతకాలో దిక్కుతోచని స్ధితిలో ఉన్నారు అనేక మంది. అధిక వర్షాల కారణంగా గోదావరి నది, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని తీర ప్రాంతాలైన కాటారం, మహదేవపూర్‌, పలిమెల, మహాముత్తారం.. కన్నాయిగూడెం, ఏటూరునాగారం, వెంకటాపురం, వాజేడు, మంగపేట, తదితర మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఇళ్లు కూలిపోయాయి. పంటలు కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి నీరు చేరి సామగ్రి అంతా పాడైపోయింది. గ్రామాల్లో ఎవర్ని పలకరించినా కన్నీటి గాథలే..

.

ఇంట్లో చేరిన మట్టిని తొలగిస్తున్న వీరు ఎరకట్ల సమ్మయ్య, ఆయన భార్య, కుమారుడు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ముత్యాలమ్మ వీధికి చెందిన వీరు నాలుగు రోజుల పాటు పునరావాస కేంద్రంలో ఉన్నారు. వరద తగ్గడంతో శనివారం ఇంటికొచ్చి చూసేసరికి మోకాళ్ల లోతులో ఇసుక, మట్టి చేరి ఉంది. అటకపై పెట్టిన రెండు బస్తాల బియ్యం, దుస్తులు, వంట సామగ్రి, మంచాలు తడిసిపోయాయి. ఈ చిన్న ఇంట్లో ఆరుగురు ఉంటారు. ఈ వీధిలోని అందరి పరిస్థితి ఇలాగే ఉంది.

ముంపులోనే గ్రామాలు..

.

గోదావరి వరద తగ్గుతుండటంతో పల్లెలు నీటి ముంపు నుంచి తేరుకుంటున్నాయి. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం, మంగపేట మండలాల్లోని పలు గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. పడవల ద్వారా సరకులు అందిస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో ఇళ్లలో బురదను తొలగిస్తున్నారు. జయశంకర్‌, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 800 ఇళ్ల వరకు దెబ్బతిన్నాయి. నిత్యావసర సరకులు, బియ్యం, గృహోపకరణాలు, సామగ్రి ఇళ్లలో తడిచి పోవడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెండు జిల్లాల్లో 15 వేల ఎకరాలకు పైగా నష్టం వాటిల్లింది. పలిమెల మండలానికి ఇంకా విద్యుత్తు పునరుద్ధరణ కాకపోవడంతో ప్రజలు అంధకారంలోనే మగ్గుతున్నారు. రెండు జిల్లాల్లో ముందస్తు జాగ్రత్త చర్యగా 32 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ఎవరూ సందర్శించకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

.

* మంత్రి సత్యవతి రాఠోడ్‌ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు మహాముత్తారం, పలిమెల మండలాల్లోని ముంపు ప్రాంతాలను సందర్శించారు. పలిమెలలో బాధిత కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు శుక్రవారం రాత్రి పలిమెల మండలంలోనే బస చేశారు.

.

ఇవీ చదవండి:

Last Updated :Jul 17, 2022, 7:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.