ETV Bharat / city

మద్యం షాపులు మళ్లీ ప్రైవేటుకే.. త్వరలోనే నూతన విధానం..!

author img

By

Published : Jul 16, 2022, 8:24 AM IST

Wine Shops Privatization: మద్యం దుకాణాల్ని మళ్లీ ప్రైవేటుకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ దుకాణాలు ఎత్తేసి మద్యం వ్యాపారాన్ని పూర్తిగా ప్రైవేటుకు అప్పగిస్తే, భారీగా ఆదాయం ఆర్జించవచ్చని భావిస్తోంది. మూడు రోజుల కిందట జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

wine-shops-privatization-in-ap
wine-shops-privatization-in-ap

Wine Shops Privatization: ఏపీలో మద్యం దుకాణాలు మళ్లీ ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వ అధీనంలో ఉన్న అన్ని మద్యం దుకాణాలను ప్రైవేటుపరం చేసి మరింత ఆదాయం రాబట్టుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 25 వేల కోట్ల విలువైన మద్యం విక్రయించి.. దాదాపు 20 వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం ఆర్జించింది. మద్యం వ్యాపార పరిమాణం ఇంకా చాలా ఎక్కువగా ఉన్నా.. సరిగ్గా రాబట్టలేకపోతున్నామనే భావన ఎక్సైజ్‌ వర్గాల్లో ఉంది. దుకాణాల నిర్వహణను ప్రైవేటు వ్యాపారులకు అప్పగిస్తే కమీషన్‌ సొమ్ము కోసం వివిధ మార్గాల్లో విక్రయాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తారని భావిస్తున్నారు. పూర్తిగా వృత్తి నైపుణ్యంతో వ్యాపారం చేస్తారని, బీర్ల చల్లదనం కోసం కూలర్ల ఏర్పాటు, అవసరమైన ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోగలరని, పర్మిట్లు రూమ్‌ల వంటివి వస్తాయని.. వీటన్నింటి వల్ల మద్యం మరింత ఎక్కువగా అమ్ముడవుతుందని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నెలకు 19 వందల కోట్ల విలువైన మద్యం విక్రయిస్తున్నారు. అదే ప్రైవేటుకు దుకాణాలు అప్పగిస్తే నెలకు కనీసం 3 వేల కోట్ల విలువైన మద్యం అమ్మొచ్చనేది అబ్కారీ శాఖ అంచనా. మద్యం దుకాణాల్ని ప్రైవేటు వ్యాపారులకు అప్పగిస్తూ విధానాన్ని ప్రకటిస్తే.. దరఖాస్తు రుసుము, లైసెన్సు ఫీజులు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల రూపంలో ఇప్పటికప్పుడు వెయ్యి కోట్ల రూపాయిలకు పైగానే ఆదాయం సమకూరుతుందని అంచనా. గతంతో పోలిస్తే మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగానే పెరిగినా.. విక్రయాల పరిమాణం మాత్రం తగ్గింది. వాస్తవంగా రాష్ట్రంలో మద్యానికి డిమాండ్ బాగున్నా.. ఆ మేరకు అమ్మకాల పరిమాణం పెరగడం లేదు. అలాగని వినియోగమూ తగ్గడం లేదు. కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెప్పించుకుంటున్నారు. ఇంకొంత మంది నాటుసారాకు అలవాటు పడ్డారు.

ఈ పరిస్థితుల్లో ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండి పడుతోందని భావిస్తున్న ఎక్సైజ్‌ శాఖ... ప్రైవేటు దుకాణాల్ని తెరపైకి తెస్తోంది. అన్ని బ్రాండ్లు అందుబాటులో లేకపోవడం, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మద్యం ధరలు అధికంగా ఉండటం, నాటుసారా తయారీ, వినియోగం విపరీతంగా పెరగడం, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, గోవా నుంచి సుంకం చెల్లించని మద్యం రాష్ట్రంలోకి పెద్దఎత్తున అక్రమంగా రవాణా అవుతుండటం, ఓ మాదిరి, ఖరీదైన బ్రాండ్లు తాగేవారిలో ఎక్కువ మంది ప్రభుత్వ దుకాణాల్లో మద్యం కొనడం మానేసి ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకోవడం లాంటి కారణాలతో.. ఏపీలో అమ్ముడవుతున్న మద్యం పరిమాణం తక్కువగా ఉంటోందనేది ఎక్సైజ్‌ శాఖ అభిప్రాయం. అందువల్ల ప్రైవేటుకు దుకాణాలు అప్పగిస్తే ఎక్కువ ఆదాయం రాబట్టుకోనే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాల ఆలోచనగా తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.