గోదారి గుప్పిట భద్రాద్రి.. నీటమునిగిన 95 గ్రామాలు

author img

By

Published : Jul 16, 2022, 4:45 AM IST

Updated : Jul 16, 2022, 5:06 AM IST

గోదారి గుప్పిట భద్రాద్రి

గోదావరి ఉగ్రరూపానికి భద్రాచలం చిగురుటాకులా వణికిపోతోంది. 32 ఏళ్ల తర్వాత నీటిమట్టం 70 అడుగులు దాటింది. అర్ధరాత్రి దాటిన తర్వాత వరద నిలకడగా మారుతుందని ప్రచారం సాగినప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో ముంపు తీవ్రత రెట్టింపయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 95 గ్రామాలు నీటమునిగాయి. ఇతర ప్రాంతాల్లోనూ ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. సుమారు 200 గ్రామాలకు మండల కేంద్రాలతో సంబంధాలు తెగిపోయాయి. ప్రజా, రవాణా, సమాచార వ్యవస్థలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముంపు ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.

గోదారమ్మ ఉగ్రరూపానికి భద్రాచలం చిగురుటాకులా వణికిపోతోంది. 32 ఏళ్ల తర్వాత నీటిమట్టం 70 అడుగులు దాటింది. గరిష్ఠంగా పోటెత్తిన వరద ప్రవాహం ప్రళయాన్ని తలపించింది. భద్రాచలం వద్ద శుక్రవారం రాత్రి పది గంటలకు 24.29 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. అక్కడ గంటగంటకు పెరుగుతున్న వరదతో ప్రజలు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రజలు ముప్పుతిప్పలు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పరీవాహక ప్రాంతంలో గోదావరి వరద ఉద్ధృతికి 95 గ్రామాలు నీటమునిగాయి. 77 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6,155 కుటుంబాలకు చెందిన 20,922 మందిని ఈ కేంద్రాలకు తరలించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వరద నిలకడగా మారుతుందని ప్రచారం సాగినప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో ముంపు తీవ్రత రెట్టింపయింది. పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వందల గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలు దెబ్బతిన్నాయి. సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దుమ్ముగూడెం, చర్ల మండలాలకు ఈ సమస్య తీవ్రస్థాయిలో తలెత్తడంతో సమాచార వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. సుమారు 200 గ్రామాలకు మండల కేంద్రాలతో సంబంధాలు తెగిపోయాయి. ప్రజా, రవాణా, సమాచార వ్యవస్థలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముంపు ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.

.
.

అలంకారప్రాయంగా పునరావాస కేంద్రాలు

  • పునరావాస కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. ఒక్క ముద్ద అన్నం కోసం చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నారు. శిబిరంలోకి ఎవరు వచ్చినా బుక్కెడు బువ్వ పెడతారేమోనని ఖాళీ గిన్నెలతో ఎదురొస్తూ కనిపిస్తున్నారు. సమయానికి భోజనం పెట్టక ఆకలితో ఇబ్బంది పడ్డారు. భద్రాచలం బీసీ బాలికల వసతి గృహంలో అన్నం కావాలని ధర్నా చేయాల్సి వచ్చింది. బీసీ బాలుర వసతి గృహంలోనూ ఇదే దుస్థితి నెలకొంది.
  • అశ్వాపురం మండలంలోని కుమ్మరిగూడెంలో గోదావరి తీరాన ఉన్న మిషన్‌ భగీరథ ప్రధాన ఇన్‌టేక్‌ వెల్‌, అనుబంధ విద్యుత్తు ఉపకేంద్రాలు ముంపునకు గురయ్యాయి. ఇదే మండల పరిధిలోని భారజల ప్లాంటులోకి వరద నీరు శుక్రవారం సాయంత్రం నుంచి క్రమంగా ప్రవేశిస్తోంది.
  • మణుగూరు సమీపాన ఉన్న భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రంలోని కోల్‌యార్డు వద్దకు వరద చేరింది. పరిస్థితి తీవ్రమైతే స్విచ్‌యార్డులోకి నీరు చేరే ప్రమాదం ఉంది. అదే జరిగితే యూనిట్లను షట్‌డౌన్‌ చేయక తప్పదు. మణుగూరు ఓపెన్‌ కాస్టుకు వరద ముప్పు ఏర్పడింది.
  • బూర్గంపాడు మండలంలోని ఐటీసీ కర్మాగారంలో ఉత్పత్తిని నిలిపివేశారు.

ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటన: గోదావరి వరద గుప్పిట్లో చిక్కుకున్న ముంపు ప్రాంతాల్లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కలెక్టర్‌ అనుదీప్‌ పర్యటించారు. భద్రాచలంలోని శాంతినగర్‌ కాలనీ, సుభాష్‌ నగర్‌ కాలనీల్లో మోకాలి లోతు వరదలో పర్యటించారు. పునరావాస కేంద్రాలకు వెళ్లని బాధితులతో మాట్లాడి కేంద్రాలకు తరలించారు.కరకట్టను పరిశీలించారు. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రికి ఫోన్‌ చేశారు. వరదల తీవ్రత, ముంపు ప్రాంతాల్లో అందిస్తున్న చర్యలపై ఆరా తీశారు.

.
.

మూడు జిల్లాల్లోని 75 గ్రామాల్లో వరదనీరు: మహోగ్ర రూపం దాల్చిన గోదావరి వరద 3 జిల్లాల్లో మొత్తం 241 గ్రామాలను ముంచెత్తింది. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల గ్రామాలపై వరద వచ్చిపడింది. శుక్రవారం రాత్రికి కూడా ఇంకా 75 గ్రామాల్లో వరదనీరు ఉంది. ఈ గ్రామాల్లో పొలాలు పూర్తిగా మునిగిపోగా పలు ఇళ్లలోకి నీరు చేరింది.

అంధకారంలోనే పలిమెల: వర్షం తగ్గినా గోదావరి వరద పోటెత్తుతుండడంతో తీర ప్రాంతాల ఊళ్లు ముంపులోనే ఉన్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహదేవపూర్‌, పలిమెల మండలాల్లోని దాదాపు 41 గ్రామాల్లోని 4 వేల మంది పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు. పలిమెల మండలం ఇంకా అంధకారంలోనే ఉంది. ములుగు జిల్లాలోని వెంకటాపురం ఏటూరు నాగారం, వాజేడు, మంగపేట, కన్నెపల్లి మండలాల్లోని 60 గ్రామాలకు వరద నీరు చేరింది.

నీటిలోనే కన్నెపల్లి పంపులు..: వరద నీట మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి(లక్ష్మీ) పంప్‌హౌస్‌ను మూసివేశారు. భారీగా వరద వస్తుండడం, నీటిని తోడే అవకాశం లేకపోవడంతో పంప్‌హౌస్‌లోని 17 మోటార్లు ముంపు నీటిలోనే ఉన్నాయి. దాదాపు 105 మీటర్ల వరకు పంప్‌హౌస్‌లో నీరు సమాంతరంగా ఉంది. 100 మీటర్ల కంటే తక్కువ ఉంటేనే నీరు తోడే వీలుంటుందని ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. అప్రోచ్‌ కెనాల్‌ నుంచి ఫోర్‌ బే లోకి వరద ఉద్ధృతంగా పంప్‌హౌస్‌లోకి చొచ్చుకురావడంతో రిటర్నింగ్‌ వాల్స్‌ దెబ్బతిన్నాయి. సుమారు 10 వరకు రిటర్నింగ్‌ వాల్స్‌ కూలిపోయాయి. అవి ఏసీలపై పడటంతో అవి కూడా దెబ్బతిన్నాయి.

ముంపు బాధితులతో అధికారుల వాగ్వాదం: వరద ముంపు నుంచి తప్పించుకోవడానికి బాధితులు వేసుకున్న డేరాలకు అటవీ సిబ్బంది అభ్యంతరం చెప్పడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కుదురుపల్లిలో చోటుచేసుకుంది. ఈ గ్రామాన్ని గోదావరి వరద చుట్టుముట్టడంతో స్థానికులు సమీపంలోని ఎత్తెన ప్రాంతాల్లో గురువారం డేరాలు వేసుకున్నారు. మహదేవపూర్‌ ఎఫ్‌డీవో వజ్రారెడ్డి, రేంజర్‌ కమల ఆధ్వర్యంలో సిబ్బంది శుక్రవారం అక్కడికి వెళ్లి.. ఇది అటవీ ప్రాంతమని చెబుతూ డేరాలను తొలగించే ప్రయత్నం చేయడంతో వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకున్నాయి.

.
.

ముఖ్యమంత్రి ఆదేశాలతో భద్రాచలానికి హెలికాప్టర్‌: భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక చర్యల కోసం కావాల్సిన పరికరాలను అందించేందుకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్‌ను పంపించింది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వినతిపై సీఎం కేసీఆర్‌ స్పందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఆదేశాలు జారీ చేయగా... ఆయన వైమానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే హెలికాప్టర్‌ బయల్దేరి వెళ్లింది. మంత్రి పువ్వాడ సూచనలతో భద్రాచలానికి 10 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఆర్మీకి చెందిన 5 బృందాలు, సింగరేణి రెస్క్యూ టీమ్‌లు చేరుకున్నాయి. తన వినతిపై సీఎం వెంటనే స్పందించి హెలికాప్టర్‌ను సమకూర్చడంతో మంత్రి పువ్వాడ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రత్యేక అధికారుల నియామకం: భద్రాచలంలో సహాయ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం భదాద్రి కొత్తగూడెం జిల్లా ప్రత్యేక అధికారిగా సీనియర్‌ ఐఏఎస్‌, సింగరేణి ఛైౖర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు శుక్రవారం జారీ చేసింది. వరదల నేపథ్యంలో తక్షణమే జిల్లాకు వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఐఏఎస్‌లు రజత్‌కుమార్‌ సైనీ, హనుమంతరావులను అదనపు ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ మరో ఉత్తర్వునిచ్చింది. వారిని సైతం వెంటనే భద్రాచలం వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించింది.

రాకపోకలు బంద్‌: కాళేశ్వరం వద్ద తెలంగాణ-మహారాష్ట్రను కలిపే అంతర్రాష్ట్ర వంతెన అప్రోచ్‌ రోడ్డు శుక్రవారం ఉదయం గోదావరి వరద ఉద్ధృతికి మహారాష్ట్ర చింతలపల్లి (సిరొంచా) వద్ద తెగిపోయింది. దీంతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మహారాష్ట్ర ప్రభుత్వం దీనిని రూ.250 కోట్లతో నిర్మించింది. 2016 డిసెంబరు 30న జరిగిన ప్రారంభోత్సవంలో అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, మన రాష్ట్రం నుంచి అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ రహదారి నిర్మాణం తర్వాత పలు రాష్ట్రాలకు రాకపోకలు సులువయ్యాయి. జాతీయ రహదారి అధికారులు త్వరలోనే దీనిని పునరుద్ధరించనున్నట్లు తెలిసింది.

.
.

రేపు భారీ వర్షాలు: ఒడిశా తీరంపై అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. శనివారం ఒక మోస్తరుగా, ఆదివారం భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ శుక్రవారం మీడియాకు తెలిపింది. శుక్రవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ అత్యధికంగా మహ్మదాబాద్‌ (మహబూబ్‌నగర్‌ జిల్లా)లో 1.4,మద్దూరు (నారాయణపేట)లో 1.2, బుర్దిపాడు (జోగులాంబ)లో 1.2, ధర్మవరం (ములుగు)లో ఒక సెంటీమీటరు వర్షం కురిసింది. కేవలం ఐదు ప్రాంతాల్లోనే 1 నుంచి 1.4 సెం.మీ.ల వర్షం కురిసింది.

సహాయక చర్యల్లో అపశ్రుతి: వరద సహాయక చర్యల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. నాటు పడవ బోల్తా పడి ఓ వ్యక్తి గల్లంతయ్యారు. బూర్గంపాడు భారతీభవన్‌ సమీపం నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు 10 మంది నాటుపడవ ఎక్కారు. సిబ్బంది ఇద్దరితో కలిసి పడవలో మొత్తం 12 మంది ప్రయాణిస్తున్నారు. స్థానిక మిల్లు సెంటర్‌ సమీపంలో స్తంభానికి ఢీకొని పడవ బోల్తా పడింది. దీంతో స్థానికులు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందానికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న బృంద సభ్యులు స్థానికుల సాయంతో 11 మందిని బయటకు తీశారు. వెంకటనర్సు గల్లంతయ్యారు.

జర్నలిస్ట్‌ మృతదేహం లభ్యం: గిరిజనులపై వార్త సేకరణకు వెళ్లి కారుతో సహా గల్లంతైన టీవీ జర్నలిస్ట్‌ జమీర్‌ (38) మరణించారు. శుక్రవారం ఆయన మృతదేహం లభ్యమైంది. జమీర్‌ తన మిత్రుడు ఇర్షాద్‌ ఆలీతో కలిసి జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలంలోని బోర్నపల్లి వెళ్లి తిరుగు ప్రయాణంలో రామాజీపేట శివారులోని కల్వర్టుపై వరద ప్రవాహంలో ముందుకు పోవడంతో కారు నీట మునిగింది. ఇర్షాత్‌ కారులోంచి బయట పడి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా జమీర్‌ ప్రవాహంలోనే చిక్కుకుపోయిన విషయం విదితమే. 60గంటల గాలింపు తర్వాత శుక్రవారం జమీర్‌ మృతదేహం కనిపించింది.

ఇవీ చూడండి

Last Updated :Jul 16, 2022, 5:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.