యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్లో దారుణ హత్యలకు గురైన ముగ్గురు బాలికల కేసులో వాదనలు తుది దశకు చేరుకున్నాయి. సాక్షుల వాంగ్మూలాలు, ఇరుపక్షాల తుది వాదనలు పూర్తయ్యేందుకు.. మరో వారం రోజులకు పైగా పట్టనున్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే..?
హాజీపూర్ శివారులో ముగ్గురు బాలికలు... దుండగుడి చేతిలో దారుణహత్యకు గురయ్యారు. గత మార్చి 8న ఓ బాలిక అదృశ్యమవగా... ఏప్రిల్ 25న మరో బాలిక కనిపించకుండా పోయింది. మరుసటి రోజు హాజీపూర్ శివారులోని బావిలో ఓ బాలిక మృతదేహం లభ్యమైంది. ప్రత్యేక దర్యాప్తు బృందాలతో విచారణ సాగించిన పోలీసులు.. అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి నిందితుడని గుర్తించారు.
అదృశ్యమైతే.. అస్థికలే లభ్యం
తమదైన శైలిలో పోలీసులు విచారణ నిర్వహించారు. ఏప్రిల్ 27న మరో బావిలో ఇంకొకరి అస్థికలు లభ్యమయ్యాయి. అవి గతంలో కనిపించకుండా పోయిన ఓ విద్యార్థినివని తేల్చడంతో.. వరుస హత్య కేసులు సంచలనంగా మారాయి. నిందితుడిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.
వాంగ్మూలాలు నమోదు
రాచకొండ కమిషనరేట్ పోలీసులు దర్యాప్తు నిర్వహించగా... పోక్సో చట్టం కింద కేసు నమోదైన దృష్ట్యా నల్గొండ మొదటి అదనపు సెషన్స్ కోర్టు అనుబంధ పోక్సో చట్టం న్యాయస్థానంలో కేసు నడుస్తోంది. మూడు కేసుల్లో నూటా ఒక్క మంది వాంగ్మూలాలు నమోదు చేశారు. వీటిపై విచారణ సాగిస్తున్న న్యాయస్థానం... నిందితుడిని రేపు తమ ఎదుట ప్రవేశపెట్టాలని ఆదేశించింది. దీంతో ఇందుకు సంబంధించి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇరు పక్షాల వాదనలు విననున్న కోర్టు
సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను.. నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి చదివి వినిపించనున్నారు. అవన్నీ విన్న తర్వాత.. శ్రీనివాస్ రెడ్డి నుంచి సేకరించిన అభిప్రాయాన్ని నమోదు చేస్తారు. అనంతరం వీటిపై ఇరు పక్షాల న్యాయవాదుల నడుమ.. వాదనలు సాగనున్నాయి. అవి పూర్తయ్యాక.. తీర్పు వెల్లడి కానుంది.
తీర్పుపై ఉత్కంఠ..?
నిందితుడికి వాంగ్మూలాలు వినిపించడం, అభిప్రాయాన్ని నమోదు చేయడంతోపాటు న్యాయవాదుల వాదనలకు వారానికి పైగా సమయం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో తీర్పు ఎప్పుడు వస్తుందా అన్న ఉత్కంఠ... అందరిలోనూ కనిపిస్తోంది.
హాజీపూర్ వరుస హత్యల కేసుపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. త్వరలోనే తీర్పు అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇలా అనవసర ప్రచారం సాగుతుండటంపై కోర్టు కూడా దృష్టిసారించినట్లు సమాచారం.
ఇవీ చూడండి: రోకలిబండతో మోది భార్యను హత్యమార్చిన భర్త