ETV Bharat / city

BONALU: తెలంగాణ సంస్కృతికి ప్రతీక.. ఉజ్జయిని మహంకాళి బోనాలు

author img

By

Published : Jul 25, 2021, 7:15 AM IST

తెలంగాణలో ప్రధానంగా జరపుకునే పండుగల్లో బోనాలు ఒకటి. ఈ బోనాల పండుగ సంస్కృతికి సంప్రదాయాల‌కు నిలువెత్తు నిద‌ర్శనం. బోనాల్లో పోతురాజుల విన్యాసం, ఘ‌టాల ఊరేగింపు ప్రత్యేక ఆక‌ర్షణ‌గా నిలుస్తాయి. వేలాది మంది భ‌క్తులు ఉజ్జయిని మ‌హంకాళి అమ్మవారికి బోనాలు స‌మ‌ర్పిస్తారు. బోనాల వేడుకల్లో పలు కార్యక్రమాలు ఉంటాయి. ఘటోత్సవంతో ప్రారంభమైన వేడుక.. రంగం తర్వాత ఊరేగింపుతో ముగుస్తుంది.

BONALU: తెలంగాణ సంస్కృతికి ప్రతీక.. ఉజ్జయిని మహంకాళి బోనాలు
BONALU: తెలంగాణ సంస్కృతికి ప్రతీక.. ఉజ్జయిని మహంకాళి బోనాలు

ఆషాఢం వస్తూనే తెలంగాణకు బోనాల సందడిని మోసుకొస్తుంది. జులై మూడో వారంలో జరిగే లష్కర్ బోనాలతో హడావుడి మొదలైపోయినట్లే. తలపై బోనం పెట్టుకుని భక్తి శ్రద్ధలతో ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంటికి చేరుకుంటారు. లష్కర్​ బోనాలు ప్రారంభమైన నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రతి ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహ‌ణ మాత్రం య‌థావిధిగా నిర్వహిస్తున్నట్లు ఆల‌య నిర్వాహ‌కులు తెలిపారు. ఎలాంటి లోటు లేకుండా బోనాల పండుగ క‌న్నుల పండువ‌గా కొన‌సాగిస్తామ‌న్నారు.

ఫ‌ల‌హార బండ్లు

ప‌దిహేను రోజుల పాటు జ‌రిగే బోనాల వేడుక ఆషాఢ‌మాసం మొద‌టి ఆదివారం ఘ‌టోత్సవంతో ప్రారంభ‌మ‌వుతుంది. మూడో ఆదివారం వేలాది మంది ప్రజ‌లు అక్కడి అమ్మవారికి బోనాలు స‌మ‌ర్పిస్తారు. రెండు రోజుల పాటు జ‌రిగే ఉత్సవాల్లో మొద‌టి రోజు బోనాలు, రెండో రోజు రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. భ‌క్తులు అమ్మవారికి బోనంతోపాటు శాక‌ను కూడా స‌మ‌ర్పిస్తారు. శాక అంటే ప‌సుపు చెట్టుకొమ్మ ప‌సుపు నీటితో నింపిన పాత్రలో వేప‌కొమ్మను ఉంచి ఆల‌యానికి చేరుకుని మాతాంగేశ్వరికి స‌మ‌ర్పిస్తారు. నీరు వేపాకు ఎలా చ‌ల్లద‌నాన్ని ఇస్తాయో.. అలాగే ఆ శాక స‌మ‌ర్పించిన వారికి ఆ త‌ల్లి చ‌ల్లని దీవెన‌లు ప్రసాదిస్తుంద‌ని విశ్వాసం. అమ్మవారికి ఇష్టమైన ప‌దార్థాల‌ను ఇంట్లో త‌యారు చేసుకుని ఓ బండిలో పెట్టుకుని ఊరేగిస్తూ.. వ‌చ్చి అమ్మవారికి స‌మ‌ర్పించి మిగిలిన‌ది మ‌హా ప్రసాదంగా అంద‌రూ పంచుకుని తింటారు. వీటినే ఫ‌ల‌హార బండ్లు అంటారు. ఈ ఉత్సవంలో మరో ప్రధాన ఆక‌ర్షణ తొట్టెలు. రంగు రంగుల అట్టల‌తో త‌యారు చేసిన తొట్టెల‌ను ఊరేగింపుగా తీసుకొచ్చి మొక్కు తీర్చుకుంటారు.

మ‌హంకాళిగా నామ‌క‌ర‌ణం

1815లో సురుటి అప్పయ్య అనే మిల‌ట‌రీ ఉద్యోగి ఇక్కడ అమ్మవారి చెక్క విగ్రహ ప్రతిష్ఠ చేసి ఉజ్జయిని మ‌హంకాళిగా నామ‌క‌ర‌ణం చేశారు. అప్పట్లో ఈ ఆల‌యం ఉన్న ప్రాంతమంతా బండ‌రాళ్లు చెట్లతో నిండి ఉండేది. ప‌క్కనే ఉన్న పెద్దబావి మ‌ర‌మ్మతులు చేస్తుండ‌గా మాణిక్యాల‌మ్మ విగ్రహం దొరికింది. ఆ విగ్రహాన్ని కూడా గ‌ర్భగుడిలో మ‌హంకాళి అమ్మవారి ప‌క్కనే ప్రతిష్ఠించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు చెక్క విగ్రహాల స్థానంలో అమ్మవారి విగ్రహాల‌ను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి పూర్తిస్థాయిలో ఆల‌యాన్ని నిర్మించారు. అప్పటి నుంచి వారి వార‌సులే జాత‌ర నిర్వహిస్తూ వ‌చ్చారు. ఈ దేవాల‌యాన్ని19వ శతాబ్దంలో దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖ అధీనంలోకి తీసుకుంది.

పోతురాజుల విన్యాసాలు

ఒళ్లంతా ప‌సుపు పూసుకుని క‌ళ్లకు కాటుక నుదుట కుంకుమ పెట్టుకుని లంగోటి ధ‌రించి కాళ్లకు గ‌జ్జెక‌ట్టి.. నోట్లో నిమ్మకాయ పెట్టుకుని పసుపుతాడును జులిపిస్తూ.. డ‌ప్పు చ‌ప్పుళ్లకు అనుకూలంగా నృత్యం చేస్తూ భ‌క్తుల‌ను పార‌వ‌శ్యంతో పోతురాజులు రంజింప‌జేస్తారు. ఈ పోతురాజులు పూర్వం త‌ల‌మీద పోతుల‌ను పెట్టుకుని ఊరేగేవాళ్లు. అమ్మవారికి సోద‌రుడైన పోతురాజు గ్రామాన్ని సంర‌క్షిస్తూ అండ‌గా ఉంటాడ‌న్నది భ‌క్తుల న‌మ్మకం. ఈసారి పోతురాజుల విన్యాసాలు కూడా చూసే భాగ్యం భ‌క్తుల‌కు లేదు. ఒకరిద్దరు పోతురాజులను అనుమతించే ఆలోచన చేస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.

రేపు రంగం

బోనాల మ‌రుసటి రోజు రంగం ఉంటుంది. ఆల‌య మండ‌పంలో జోగినిగా మారిన స్త్రీ అమ్మవారి వంకే చూస్తూ.. అమ్మవారి క‌ళ‌ను ఆవ‌హించుకుని భ‌విష్యత్తులో జ‌రిగే ప‌రిణామాల‌ను చెబుతుంది. ఈమెనే మాతాంగి అంటారు. ఈ మొత్తం కార్యక్రమాన్నే రంగం అంటారు. దీన్ని ప్రత్యక్షంగా వేలాది భ‌క్తులు, ప‌రోక్షంగా ల‌క్షలాది మంది భ‌క్తులు వీక్షిస్తుంటారు.

రంగం త‌ర్వాత అమ్మవారి చిత్రప‌టాన్ని ప్రత్యేకంగా అలంక‌రించిన ఏనుగుపై ఉంచి మంగ‌ళ‌ వాద్యాలు, క‌ళాకారులు, ఆట‌పాట‌ల‌తో ఊరేగించుకుంటూ సాగ‌నంప‌డంతో బోనాల సంబురం ముగు‌స్తుంది. ఈసారి ఆలయ పర్యవేక్షకుల సమక్షంలోనే ఇది జరగనుంది.

ఇదీ చదవండి: BONALU: ప్రారంభమైన లష్కర్​ బోనాలు.. పోటెత్తిన భక్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.