'ఎవ్వరూ అధైర్య పడాల్సిన పనిలేదు.. కార్యకర్తలారా.. ధైర్యంగా ఉండండి.. రోడ్ల మీదకు రండి కొట్లాడుదాం.. ఎవరొస్తారో చూద్దాం.. ఎన్ని వేల మందిని పోలీస్ స్టేషన్లలో పెడతారో చూద్దాం.. లక్షలాదిగా కదిలొద్దాం.. కేసీఆర్ ఫాంహౌస్లో బందీ అయిన తెలంగాణ తల్లిని విడిపిద్దాం' అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా.. కాంగ్రెస్ చేపట్టిన చలో రాజ్భవన్ కార్యక్రమంలో ఉద్రిక్తత తలెత్తిన నేపథ్యంలో రేవంత్రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అంబర్పేట్ ఠాణాకు తరలించారు. అనంతరం విడిచిపెట్టారు.
పోలీసులు ఇలానే అడ్డుకుంటుంటే.. భవిష్యత్లో పోలీస్ స్టేషన్ల ముట్టడి కార్యక్రమం, జైల్ భరో కార్యక్రమం ఉంటుందని రేవంత్ హెచ్చరించారు. 'ఎన్ని లక్షల మందిని జైల్లో పెడతారో చూస్తాం.. జైలు, ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి.. కేసీఆర్ ఫాం హౌస్లో బందీ అయిన తెలంగాణ తల్లిని విడిపిస్తాం' అన్నారు. 70 సార్లు ఇంధన ధరలు పెంచారంటూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయపన్ను పెంచితే.. సంపాదించేవారిపైనా అదనపు భారం పడుతుందని.. అదే గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు పెంచితే.. సామాన్య, మధ్యతరగతిపై పెనుభారం మోపినట్లవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
'ఒక్క సంవత్సరంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలు. ఈ ఏడాది 4 లక్షల 30 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఏడు సంవత్సరాల్లో 30 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇవాళ కేసీఆర్ అనుకుంటే లీటరు పెట్రోల్పై రూ.30, మోదీ తలచుకొంటే మరో రూ.30 తగ్గిచ్చొచ్చు. వాస్తవానికి 50 నుంచి 60 రూపాయలకే పెట్రోల్, డీజిల్ ఇచ్చే పరిస్థితి ఉంటే.. వీళ్లు ఇవ్వకుండా దొచుకుంటున్నారు.'
- రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇజ్రాయెల్ సాంకేతికతతో .. రాజకీయ నేతల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేటుగా హ్యాకర్స్ పెట్టి ప్రజల పక్షాన పోరాడుతున్న నేతల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారన్నారు. కోకాపేట భూముల వేలం వ్యవహారంలో వెయ్యి కోట్ల రూపాయల భూ కుంభకోణం జరిగిందని.. అందులో మొత్తం తెరాస నేతలే ఉన్నారని రేవంత్ పేర్కొన్నారు. వాటికి సంబంధించిన వివరాలను శనివారం వెల్లడిస్తానని తెలిపారు.
'కేసీఆర్కు కాలం చెల్లిపోయింది. రాబోయేది సోనియమ్మ రాజ్యం. పదేళ్లు అధికారంలో ఉంటాం. మీరు రిటైర్ అయిపోయినా.. పారిపోయినా.. చర్యలు తీసుకుంటాం. కేసీఆర్ బంధువులు ఇతర దేశాల్లో పాస్పోర్టులు తెచ్చుకుంటున్నారు. తొందరలోనే వాటి వివరాలు సైతం బయటపెడతా. మీరు ఏ అవినీతికి పాల్పడకపోతే.. ఇతర దేశాల పాస్పోర్టులు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది.'
- రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
చలో రాజ్భవన్ కార్యక్రమానికి.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఎన్ని ఆంక్షలు విధించినా.. పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ అన్నారు.
ఇదీచూడండి: Ys Sharmila : 'రాసి పెట్టుకోండి... ప్రభంజనం సృష్టిస్తా..'