వాట్సప్​లో వార్త ఫార్వర్డ్​..! సీఐడీ అదుపులో సీనియర్​ జర్నలిస్ట్​..

author img

By

Published : Sep 23, 2022, 9:18 AM IST

వాట్సప్​లో వార్త ఫార్వర్డ్​..! సీఐడీ అదుపులో సీనియర్​ జర్నలిస్ట్​ అంకబాబు

Journalist Ankababu in CID Custody: వాట్సప్​లో ఓ వార్తను ఫార్వర్డ్​ చేసినందుకు సీనియర్​ జర్నలిస్ట్​ను సీఐడీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అంకబాబును వెంటనే విడిచిపెట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్​ చేశారు. అక్రమ కేసులు, అరెస్టులతో సీఐడీ చట్ట ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు.

Journalist Ankababu in CID Custody: సామాజిక మాధ్యమాల్లో పోస్టు ఫార్వర్డ్‌ చేశారంటూ 73 ఏళ్ల వృద్ధుడైన సీనియర్‌ జర్నలిస్టు కొల్లు అంకబాబును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని విజయవాడ ప్రకాశం రోడ్డులోని అంకబాబు నివాసానికి గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో సివిల్‌ డ్రెస్‌లో ఉన్న 8 మంది సీఐడీ అధికారులు వెళ్లారు. వారిలో ఒక మహిళ ఉన్నారు. తాము సీఐడీ అధికారులమని, తమ వెంట రావాలని కోరారు.

అంకబాబు సతీమణి ఎక్కడికి తీసుకెళ్తున్నారని వారిని ప్రశ్నించగా.. తాము సీఐడీ అధికారులమని, గన్నవరం విమానాశ్రయంలో ఇటీవల వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్‌కు సీఎంవోలోని ఓ కీలక అధికారికి సంబంధం ఉన్నట్లు అంకబాబు వాట్సప్‌లో పోస్టులు ఫార్వర్డ్‌ చేశారని, వాటిపై ప్రశ్నించేందుకు తీసుకెళ్తున్నామని సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఓ అరగంట పాటు ప్రశ్నించి పంపించేస్తామంటూ అంకబాబును బలవంతంగా తీసుకెళ్లారు.

ఎలాంటి ముందస్తు నోటీసులు, సమాచారం ఇవ్వకుండానే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 9.30 గంటల సమయంలో గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించి అక్కడే ఉంచారు. అయితే గురువారం రాత్రి 11.30 గంటల వరకూ అంకబాబును అదుపులోకి తీసుకున్నట్లు గానీ, అరెస్టు చేసినట్లు గానీ సీఐడీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ఇదిలా ఉండగా.. తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకుడు రావిపాటి సాయికృష్ణ, తెదేపా కార్యకర్తలు సీఐడీ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి పంపేశారు.

బలవంతంగా తీసుకెళ్లారని భార్య ఫిర్యాదు.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించి తన భర్తను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారంటూ అంకబాబు భార్య విజయ రాత్రి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలకు లేఖ రాశారు. ‘అరెస్టు మెమో ఇవ్వకుండానే నా భర్తను తీసుకెళ్లారు. ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. నా భర్తను వెంటనే విడుదల చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. సూర్యారావుపేట పోలీసుస్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు.

ఏమైనా జరిగితే పోలీసులదే బాధ్యత..: సీనియర్‌ జర్నలిస్టు అంకబాబు అరెస్టు విషయంలో ప్రభుత్వం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడంతో పాటు వాక్‌ స్వాతంత్య్రం, పత్రికా స్వాతంత్య్రాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిందని తెదేపా అధినేత చంద్రబాబు డీజీపీకి గురువారం రాత్రి లేఖ రాశారు. అంకబాబుకు ఏమైనా జరిగితే పోలీసుశాఖ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వెంటనే అంకబాబును విడుదల చేయాలని ఆ లేఖలో డిమాండ్​ చేశారు.

  • విజయవాడ లో సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నాను. వాట్స్యాప్ లో ఒక వార్తను ఫార్వార్డ్ చేసిన కారణం గానే అరెస్ట్ చేస్తారా? 73 ఏళ్ల వయసున్న ఒక జర్నలిస్ట్ ను అరెస్ట్ చెయ్యడం జగన్ ఫాసిస్ట్ మనస్తత్వాన్ని చాటుతుంది. వెంటనే అంకబాబు గారిని విడుదల చెయ్యాలి. pic.twitter.com/MEFiVAZ5MY

    — N Chandrababu Naidu (@ncbn) September 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అదుపులోకి తీసుకోవటం అప్రజాస్వామికం..: ‘సీనియర్‌ జర్నలిస్టు అంకబాబును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకోవటం అన్యాయం. వాట్సప్‌లో ఒక మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేసినందుకు ఇలా వ్యవహరించటం అప్రజాస్వామికం. ఆయన్ను వెంటనే విడుదల చేయాలి’ అని ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్‌, ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు ఒక ప్రకటనలో డిమాండు చేశారు.

ఇవీ చదవండి:

విభజన సమస్యలపై బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతోన్న సర్కార్..

అదుపు తప్పి రెండు బస్సులు బోల్తా.. 12 మంది మృతి.. 31 మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.