టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో మెజార్టీ అభిప్రాయం కాకుండా ఏకాభిప్రాయం సాధించాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్కు చెప్పినట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. వ్యక్తిగతంగా కలిసినప్పుడు తమ అభిప్రాయాలు చెప్పామని... ఇవాళ ముగ్గురు ఎమ్మెల్యేలం కలిసి ఈ మేరకు విన్నవించినట్లు తెలిపారు. ఈ విషయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డిని తాము భాగస్వామ్యం చేయడంలేదని స్పష్టం చేశారు.
సీఎల్పీలో తాము సమావేశమైన వివరాలను బయటకు చెప్పలేనని పేర్కొన్న జగ్గారెడ్డి... ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చీలిపోకుండా ఉండేందుకు మాణిక్కం ఠాగూర్ను కలిశామన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలము ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి తమ మనసులో ఉన్న మాటను వివరించామన్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఠాగూర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. జరుగుతున్న ప్రచారం దృష్ట్యా తొందరపడి నిర్ణయం తీసుకోవవద్దని చెప్పినట్లు వివరించారు. సోనియా గాంధీ అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు.