చిన్నపాటి చిక్కులతో..
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఏడాదిన్నర క్రితం రైల్వే పై వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు. 90శాతం పనులు ఏడాది వ్యవధిలో ముగిశాయి. కైతలాపూర్ వైపు 10శాతం నిర్మాణం పనులు ఆగిపోయాయి. వంతెన కోసం సేకరించిన భూమిలో తమ ఇళ్ల స్థలాలు ఉన్నాయంటూ నలుగురైదుగురు కలిసి హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కేసు కోర్టు విచారణలో ఉంది. కళ్ల ముందు పైవంతెన కనిపిస్తున్నా.. చిన్నపాటి చిక్కుల వల్ల పనులు పూర్తికాకపోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.
చొరవ తీసుకున్నా పెండింగ్..
పలు కాలనీవాసుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రైల్వే పైవంతెన నిర్మాణం చేయాలని సంకల్పించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదించి నిధులు మంజూరు చేయించారు. సుమారు 90 కోట్ల వ్యయంతో ఏడాదిన్నర క్రితం నిర్మాణాన్ని ప్రారంభించారు. రైల్వే అధికారులతో చర్చించి పై వంతెన వేగంగా పూర్తయ్యేలా చొరవ తీసుకున్నారు. వివేకానందనగర్ వైపు వంతెన పూర్తైనప్పటికీ ఖైతలాపూర్ వైపు మాత్రం పెండింగ్లో పడటంతో పైవంతెన అందుబాటులోకి రాలేదు.
న్యాయస్థానం ఆదేశాలతో..
స్థల సేకరణ సందర్భంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పరిహారం చెల్లించారు. ఖైతలాపూర్ వైపు వంతెన పక్కన ఉన్న స్థల యజమానులు మాత్రం పరిహారం ఎక్కువగా ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం విచారణ దశలో ఉండటంతో పనులు జరగటం లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు పరిహారం చెల్లించి వీలైనంత త్వరలో పైవంతెన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకోస్తామని తెలిపారు. స్థల యజమానులు ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని పైవంతెన నిర్మాణానికి సహకరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: