ETV Bharat / city

భారత్ బయోటెక్​ను సందర్శించిన ప్రధాని.. కొవాగ్జిన్ సన్నద్ధతపై సమీక్ష

author img

By

Published : Nov 28, 2020, 7:28 PM IST

Updated : Nov 28, 2020, 8:56 PM IST

కరోనా వ్యాక్సిన్ సన్నద్ధతలో భాగంగా ప్రధాని మోదీ హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ను సందర్శించారు. వ్యాక్సిన్ పనితీరు, క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలు శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. భారత్‌ బయోటెక్‌-ఐసీఎంఆర్​ సంయుక్తంగా తయారు చేస్తున్న కొవాగ్జిన్ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలపై శాస్త్రవేత్తలను ప్రధాని అభినందించారు.

prime minister naredra modi visited bharath biotech in hyderabad
'భారత్ బయోటెక్​'లో ప్రధాని.. కొవాగ్జిన్ సన్నద్ధతపై పరిశీలన

భారత్ బయోటెక్​ను సందర్శించిన ప్రధాని.. కొవాగ్జిన్ సన్నద్ధతపై పరిశీలన

హైదరాబాద్‌ వచ్చిన ప్రధాని మోదీ హకీంపేట నుంచి.. నేరుగా జినోమ్‌వ్యాలీలోని భారత్ బయోటెక్‌కు చేరుకున్నారు. అక్కడ సంస్థ ప్రతినిధులు ప్రధానికి స్వాగతం పలికారు. భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణా ఎల్లా దంపతులు సహా శాస్త్రవేత్తలతో మోదీ సమావేశమయ్యారు. ఐసీఎంఆర్​-భారత్‌ బయోటెక్‌ సంయుక్తంగా తయారు చేస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్.. కొవాగ్జిన్‌కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్‌ తయారీ, దాని పనితీరు తదితర వివరాలపై చర్చించారు. క్లినికల్‌ ట్రయల్‌లో భాగంగా భారత్‌ బయోటెక్‌ రూపొందిస్తున్న కొవాగ్జిన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడోదశ పరీక్షలు జరుగుతున్నాయి. రెండు దశల్లోనూ స్వదేశీ కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ మంచి ఫలితాలు చూపింది. అందుకు సంబంధించిన వివరాలును భారత్‌ బయోటెక్‌ శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు. క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలపై శాస్త్రవేత్తలను మోదీ అభినందిస్తూ ప్రధాని ట్వీట్‌ చేశారు.

వ్యాక్సిన్​ పనితీరుపై ప్రధాని ఆరా

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌లు వివిధ దశల్లో ఉండగా.. స్వదేశీ టీకాలో భారత్‌ బయోటెక్‌ రూపొందిస్తున్న కొవాగ్జిన్ ముందుంది. జైడస్‌ క్యాడిలా తయారు చేస్తున్న జైకోవ్‌-డీ వ్యాక్సిన్ రెండో దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఉదయం అహ్మదాబాద్ వెళ్లిన ప్రధాని జైడస్‌ క్యాడిలాను సందర్శించారు. వ్యాక్సిన్ పనితీరు.. ప్రయోగాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జినోమ్‌వ్యాలీకి వచ్చిన ప్రధాని మోదీ భారత్‌ బయోటెక్‌ శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. వ్యాక్సిన్ సమర్థత, క్లినికల్‌ ట్రయల్స్‌ తదితర అంశాలపై ఆరా తీశారు. ప్రపంచంలోనే తొలి బీఎస్​-త్రీ ల్యాబ్‌ను సందర్శించిన ప్రధాని.. వ్యాక్సిన్‌ తయారీని పరిశీలించారు. అనంతరం జినోమ్‌వ్యాలీ నుంచి పుణె బయల్దేరిన ప్రధాని .. వాహనం ఆపి ప్రజలకు అభివాదం చేశారు. ఆ తర్వాత హకీంపేటకు బయల్దేరారు. అక్కన్నుంచి ప్రత్యేక విమానంలో పుణెకు వెళ్లారు.

ఇటీవలే సమీక్షించిన ప్రధాని

కరోనా వ్యాక్సిన్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే పంపిణీ ప్రక్రియకు సంబంధించి కార్యాచరణ రూపొందించింది. అందులోభాగంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ ఇటీవలే ప్రధాని సమీక్షించారు. వ్యాక్సిన్‌ నిల్వచేసుకునే సదుపాయాలతోపాటు పంపిణీ ప్రధాన్యాలు వివరించారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ నేరుగా వ్యాక్సిన్ తయారీ సంస్థలను సందర్శిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

భారీ బందోబస్తు

హైదరాబాద్‌ వచ్చిన ప్రధాని మోదీకి హకీంపేట ఎయిర్‌ఫోర్స్ కమాండెంట్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, సైబరాబాద్ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్​, ఎయిర్ ఫోర్స్ అధికారులు స్వాగతం పలికారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలతో పాటు భద్రతను కట్టుదిట్టం చేశారు. హకీంపేట విమానాశ్రయం నుంచి జినోమ్‌వ్యాలీకి వరకు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.

ఇవీ చూడండి: జినోమ్‌వ్యాలీలోని భారత్ బయోటెక్‌ను సందర్శించిన ప్రధాని

Last Updated : Nov 28, 2020, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.