ETV Bharat / city

Students in Ukraine: ఉక్రెయిన్‌లో పిల్లలు... తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

author img

By

Published : Feb 26, 2022, 6:55 PM IST

Students in Ukraine: ఉక్రెయిన్​లో తమ పిల్లలు చిక్కుకుపోవటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్​లోని పరిణామాలతో తల్లడిల్లుతున్నారు. ఉక్రెయిన్​లో వివిధ ప్రాంతాలలో వైద్య విద్యనభ్యసిస్తున్న తమ వారిని క్షేమంగా స్వస్థలాలకు చేర్చాలని ఏపీ ప్రభుత్వాన్ని ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Students
Students

Students in Ukraine: ఏపీ ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం ఐటీఐ కాలనీకి చెందిన యర్రా సుబ్రహ్మణ్యం, మల్లీశ్వరీల కుమార్తె అఖిల, చినగంజాం మండలం రాజుబంగారుపాలెంకు చెందిన కల్లూరి జయప్రతాప్ ఉక్రెయిన్​లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నారు. తాము క్షేమంగానే ఉన్నామని చెప్పారు. తాము ఉంటున్న ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉన్నా.. భయంగా గడుపుతున్నట్లు ఫోనులో తెలిపారు.

అఖిల
అఖిల

Russia Ukraine War: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 423 మంది ఏపీ విద్యార్థులను మ్యాపింగ్ చేశామని టాస్క్​ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు వెల్లడించారు. మ్యాపింగ్ చేసిన వాళ్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సూచనలిస్తున్నామని చెప్పారు. 23 మంది విద్యార్థులు వస్తున్నారని కేంద్రం సమాచారమిచ్చిందన్న కృష్ణబాబు.. ఏపీకి చెందినవారు ముగ్గురే ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు.

జయప్రతాప్
జయప్రతాప్

423 మంది ఏపీ విద్యార్థులను మ్యాపింగ్ చేశాం: కృష్ణబాబు

దిల్లీ ఎయిర్‌పోర్టులో ఏపీ భవన్ తరఫున హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశామని కృష్ణబాబు చెప్పారు. దిల్లీకి వచ్చినవాళ్లను స్వస్థలాలకు పంపేదుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. సరిహద్దు ప్రాంతాలకు వెళ్లొద్దని భారతీయులకు సూచనలు వచ్చాయన్నారు.

'ఉక్రెయిన్‌లోని 7 వర్సిటీల్లో ఏపీ విద్యార్థులు చదువుతున్నారు. వర్సిటీల సమీపంలోని రొమేనియన్ ఎంబసీని సంప్రదిస్తున్నాం. విద్యార్థులు తప్ప ఉక్రెయిన్‌లోని ప్రవాసాంధ్రులు మమ్మల్ని సంప్రదించలేదు. ఎంతమంది ఆంధ్రులు ఉక్రెయిన్‌లో ఉన్నారనే వివరాలు రాబడుతున్నాం. వీసా స్టాపింగ్, ఐబీ, విదేశీ విద్యలకు పంపే ఏజెన్సీల ద్వారా సమాచార సేకరణ చేపట్టాం'
- కృష్ణబాబు, టాస్క్​ఫోర్స్ కమిటీ ఛైర్మన్

సమాచారం లేకుండా సరిహద్దులకు వెళ్లొద్దు..

Ukraine indian embassy: అధికారులతో సమన్వయం లేకుండా బోర్డర్ పోస్టుల వద్దకు వెళ్లవద్దంటూ ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు కేంద్రం సూచించింది. కీవ్ సహా ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై రష్యా దాడులు పెరుగుతున్న వేళ ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం నూతన అడ్వైజరీని జారీ చేసింది. సరిహద్దు పాయింట్ల వద్ద పరిస్థితి సున్నితంగా ఉందని రాయబార కార్యాలయం పేర్కొంది. అధికారులతో సమన్వయం లేకుండా సరిహద్దు పోస్టులకు వెళ్లవద్దని సూచించింది. ముందస్తు సమాచారం లేకుండా వెళ్తే సాయం చేయడం కష్టమని పేర్కొంది. ఉక్రెయిన్‌ పశ్చిమ నగరాల్లో వసతులు ఉన్నచోట ఉండటం సురక్షితమని సూచించింది. పరిస్థితిని తెలుసుకోకుండా సరిహద్దు చెక్ పాయింట్‌లకు వెళ్లవద్దని పేర్కొంది.

తూర్పు ఉక్రెయిన్‌లో తదుపరి సూచనలు చేసేవరకూ ఇళ్లల్లోనే ఉండాలన్న రాయబార కార్యాలయం అన్ని వేళల పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.